జగన్ రూ.58 కోట్లు ఆదా చేశారా? సేవింగ్ పేరుతో రూ.32,000 కోట్ల బెనిఫిట్!!
అమరావతి: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ చర్చనీయాంశంగా మారింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.58.53 కోట్లు ఆదా చేసినట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెలిపారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. పోలవరంలో 65వ ప్యాకేజీకి నిర్వహించిన రివర్స్ టెండర్ విధానం ద్వారా రూ.299 కోట్ల పనుల్లో ప్రభుత్వ ఖజానాకు రూ.58 కోట్లకు పైగా ఆదా అయిందన్నారు.
అదే సంస్థ 15 శాతం తక్కువకు అర్హత సాధించింది
తమ విధానం ద్వారా ఖజానాకు నిధులు మిగిలాయని, ఇలాంటి విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేసే పరిస్థితి వస్తుందని మంత్రి చెబుతున్నారు. అస్మదీయులకు అప్పగించారని చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని, కానీ టీడీపీ హయాంలోనే 65వ ప్యాకేజీ పనులను 4.77 శాతం ఎక్కువకు మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారన్నారు. ఇప్పుడు అవే పనులకు రివర్స్ టెండరింగ్ పిలిస్తే 15.6 శాతం తక్కువకు అదే మ్యాక్స్ సంస్థ అర్హత సాధించినట్లు చెప్పారు.
మొత్తంగా 20 శాతం ఆదా
నాటి 4.77 శాతం ఎక్కువ, ఇప్పటి 15.6 శాతం తక్కువ కోట్ కలిసి 20 శాతం మేర నిధులు ఆదా చేసినట్లు వైసీపీ చెబుతోంది. పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తి చేశామని టీడీపీ చెబుతోందని, అదే నిజమైతే రూ.55 వేల కోట్ల ప్రాజెక్టుకు రూ.32 వేల కోట్ల పనులు మిగిలి ఉన్నాయని, అలాంటప్పుడు 70 శాతం పనులు పూర్తి చేశామని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు.
మేఘా మాత్రమే టెండర్
కాగా, పోలవరం ప్రధాన డ్యాం, జల విద్యుత్ కేంద్రం పనులకు కలిపి జల వనరుల శాఖ ఆహ్వానించిన టెండర్ నోటీసుకు కేవలం ఒక్క కాంట్రాక్ట్ ఏజెన్సీ మాత్రమే స్పందించింది. మేఘా ఇంజినీరింగ్ బిడ్ దాఖలు చేసింది. ప్రీబిడ్కు 8 సంస్థలు హాజరయ్యాయి. కానీ గడువు ముగిసే నాటికి మెఘా ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. సెప్టెంబర్ 23వ తేదీన ఈ బిడ్ తెరవాలి. ప్రధాన డ్యాం వద్ద మిగిలి ఉన్న పనులకు రూ.1771.44 కోట్లు, 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం పనులకు రూ.3216.11 కోట్ల అంచనాతో టెండర్లు ఆహ్వానించారు. గడువులోగా మెఘా సంస్థ మాత్రమే టెండర్ వేసింది.
రూ.58 కోట్లు ఆదా చేశారా.. లేక అప్పగింత కోసమా.
రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.58 కోట్లు ఆదా చేశారన్న జగన్, వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ ఖండిస్తోంది. అర్హత లేకపోయినా మేఘా కృష్ణారెడ్డి సంస్థకు దీనిని అప్పగించేందుకే నిబంధనలు సడలించారని ఆరోపిస్తున్నారు. అయిదేళ్లలో 63 శాతం పనులు పూర్తి చేసిన సంస్థను పక్కన పెట్టి పదేళ్లలో 7 శాతం పనులు పూర్తి చేసిన సంస్థకు అప్పగించడం ఏమిటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ట్విస్ట్.. 58 కోట్ల ఆదా పేరుతో.. రూ.2వేల కోట్ల కాంట్రాక్టు
పోలవరం ద్వారా జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు మేఘా కృష్ణారెడ్డికి రూ.2,000 కోట్ల విలువ చేసే ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టును, రూ.30వేల కోట్ల విలువ చేసే వాటర్ గ్రిడ్ పనులను అప్పగించేందుకు రంగం సిద్ధమైందని ఆరోపిస్తున్నారు. గతంలో మ్యాక్స్ ఇన్ఫ్రాపై విమర్శలు చేసి, అసలు జగన్ ఇప్పుడు ఆ సంస్థకే ప్రాజెక్టును ఎలా అప్పగించారని నిలదీస్తున్నారు.
ఇదీ లెక్క... అసలు విషయం ఇదీ..
2005లో పోలవరం ఎడమ కాల్వ 65వ ప్యాకేజీ టన్నెల్ టెండరును 21 శాతం తక్కువకు యూనిటీ ఇన్ఫ్రా సంస్థకు రూ.115 కోట్లకు ఇచ్చారని, రూ.15 కోట్ల మట్టి పనులు చేసి చేతులెత్తేయడంతో పద్నాలుగేళ్లు పనులు ఆగిపోయాయని, ఆ తర్వాత అవే పనులు రూ.274 కోట్లకు టెండర్లు పిలవగా మ్యాక్స్ ఇన్ఫ్రా రూ.290 కోట్లకు దక్కించుకుందని, ఇప్పుడు దానిని రివర్స్ చేసి రూ.232 కోట్లకు పనులు అప్పగించారన్నారు. రూ.157 కోట్లు నష్టం చేసి రూ.58 కోట్లు ఆదా చేశామని చెప్పడం ఏమిటంటున్నారు.