హోమ్ లోన్, ఎంఎస్ఎంఈలకు శుభవార్త, 400 జిల్లాల్లో లోన్ మేళా
న్యూఢిల్లీ: రైతులు, ఇళ్ల కొనుగోలుదారులతో పాటు ఇతర రుణాలు తీసుకునే వారికి శుభవార్త. రుణాలు తీసుకునే వారి కోసం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు (PSU)లు రుణమేళాలు నిర్వహించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ మేరకు వచ్చే పండుగ సీజన్లో 400 జిల్లాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించనున్నారు. హోమ్ బయ్యర్స్, వ్యవసాయదారులతో సహా అన్ని రకాల రుణాలు కావాల్సిన వారు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. వచ్చే వారం నుంచి రెండు విడతలుగా ఈ సమావేశాలు జరుగనున్నాయి.
రూ.2,300 తగ్గిన బంగారం ధర, రూ.5,000 తగ్గిన వెండి ధర!
పండుగ సీజన్లో ఎక్కువ మందికి రుణాలు అందించేందుకు..
అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ మధ్య 200 జిల్లాల్లో, అక్టోబర్ 11వ తేదీ నుంచి మరో 200 జిల్లాల్లో సమావేశాలు జరగనున్నాయి. రానున్న పండుగ సీజన్లో గరిష్ట పరిమాణంలో రుణాలు మంజూరు చేయడం ఈ సమావేశాల లక్ష్యం. అక్టోబర్ నెలలో దీపావళి దేశంలో మంచి షాపింగ్ సీజన్. కాబట్టి పబ్లిక్ మీటింగ్స్ ద్వారా రిటైల్, వ్యవసాయ, ఎంఎస్ఎంఈ, హౌస్ లోన్స్ అందిస్తారు. పండుగ సీజన్లో ఎక్కువ మందికి రుణాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన చేసినట్లు నిర్మల చెప్పారు.
వీరు హాజరు కావొచ్చు...
రుణమేళా ద్వారా రుణాలు తీసుకునే వారు రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ (RAM-రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ) కేటగిరీకి చెందిన వారు అయి ఉండాలని నిర్మల చెప్పారు. వెహికిల్ రుణాలు, హోమ్ లోన్ రుణాలు కావాలనుకునే వారు కూడా ఈ ఓపెన్ పబ్లిక్ మీటింగ్స్కు హాజరు కావాలని చెప్పారు. ఈ రుణాలు ముద్రా, SHG నుంచి MSME, FPO వరకు ఉండవచ్చునని చెప్పారు.
కొత్త వారికి రుణాలు విస్తరించాలి
ఈ రుణమేళా సందర్భంగా బ్యాంకులు రుణాలు అవసరమైన ప్రతి పాత కస్టమర్కు రుణం ఇవ్వడంతో పాటు ఐదుగురు కొత్త కస్టమర్లకు విస్తరించాలని నిర్మల సూచించారు. రుణాల రీసైక్లింగ్ తమకు ఇష్టం లేదని, పాత కస్టమర్లు కూడా దీనిని పొందవచ్చునని చెప్పారు. కానీ కొత్త వారికి ఎక్కువగా విస్తరించాలన్నారు.
నిరర్థక ఆస్తులుగా ప్రకటించొద్దు..
అదే సమయంలో ఒత్తిడిలో ఉన్న MSME రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించవద్దని బ్యాంకులను కోరారు. ఒత్తిడికి గురైన MSMEల రుణ ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించవద్దని ఇప్పటికే ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసిందన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు MSME రుణాలను నిరర్థక ఆస్తులగా ప్రకటించకపోతే ఈ రంగానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది. అలాగే, ఎంపిక చేసిన ఎన్బీఎఫ్సీలకు ద్రవ్య లభ్యత, రుణ సదుపాయాలు కల్పించాలని సూచించారు.