మోడీ ప్రొడక్షన్స్.. నిర్మలా డైరెక్షన్.. మరో సర్జికల్ స్ట్రైక్!
మరో సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అవును, కానీ ఈసారి శత్రుదేశమైన పాకిస్తాన్ మీద కాదు.. మన దేశ ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తోన్న మందగమనమనే శత్రువు పైన. ప్రధానమంత్రి మోడీ ప్రొడక్షన్స్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డైరెక్షన్లో శుక్రవారం జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్తో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. కీలక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్లాయి. ఒక్క రోజులో.. ఒక్క గంటలో మదుపరుల సంపద రూ.5 లక్షల కోట్లకు పెరిగిపోయింది.
మన ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న మందగమనాన్ని పారదోలేందుకు కేంద్రం జరిపిన ఈ సర్జికల్ స్ట్రైక్తో దలాల్ స్ట్రీట్ దద్దరిల్లింది. అన్ని రంగాలూ లాభాల మోత మోగించాయి. ఫలితంగా కార్పొరేట్ వర్గాల్లో వెలుగులు విరజిమ్మాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇచ్చేందుకు కార్పొరేట్ పన్నుల్లో కోతతోపాటు దేశీయ కంపెనీలకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు దక్కాయి. మొత్తానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఊహించని నిర్ణయంతో కార్పొరేట్ వర్గాలను సంభ్రమాశ్చర్యానికి గురిచేశారు.
పన్ను తగ్గింపుపై ఎప్పట్నించో డిమాండ్...
నిజానికి దేశంలోని కార్పొరేట్ వర్గాలు తమ కంపెనీల ఆదాయంపై ప్రస్తుతం ఉన్న పన్ను రేటును తగ్గించాలంటూ ఎప్పట్నించో కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ కార్పొరేట్ పన్ను 30 శాతంగా ఉంది. సెస్సులు, సర్చార్జిలతో కలిపి ఇది 35 శాతంగా ఉండేది. దీంతో ఈ స్థాయిలో పన్ను చెల్లించడం చాలా కంపెనీలకు భారంగా పరిణమించింది. కొన్ని కంపెనీలైతే పన్ను భారం భరించలేక ఉద్యోగుల్లో కోత పెట్టుకున్నాయి. మరికొన్ని కంపెనీలు అవసరం ఉన్నా కొత్త ఉద్యోగులను తీసుకోవడం నిలిపివేశాయి.
ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించినా...
అయితే కేంద్రం మాత్రం కార్పొరేట్ పన్ను శాతం తగ్గించకుండా ఊరట కల్పించే చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు మార్లు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించారు. అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ క్షీణించసాగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం మన దేశ ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేసింది. మరోవైపు తయారీ రంగంలో కొత్త పెట్టుబడులు లేకపోవడంతో కొత్త ఉద్యోగాల కల్పన లేక నిరుద్యోగం శాతం భారీగా పెరిగింది. సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోయింది. దీంతో రియల్టీ, ఆటోమొబైల్ తదితర రంగాలు గగ్గోలు పెట్టాయి.
ఆర్థిక వ్యవస్థకు ‘బూస్ట్’ తాగించేశారు...
దేశ పారిశ్రామిక రంగానికి గత రెండు మార్లు ఇచ్చిన ఉద్దీపన ప్యాకేజీలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మోడీ సర్కారు మరింత సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ పన్నును తగ్గించాలని నిర్ణయించింది. దీనివల్ల ఖజానాకు రూ.1.5 లక్షల కోట్ల వరకు పన్ను ఆదాయం తగ్గిపోతుందని తెలిసినా.. చివరికి ఆర్థిక వ్యవస్థకు ‘బూస్ట్' తాగించాల్సిందే అనే నిర్ణయానికొచ్చింది. పైగా ఎంతోకాలంగా కార్పొరేట్ వర్గాల నుంచి కూడా పన్ను తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో మోడీ సర్కారు మరోసారి సర్జికల్ స్ట్రైక్కు తెరతీసింది. అంతటితో ఆగిపోలేదు, దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేసింది.
ఒక్క నిర్ణయంతో.. ఉరుకులు పరుగులే!
ఇలాంటి తరుణంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న ఒక్క నిర్ణయం మందగమనాన్ని పారదోలడమేకాక స్టాక్ మార్కెట్ను పరుగులు పెట్టించింది. ఒక్క రోజులో రూ.5 లక్షల కోట్ల సంపద పెరిగేలా చేసింది. 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును ఏకంగా 22 శాతానికి తగ్గించడంతో కార్పొరేట్ వర్గాల్లో హర్షం పెల్లుబికింది. దీనివల్ల పెద్ద, మధ్య
స్థాయి కంపెనీలకు భారీ ఊరట లభించినట్లయింది. సస్సెలు, సర్చార్జిలతో కలుపుకుని ఇప్పటి వరకు 35 శాతంగా ఈ వర్గాలు చెల్లిస్తున్న పన్ను.. ఇకమీదట 25.17 శాతానికి దిగింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మన కార్పొరేట్ పన్ను ఇప్పుడు ఇతర ఆసియా దేశాలైన చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల స్థాయికి దిగివస్తుంది.
అంతటితో ఆగకుండా...
కార్పొరేట్ వర్గాలు చెల్లిస్తున్న పన్ను శాతాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం కూడా తీసుకుంది. అదేమిటంటే, అక్టోబర్ 1 తర్వాత తయారీ రంగంలో ఏర్పాటు చేసే కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ 15 శాతమే అమలు కానుంది. అంతేకాదు, కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను కూడా 18.5 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. దీంతోపాటు స్టాక్ మార్కెట్లలో మూలధన లాభాలపై ఆదాయపన్ను సర్చార్జీ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదని ప్రకటించింది. ఇవన్నీ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2019-20 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ప్రభుత్వంపై సర్వత్రా హర్షం...
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు సంబంధించి శుక్రవారం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆర్థిక మంత్రి నిర్ణయాలను ప్రకటించిన వెంటనే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపించింది. స్టాక్ మార్కెట్లో బుల్ రంకె వేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ తన చరిత్రలో ఒకే రోజు అత్యధిక లాభంతో సరికొత్త రికార్డును నమోదు చేసింది. మరోవైపు బీఎస్ఈ కూడా ఈ దశాబ్దంలోనే ఒకరోజు అత్యధిక లాభాలను నమోదు చేసింది. కేంద్రం తీసుకున్న అనూహ్య నిర్ణయాలతో కొత్త పెట్టుబడులు వస్తాయని కార్పొరేట్ వర్గాలు ఆశావహ దృక్పథంతో ఉండగా.. తమ నిర్ణయాలు మందగమనంలో కొనసాగుతున్న దేశ ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందనే అభిప్రాయంలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.