లక్కీ ఫెలో: దుబాయ్ టూర్కి వెళ్లి.. కోటీశ్వరుడు అయిన భారతీయుడు!
కలిసొచ్చే కాలం రావాలేగానీ.. ఈ భూమ్మీద ఎక్కడున్నా.. మనకు మంచే జరుగుతుంది.. ఎటొచ్చీ అదృష్టం తోడవ్వాలి అంతే.. అనిపించకమానదు ఈ ఉదంతం వింటే. మనదేశానికి చెందిన ఓ వ్యక్తి విదేశీ సందర్శనకు వెళ్లి.. ఏకంగా కోటీశ్వరుడైపోయాడు. ఏంటీ నమ్మకం కలగడం లేదా? అయితే చదవండి.
చెన్నైకి చెందిన లలిత్ శర్మ(37) రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. రాత్రికి రాత్రే అనగానే ఆలోచనలు ఎటో పోనీయకండి. అతడెక్కడా ఎలాంటి మోసమూ చేయలేదు. జస్ట్ దుబాయ్ వెళ్లాడు అంతే! అదీ ఒక్కసారి ఆ దేశం చూసొద్దామని.. చూసి వస్తూ వస్తూ.. ఓ చిన్న పని చేశాడు. అంతే ఆ చిన్న పనే అతడ్ని రాత్రికి రాత్రే కరోడ్పతిని చేసింది.
దుబాయ్లో ఉన్న సోదరిని చూద్దామని...
లలిత్ శర్మకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. లలిత్ శర్మ సోదరి ప్రీతి శర్మ దుబాయ్లో ఉంటోంది. ఇక లలిత్ శర్మకు ఎప్పట్నించో దుబాయ్ చూడాలని కోరిక. పైగా తన సోదరి కూడా అక్కడే ఉందాయె. ఇంకేం, చలో దుబాయ్ అంటూ.. గత జూలై నెలలో విమానమెక్కేశాడు.
ఓ పది రోజులు జాలీగా...
లలిత్ శర్మ సోదరి దుబాయ్లో అమిటీ విశ్వవిద్యాలయంలో టీచింగ్ చేస్తోంది. అలా తన సోదరి వద్దకు వెళ్లిన లలిత్ శర్మ ఓ పది రోజులపాటు అక్కడ రకరకాల ప్రాంతాలు తిరుగుతూ జాలీగా గడిపేశాడు. బుర్జా ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్, దుబాయ్ మాల్లను కళ్లారా చూశాడు.
తిరిగొస్తూ విమానాశ్రయంలో...
తన దుబాయ్ సందర్శనను ముగించుకున్న లలిత్ శర్మ తిరిగి భారత్ వచ్చేటప్పుడు దుబాయ్ విమానాశ్రయంలో దుబాయ్ డ్యూటీ ఫ్రీ(డీడీఏఫ్) మిలీనియం మిలియనీర్ లాటరీ టికెట్ కొన్నాడు. కానీ దానికి ఒక్క రూపాయి ప్రైజు కూడా తగల్లేదు.
జాక్పాట్ కొట్టేశాడు.. అంతే...
అయితే డీడీఎఫ్ టిక్కెట్ ఆన్లైన్లో కూడా కొనవచ్చంటూ అతడి సోదరి ప్రీతి శర్మ చెప్పడంతో అతడు ఆన్లైన్లో 311 సిరీస్ కలిగిన 3743 నెంబర్ గల మరో టిక్కెట్ను కొనుగోలు చేశాడు. ఈ టిక్కెటే లలిత్కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. డీడీఎఫ్ నిర్వాహకులు మంగళవారం డ్రా తీయగా.. లలిత్ శర్మ జాక్పాట్ కొట్టాడు. అతడు ఏకంగా రూ.7 కోట్ల 15 లక్షలు ప్రైజు గెలుచుకున్నాడు.
‘‘ఆ డబ్బుతో ఏం చేస్తానంటే...’’
ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయిన దుబాయ్ లాటరీ డ్రా తాను గెలుచుకున్న నగదును తీసుకునేందుకు తన ఫ్యామిలీతో కలిసి సెప్టెంబర్ 25న దుబాయ్ వెళ్లబోతున్నట్లు లలిత్ శర్మ ఆనందంగా చెప్పాడు. ఈ నగదుతో చెన్నైలోని తన హార్డ్వేర్ బిజినెస్ను విస్తరిస్తానని, అలాగే దుబాయ్లో కూడా ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు. కొంత సొమ్మును సమాజ సేవకూ వినియోగిస్తానన్నాడు.