చైనాకు చెక్ పెట్టిన భారత్... ఆ కంపెనీల ఆకర్షణే లక్ష్యం!
పొరుగు దేశం చైనా కు భారత్ చెక్ పెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం తీసుకున్న కీలక నిర్ణయాలతో... చైనా నుంచి తయారీ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇటు భారత్ లోని కంపెనీలకు మేలు చేసే ఈ నిర్ణయాలు...అటు అంతర్జాతీయ కంపెనీలను భారత్ కు రప్పించేందుకు దోహద పడనున్నాయి. తయారీ రంగంలో ప్రపంచంలోనే చైనా టాప్ ప్లేస్ లో ఉంటుంది. దాదాపు అన్ని దేశాలకు తన ఉత్పత్తులను భారీగా ఎగుమతి చేస్తూ... ప్రపంచ వాణిజ్యంలో తనదైన ముద్ర వేసింది. కానీ రెండేళ్లుగా చైనా కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపుతున్నారు. ఆ దేశం పై విపరీతమైన పన్నులు విధిస్తూ... అమెరికాలో చైనా వస్తువుల అమ్మకాలను నిరుత్సహపరుస్తున్నారు. అదే సమయంలో ట్రంప్ ... చైనా లో తయారీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న అమెరికా కంపెనీలను ఆ దేశం నుంచి బయటకు వచ్ఛేయ్యాలని ఆదేశిస్తున్నారు. దీంతో ఆపిల్ సహా బడా బడా కంపెనీలన్నీ తయారీకి ప్రత్యామ్నాయ దేశాల కోసం వెతుకుతున్నాయి. అనేక విధాలుగా చైనా కు సామీప్యత ఉన్నా... భారత్ లో అధిక పన్నులు సహా తయారీ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేక పోటీ పడలేకపోతోంది. అయితే, ప్రస్తుత నిర్ణయం ఈ దిశగా భారీ సంస్కరణగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరిన్ని ఆసియా దేశాలతో పోటీ...
దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు దాదాపు అన్ని ప్రభుత్వాలు తమ పరిధిలో ప్రయత్నాలు చేసినప్పటికీ.. అనేక కారణాలతో మన దేశం అనుకున్న పురోగతిని సాధించలేక పోయింది. అయితే, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ను ముందుకు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో కొంత సఫలీకృతం అయ్యారు. కొన్ని నిబంధనలు మార్చటం తో చాలా వరకు మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు భారత్లో తయారీ మొదలు పెట్టాయి. రెడీమి సహా అనేక కంపెనీలు ఈ దిశగా అడుగులు వేశాయి. కానీ, మన దేశంలో ఉన్న పన్ను రేటు మిగితా ఆసియా దేశాలతో పోల్చితే అధికం కావటంతో చాలా పెద్ద పెద్ద కంపెనీలు వియాత్నం, మియన్మార్, తై వాన్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాలకు తరలి పోతున్నాయి. అందుకే, మనకు పోటీ అధికం ఐంది. చైనా నుంచి తరలి వెళ్లాలని భావిస్తున్న ఆపిల్ వంటి బడా కంపెనీలు ప్రస్తుతం భారత దేశం వైపు చూసే అవకాశాలు చాలా మెరుగు అయ్యాయి.
తక్కువ పన్ను రేటు...
భారత్ లో అక్టోబర్ 1 తర్వాత నెలకొల్పిన తయారీ రంగ కంపెనీలు కేవలం 15% కార్పొరేట్ టాక్స్ చెల్లిస్తే సరిపోతుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతమున్న కార్పొరేట్ టాక్స్ ప్రకారం కంపెనీలు దాదాపు 30% నుంచి 33% వరకు పన్ను రూపంలో చెల్లిస్తున్నాయి. ఇకపై అన్ని రకాల సెస్సులు, సర్చార్జీలతో కలిపి కార్పొరేట్ టాక్స్ కేవలం 17.01% మాత్రమే ఉంటుంది. భారత్ లో ప్రతిపాదిస్తున్న 15% పన్ను రేటు ప్రస్తుతం మనతో పోటీ పడుతున్న మిగితా ఆసియా దేశాలతో పోల్చితే తక్కువే. ఆయా దేశాల్లో సగటున 17% నుంచి 20% వరకు కార్పొరేట్ టాక్స్ అమల్లో ఉంది. కార్పొరేట్ టాక్స్ విషయంలో ఇకపై భారత్ సింగపూర్ వంటి పన్ను స్వర్గధామాలతో కూడా పోటీ పడనుంది.
వాటిపై ఫోకస్ పెంచాలి...
కార్పొరేట్ టాక్స్ తగ్గింపు మెరుగైన నిర్ణయమే ఐన... కేవలం అదొక్కటే ప్రపంచ స్థాయి తయారీ కంపెనీలను భారత్ కు రప్పించలేదని నిపుణులు చెబుతున్నారు. దేశంలో రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్ట్, పోర్టులు వంటి మౌలిక సదుపాయాలపై అధిక పెట్టుబడులు పెట్టి వాటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలి. అదే సమయంలో పరిశ్రమలకు సేకరించే భూములు వీలైనంత త్వరగా కంపెనీలకు అందించాలి. అవినీతి తగ్గాలి. పారదర్శకత పెరగాలి. అన్ని విషయాల్లోనూ టెక్నాలజీ అమలు చేసి మానవ రహిత పరిశీలన జరపాలి. అన్నింటికి మించి ప్రభుత్వ విధానాల్లో స్పష్టత ఉండాలి. పదే పదే విధానాలను మార్చటం వల్ల ఆశించిన ప్రగతి సాధ్యం కాదని విశ్లేషకుల అభిప్రాయం.
జీడీపీ లో 25% వాటా...
మన దేశ జీడీపీ లో తయారీ రంగం వాటాను మరో మూడేళ్ళలో 25% నికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా అనేక చర్యలు తీసుకొంటోంది. అయితే, ప్రస్తుత పన్ను తగ్గింపు నిర్ణయం ఈ లక్ష్యాన్ని చేరుకొనేందుకు తోడ్పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం 17% నుంచి 18% గా ఉన్న తయారీ రంగం వాటా వచ్చే మూడేళ్ళ లో 23% నుంచి 25% చేరుకోవటం ఖాయమని వారు అంచనా వేస్తున్నారు. ఆపిల్, టెస్లా వంటి భారీ తయారీ కంపెనీలు వస్తే భారత్ కు తిరుగు ఉండదని చెబుతున్నారు. ఈ రంగం ఉద్యోగ కల్పన లోనూ ముందు వరుసలో ఉంటుంది కాబట్టి ఉపాధి కల్పన సులువు అవుతుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా... తయారీ లో రారాజుగా వెలుగొందుతున్న చైనా కు భారత్ ఈ విధంగా చెక్ పెట్టటం అభినందించే విషయమే!