సునితారెడ్డి, ఫ్యామిలీ.. అపోలో హాస్పిటల్స్ షేర్లు అమ్మకం, కారణమిదే
హైదరాబాద్: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజెస్ (AHEL) ప్రమోటర్లు 3.6 శాతం వాటాలను విక్రయించారు. రుణ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు తాకట్టులో ఉన్న షేర్లను విడిపించుకోవడానికి విక్రయించారు. బల్క్ డీల్ ద్వారా ప్రమోటర్ కుటుంబం వాటాలను విక్రయించినట్లు ఆపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఈ విక్రయం తర్వాత AHELలో ప్రమోటర్ ఫ్యామిలీ వాటా 30.80 శాతానికి తగ్గుతుంది.
జగన్ ప్రభుత్వం టార్గెట్ మిస్! రూ.500 కోట్ల ఆదాయం కట్
ఇప్పటి వరకు ప్రతాప్ సి రెడ్డి, కుటుంబానికి 34.40 శాతం వాటా
అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్లైన డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఇందులో జారీ మూలధనంలో 34.40 శాతం వాటా ఉంది. ఇందులో 3.6 శాతం వాటాను అంటే 50 లక్షల ఈక్విటీ షేర్లను స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా బల్క్ డీల్ పద్ధతిలో ఒక్కో షేర్ను రూ.1,450కు విక్రయించారు. దీంతో ప్రమోటర్లకు దాదాపు రూ.725 కోట్లు సమకూరుతాయి.
సునితా రెడ్డి సహా ఇతరుల షేర్ల అమ్మకం
రుణభారాన్ని తగ్గించుకోవడానికి, తనాఖా షేర్లను విడిపించుకోవడానికి సునితా రెడ్డి, ఇతర ప్రమోటర్ల కుటుంబ సభ్యులు 3.6 శాతం షేర్లను బల్క్ డీల్ ద్వారా విక్రయించారని అపోలో హాస్పిటల్స్ గురువారం స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది.
తనఖాలో 76 శాతం షేర్లు
అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్ల షేర్లలో 76 శాతం తనఖాలో ఉన్నాయి. వీటిని విడిపించేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీలో అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్లు తమ వాటాను విక్రయించారు. అపోలో హాస్పిటల్స్ మ్యూనిచ్ విక్రయ లావాదేవీ అక్టోబర్ నాటికి పూర్తి కావొచ్చునని అపోలో హాస్పిటల్స్ తెలిపింది.
తనాఖా షేర్లు 20 శాతానికి తగ్గుదల
మ్యూనిచ్ విక్రయంతో పాటు తాజాగా అపోలో హాస్పిటల్స్ షేర్లు విక్రయం ద్వారా వచ్చిన సొమ్ముతో తనాఖలోని షేర్లను విడిపించనున్నారు. దీంతో తాకట్టులోని షేర్ల వాటా 76 శాతం నుంచి 20 శాతానికి తగ్గుతాయి. అపోలో హాస్పిటల్స్ షేర్ల విక్రయం నేపథ్యంలో గురువారం స్టాక్ ఎక్స్చేంజీలో అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. అంతకుముందు రోజు రూ.1495.40 వద్ద క్లోజ్ అయిన ధర గురువారం రూ.36.3 తగ్గి రూ.1459.10 వద్ద ముగిసింది.
తగ్గించుకునేది లేదు..
ఇక ముందు తమ వాటాను తగ్గించుకునే ఆలోచన లేదని అపోలో హాస్పిటల్స్ ప్రమోటర్స్ గురువారం వెల్లడించారు. ఆ తర్వాత ప్రమోటర్లు ఎలాంటి వాటాలు విక్రయించే అవకాశం ఉండబోదన్నారు. వైద్య సేవలు, ఫార్మసీ, రిటైల్ హెల్త్ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఈ విభాగాల్లో వృద్ధికి అవకాశముందని తెలిపారు.