మోడీ ప్రభుత్వం భారీ షాక్: రీ-రిజిస్ట్రేషన్ 25 రెట్లు, ఫిట్నెస్ టెస్ట్ 125 రెట్లు
న్యూఢిల్లీ: పదిహేనేళ్లకు పైబడిన కార్లను మీరు ఉపయోగిస్తున్నారా? అయితే వీటి రీ-రిజిస్ట్రేషన్ వంటివి మీకు అధిక భారం కానున్నాయి. పాత కమర్షియల్ వెహికిల్స్ ఐతే మీరు ఊహించని విధంగా బర్డెన్ కానున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో పాత కార్ల వినియోగాన్ని తగ్గించేందుకు కూడా చర్యలు చేపడుతోంది.
కేంద్రం భారీ షాక్, 20 రెట్లు పెరగనున్న రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఫీజు!
రీ-రిజిస్ట్రేషన్కు 25 రెట్లు, ఫిట్నెస్ పరీక్షలకు 125 రెట్లు
ఇందులో భాగంగా పదిహేనేళ్లకు పైబడిన పాత కార్ల రీ-రిజిస్ట్రేషన్ ఛార్జీని 25 రెట్ల వరకు, కమర్షియల్ వాహనాలు అయితే ఫిట్నెస్ పరీక్షల కోసం ఇప్పుడున్న ఛార్జ్ కంటే 125 రెట్ల వరకు పెంచాలని రోడ్ ట్రాన్సుపోర్ట్ మినిస్ట్రీ ప్రతిపాదన చేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే అమలులోకి వస్తుంది. ఈ నిబంధనలకు సంబంధించిన కాపీలను సంబంధిత మంత్రిత్వ శాఖ వివిధ శాఖలకు పంపించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది.
ఏ వాహనానికి ఎంత పెరుగుతుందంటే?
ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెబితే 15 ఏళ్లకు పైబడిన బస్సు లేదా ట్రక్కు ఫిట్నెస్ టెస్ట్కు రూ.25,000 చెల్లించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ.200గా ఉంది. అలాగే క్యాబ్ లేదా ట్యాక్సీ లేదా మినీ ట్రక్ ఫిట్నెస్ పరీక్షలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఉండవచ్చు. కమర్షియల్ వెహికిల్స్కు ప్రతి ఏడాది ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి. కమర్షియల్ వెహికిల్స్ రిజిస్ట్రేషన్ లేదా రీ-రిజిస్ట్రేషన్ని పెంచకపోవచ్చు.
ప్రైవేటు వాహనాలకు ఎంత పెరుగుతుందంటే
ఇతర ప్రైవేటు వెహికిల్స్ అంటే వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే ఫోర్ వీలర్ రీ-రిజిస్ట్రేషన్ ఫీజు రూ.600 నుంచి రూ.15,000కు పెంచవచ్చు. ప్రస్తుతం రూ.300గా ఉన్న టూవీలర్, త్రీ వీలర్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఫీజు వరుసగా రూ.2,000, రూ.3,000 పెరగవచ్చు. పదిహేనేళ్ల తర్వాత వాహన రిజిస్ట్రేషన్ను ప్రతి అయిదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి.
ప్రభుత్వం రెండు సూచనలు
తమ పాతవాహనాలు స్క్రాప్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ఇందులో ప్రతిపాదించింది. స్క్రాప్ చేసిన దానికి బదులు కొత్త వాహన కొనుగోలుపై ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఆటో మేకర్స్కు కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తోంది. ఇలాంటి వారికి డిస్కౌంట్ ఇవ్వాలని, అప్పుడు కంపెనీలకు సేల్స్ కూడా పెరుగుతాయని చెబుతోంది.
గత కొన్నాళ్లుగా ఆటోమొబైల్ సేల్స్ తగ్గిపోతున్నాయి. జీఎస్టీ, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం ప్రోత్సాహ ప్రకటన, ప్రపంచవ్యాప్తంగా మందగమన పరిస్థితులు, ఇటీవలి వరకు FPIలు తరలి వెళ్లడం వంటి వివిధ కారణాల వల్ల వాహనాల సేల్స్ పడిపోయాయి. ఇటీవల పలుమార్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ధీపన ప్రకటనలు చేశారు. గత ఏడాదిగా సేల్స్ తగ్గిపోయాయి. ప్రభుత్వం ఉద్దీపనల నేపథ్యంలో ఆటో సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు.