జాగ్రత్తపడండి!: 67 శాతం పెరిగిన ఉల్లి ధర, 2 నెలల వరకు ఇంతే
సాగు తగ్గిపోవడంతో పాటు భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి ధర క్రమంగా పెరుగుతోంది. గతంలో ఉల్లి ధర కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఉల్లి ధర భారీగా పెరుగుతోంది. ముంబై నగరంలో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70కి చేరుకుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోను రూ.40 వరకు చేరుకుంది.
తగ్గిన సరఫరా
రిటైల్ ధరలు పెరుగుతున్నాయి. కస్టమర్లకు రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35కు లభిస్తోంది. మాల్స్, ఆన్లైన్ దుకాణాల్లో రూ.40 వరకు లభిస్తోంది. దేశవ్యాప్తంగా పలుచోట్ల సరుకు తగ్గింది. మహారాష్ట్ర, కర్ణాటకలలో వరదల కారణంగా పంట తగ్గిపోయింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్కు ఉల్లి సరుకు తగ్గింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోను ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ధర పెరుగుతోంది.
ఉల్లి ధరలు ఎప్పటి వరకు పెరగవచ్చునంటే...
ఉదాహరణకు ఏపీఎంసీ వశీకి రోజుకు 125 నుంచి 150 ట్రక్కుల ఉల్లి సరఫరా కావాలి. కానీ దాదాపు 100 కూడా రావడం లేదు. సాగు తగ్గడం, వరదలతో పంట నష్టపోవడంతో ఉల్లి కొరత ఏర్పడింది. దీంతో డిమాండుకు తగినట్లుగా ఉల్లి సరఫరా సాగడం లేదు. ఉల్లి క్వాలిటీ, గ్రేడ్ను బట్టి హోల్ సేల్ ధరలు రూ.30 నుంచి రూ.45కు పైగా ఉన్నాయి. ఉల్లి ధరలపై ప్రభావం మరో ఆరు వారాలకు పైగా ఉంటుందని ట్రేడర్స్ చెబుతున్నారు. అక్టోబర్ చివరి నాటికి ఖరీఫ్ పంట చేతికి వస్తుంది. అప్పటి వరకు ఉల్లి ధరలు క్రమంగా పెరిగే అవకాశమే ఉందని చెబుతున్నారు.
రూ.80 వరకు కూడా పెరగొచ్చు
శుక్రవారం నాడు బాంద్రాలోని పాలి మార్కెట్, ఖర్, అంధేరీ లోఖండ్వాలా, బోరివ్లీ, ఎస్వీ రోడ్, మలాద్లలో అయితే ఉల్లి రిటైల్ ధర రూ.60 నుంచి రూ.70 వరకు ఉంది. బ్రీచ్ కాండీలో అయితే రూ.75 వరకు ఉన్నట్లుగా చెబుతున్నారు. అంధేరీలో రూ.60 వరకు పెరిగింది. శనివారం, ఆదివారం నాటికి ఇది రూ.80 వరకు పెరగవచ్చునని భావించారు.
మరో 7 వారాలు ఉల్లి ధరలో పెరుగుదలే..
దక్షిణ భారతదేశంలో భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట నష్టపోయిందని, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి అని ఓ ట్రేడర్ చెప్పారు. దీంతో దేశంలో ఎక్కువ చోట్లకు ఉల్లిని సరఫరా చేసే బరువు మహారాష్ట్ర పైన పడిందన్నారు. కానీ డిమాండుకు తగిన ఉల్లి సరఫరా లేదన్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయన్నారు. ఉల్లి కొత్త పంట అక్టోబర్ చివరి నాటికి లేదా నవంబర్ 15 నాటికి వస్తుందని, అప్పటి వరకు ధరలు పెరుగుతూనే ఉంటాయన్నారు. గత రెండు నెలలుగా కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఎంత తగ్గిందంటే..
ఉల్లి కొరత కారణంగా ఏపీలోని కర్నూలు మార్కెట్లో క్వింటాల్ గరిష్టంగా రూ.4,150 ఉంది. హైదరాబాద్, ముంబైలలోను రూ.4వేలకు పైగానే ఉంది. రైతుకు సగటున క్వింటాల్కు రూ.3వేలు లభిస్తోంది. గతంతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోను ఉల్లి సాగు తగ్గింది. దీనికి వరదలు తోడయ్యాయి. ఏపీలో 45 వేల ఎకరాల్లో ఉల్లి వేశారు. అంతకుముందు అరవై వేలకు ఎకరాల్లో వేశారు. అంటే సాగు తగ్గింది. ఇక మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్లలో వరదల కారణంగా పంట తగ్గింది.
మూడు వారాల్లో 67 శాతం పెరిగిన ఉల్లి ధర
కిలో రిటైల్ ఉల్లి ధరలు ఢిల్లీలో రూ.65 వరకు ఉంది. ముంబైలో రూ.60 నుంచి రూ.70 వరకు, తెలుగు రాష్ట్రాల్లో రూ.40 వరకు ఉన్నాయి. కోల్కతా, బెంగళూరులలో రూ.60 వరకు ఉన్నాయి. సెప్టెంబర్ మొదటి మూడు వారాల్లో ఉల్లి ధరలు ఏకంగా 67 శాతం పెరిగాయి.
కేంద్రం చర్యలు
2015 సెప్టెంబర్ నెల తర్వాత ఉల్లి ధరలు ఇప్పుడు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ఎగుమతి ధరలను పెంచింది. అలాగే బఫర్ నిల్వల దిశగా చర్యలు చేపట్టింది. భారత్ ఉల్లిని బంగ్లాదేశ్, శ్రీలంక, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి చేస్తుంది. టర్కీ కూడా ఈ దేశాలకు సరఫరా చేస్తోంది. ఉల్లి ధరలు పెరిగి, మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ (MEP) పెంచినప్పటికీ మన దేశం నుంచి కూడా సరఫరా ఉంది.