చిక్కుల్లో జెట్ ఎయిర్వేస్ మాజీ ఛైర్మన్ గోయల్.. స్వతంత్ర దర్యాప్తుకు ఈడీ యోచన!
జెట్ ఎయిర్ వేస్, దాని వ్యవస్థాపకుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. అసలే కార్యకలాపాల నిర్వహణకు సరిపడా నిధులు లేక అర్థంతరంగా ఆగిపోయిన ఈ సంస్థలో నిధుల మళ్లింపు జరిగిందనే ఆరోపణలు బయటికి వచ్చాయి. దీంతో ఈ ఎయిర్లైన్స్కు చెందిన ఖాతాలపై స్వతంత్ర దర్యాప్తు చేయించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమవుతోంది.
ఈ విషయంలో గత వారమే ఈడీ జెట్ ఎయిర్వేస్ మాజీ ఛైర్మన్ నరేష్ గోయల్ను విచారించచింది. ఆ తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జరిపిన ఆడిట్లో పలు తేడాలు కనిపించినట్లు ఈడీ గుర్తించిందని ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రుణాల సొమ్మును విదేశాల్లోని కంపెనీలకు మల్లించారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ తాజాగా స్వతంత్ర దర్యాప్తు మంచిదని భావిస్తోంది.
గోయల్కు మొత్తం 19 ప్రైవేటు కంపెనీలు...
ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ నగదు సంక్షోభంలో చిక్కుకుంది. రూ.7 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ఈ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్కు మొత్తం 19 ప్రైవేటు కంపెనీలు ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెల్లడైంది. వాటిలో 5 కంపెనీలు విదేశాల్లో నమోదైనవి. ఈ సంస్థలు అమ్మకం, పంపిణీ, నిర్వహణ ఖర్చుల ముసుగులో అనుమానాస్పద లావాదేవీలను నిర్వహించిందనే అనుమానాలు ఉన్నాయి.
రంగంలోకి ఈడీ...
తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో జెట్ ఎయిర్ వేస్ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది. రుణాల ద్వారా పొందిన సొమ్మును విదేశాల్లోని కంపెనీలకు మళ్లించారని, రూ.18 వేల కోట్ల మేర స్కాం జరిగినట్లు ఆరోపణలు రావడంతో.. వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. అయితే అప్పటికే ఈ సంస్థ దివాలా పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో బోర్డు పునర్నిర్మాణంలో భాగంగా ఆ సంస్థకు ఛైర్మన్ అయిన నరేష్ గోయల్, అతడి భార్య అనిత రాజీనామా చేశారు.
ఆగస్టులోనే పలుమార్లు తనిఖీలు...
ఆ తరువాత ఆగస్టు నెలలో గోయల్ నివాసాలు, గ్రూపు కంపెనీల కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాలపై ఏకకాలంలో ఈడీ దాడులు నిర్వహించింది. అనంతరం తొలిసారి ముంబైలో ఆయన్ని ప్రశ్నించింది. మూతపడిన ఈ క్యారియర్కు చెందిన లాయల్టీ ప్రోగ్రామ్లోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల గురించి కూడా విచారించింది. మళ్లీ గత వారం కూడా ఫారిన్ ఎక్స్ఛేంజ్ చట్టాన్ని ఉల్లంఘించడంతో ముంబైలోని గోయల్ నివాసాల్లో మరోమారు తనిఖీలు నిర్వహించింది.
స్వతంత్ర దర్యాప్తుకు మొగ్గు...
జెట్ ఎయిర్ వేస్కు చెందిన బల్లార్డ్ పీర్ ఆఫీసులో నరేష్ గోయల్ను ప్రశ్నించిన ఈడీ ఆయన సన్నిహితులనూ వదల్లేదు. వారి ప్రాపర్టీలలో పలుమార్లు సోదాలు జరిపింది. ఫెమా ఉల్లంఘన చట్టం కింద విచారించింది. గత నెలలో గోయల్కు చెందిన టైల్ విండ్స్ కార్పొరేషన్లో పెట్టుబడులు పెట్టిన హస్మఖ్ గార్ధి నివాసాల్లో సైతం సోదాలు నిర్వహించింది. ఎస్బీఐ జరిపిన ఆడిట్లోనూ కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించిన ఈడీ ఇక స్వతంత్ర దర్యాప్తు(ఇండిపెండెంట్ ఆడిట్) జరపాలని, దాంతోనే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది.