దసరా కానుక: ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపికబురు
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదవీ విరమణ వయస్సును అరవై ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం నేపథ్యంలో కార్మికుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ఇప్పటికే నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ నెల నుంచి పదవి విరమణ చేయనున్న కార్మికులకు దీనిని వర్తింప చేయనున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ కూడా సానుకూలత వ్యక్తం చేశారు.

ఉద్యోగులకు దసరా కానుక
ఇది ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుక. దీనిని ఈ నెల అంటే సెప్టెంబర్ నుంచే అమలు చేయనుండటం గమనార్హం. సెప్టెంబర్ 4వ తేదీన ఏపీఎస్ ఆర్టీసీ విలీనంపై ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నెల ఆర్టీసీలు 200 నుంచి 300 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నట్లుగా అంచనా. ఆర్టీసీ విలీన ప్రక్రియకు మూడు నెలల గడువు ఉన్న నేపథ్యంలో తమకు పదవీ విరమణ పెంపు వయస్సు వర్తించదనే ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు ఇది పెద్ద శుభవార్త.

52వేల మందికి లబ్ధి
ఇదే విషయాన్ని కమిటీ చైర్మన్ ఆంజనేయ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన వెంటనే స్పందించారు. సెప్టెంబర్ నెల నుంచి 60 ఏళ్ల పెంపు వర్తించేలా ఆదేశించారు. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడటమే ఆలస్యం. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సమయంలో వయో పరిమితిని అరవై ఏళ్లకు పెంచింది. దీంతో ఆర్టీసీలోని 52వేల మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది.

ఎలక్ట్రిక్ బస్సులపై నివేదిక
మరోవైపు, ఆర్టీసీలో ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెడితే పెద్ద ఎత్తున ఇంధనం ఆదా అవుతుందని విద్యుత్ బస్సులపై ఏర్పాటైన నిపుణుల కమిటీ తెలిపింది. వ్యయ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రానిక్ బస్సులు ఉపయోగపడతాయని పేర్కొంది. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్కు ఎలక్ట్రిక్ బస్సులపై నివేదికను సమర్పించింది. నిపుణుల కమిటీ చైర్మన్ ఆంజనేయ రెడ్డి, కమిటీ సభ్యులతో పాటు, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తదితరులు సీఎంను కలిశారు.


Click it and Unblock the Notifications