బీఅలర్ట్: బ్యాంకు పనివేళల్లో మార్పులు, రైతులకూ సిబిల్ స్కోర్
అమరావతి: ప్రభుత్వరంగ బ్యాంకుల పనివేళల్లో అక్టోబర్ 1వ తేదీ నుంచి మార్పులు చోటు చేసుకున్నాయి. స్థానిక అకౌంట్ హోల్డర్ల అవసరాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచించిన మూడు రకాల పనివేళల్లో ఒక దానిని అమలు చేస్తారు. దేశంలోని 400 జిల్లాల్లో ఖాతాదారులకు బ్యాంకు సేవలన్ని మరింత చేరువ చేసేందుకు ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపడుతున్నారు.
భారీ డిస్కౌంట్, 7,000 వరకు క్యాష్బ్యాక్, లోన్ తీసుకుంటే...
బ్యాంకులకు 3 పనివేళల ఆప్షన్స్
భారత బ్యాంకర్ల సంఘం (IBA) సూచనల మేరకు మూడు రకాల పనివేళలను రూపొందించారు.
మొదటిది... ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.
రెండోది... ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.
మూడోది... ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
బ్యాంకులు ఈ మూడు రకాల పని వేళల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లాస్థాయి సంప్రదింపుల సమితిలో చర్చించి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితికి పంపిస్తారు. వారి ఆమోదంతో ఈ పనివేళలను అమలు చేస్తారు.
3వ తేదీ నుంచి రుణమేళా
ప్రభుత్వరంగ బ్యాంకులు రుణాల కోసం లోన్ మేళాలు ఏర్పాటు చేయనున్నాయి. పర్సనల్, వెహికిల్, స్టడీ, హోమ్ లోన్తో పాటు ఎంఎస్ఎంఈ, పంట రుణాల వంటివి ఇవ్వనున్నారు. ఖాతాదారులు తమ ఆదాయపన్ను దాఖలు పత్రాలు, గుర్తింపు ధృవీకరణ, కేవైసీ పత్రాలను చూపించాలి. అన్నీ సక్రమంగా ఉంటే పరిమితుల మేరకు అక్కడికక్కడే రుణం ఇస్తారు. దేశంలోని 400 జిల్లాల్లో ఖాతాదారులకు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసేందుకు 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర బ్యాంకర్ల సమితి (SLBC) కన్వీనర్ తెలిపారు.
రైతులకు సిబిల్ స్కోర్
బ్యాంకు ఖాతాదారులు తమ లోన్ హిస్టరీని తెలిపే సిబిల్ స్కోర్ సరిగా ఉండేలా చూసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. రైతులకు కూడా సిబిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకొని రుణాలు ఇస్తామని చెబుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు పరిగణలోకి తీసుకొని నిర్ణయం
ప్రకృతి వైపరీత్యాలు, రుణాల రీషెడ్యూల్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని స్థానిక బ్యాంకు మేనేజర్లు రైతుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ స్కీంలకు సంబంధించిన ఫండ్స్ను రుణబకాయిలకు జమ చేసుకోవద్దని బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.