అనుకున్నదొక్కటి..: అమరావతి 'కార్ల'పై జగన్ ప్రభుత్వం మరో దెబ్బ
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్నాయి. భారత్లో ఆటో సేల్స్ భారీగా పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో 24 శాతం సేల్స్ తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆటోసేల్స్కు అమరావతి ఎఫెక్ట్ కూడా పడింది. దీంతో దేశవ్యాప్తంగా తగ్గిన సేల్స్ కంటే ఆంధ్రప్రదేశ్లో రెండింతలు పడిపోయాయి. ఇటీవల అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజధానిని మారుస్తారేమోననే ఆందోళన కనిపించాయి.
ఆటో పతనానికి ఉబెర్-ఓలా కారణమా, స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయి?
దేశం కంటే రెండింతలు తగ్గిన సేల్స్
ఆ తర్వాత రాజధానిని మార్చరని తేలినప్పటికీ జగన్ ప్రభుత్వం అమరావతికి అంతగా ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి సరిపడా నిధులు లేవని ఆర్థికమంత్రే చెప్పడం గమనార్హం. ఆటో మందగమనానికి తోడు వైసీపీ ప్రభుత్వం తీరు అమరావతిలో సేల్స్ డబుల్ పడిపోవడానికి కారణమయ్యాయని చెబుతున్నారు. అమరావతితో పాటు రాజధాని ప్రాంతంలోనే ఉన్న విజయవాడ, గుంటూరులలోను ఆటో సేల్స్ జాతీయ మందగమనం కంటే రెండింతలుగా ఉన్నాయి.
అమరావతిలో ఆటో డబుల్ లాస్
దేశవ్యాప్తంగా ఆటో సేల్స్ ఆగస్టు నెలలో 24 శాతం పడిపోయాయని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో 50 శాతానికి పడిపోయాయని ఆటో డీలర్స్ చెబుతున్నారట. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిన అనంతరం లగ్జరీ సెగ్మెంట్ కంపెనీలు సహా పలు ఆటో కంపెనీలు అమరావతి, విజయవాడ, గుంటూరు పరిసరాల్లో షోరూమ్స్ తెరిచాయి.
టెంట్లు ఏర్పాటు చేసుకొని సేల్
అమరావతిలో గత కొన్నాళ్లుగా ఆటో సేల్స్ వృద్ధి సంతృప్తికరంగా ఉంది. జాగ్వార్, ల్యాండ్ రోవర్, ఆడి, మెర్సిడెజ్ బెంజ్, వోల్వో వంటి ఫోర్ వీలర్ సెగ్మెంట్, ట్రయంప్, బెనెల్లి, కవాసకి, యూఎం మోటార్స్ వంటి లగ్జరీ బైక్స్ వాహన సేల్స్ బాగున్నాయి. ఆటో కంపెనీలు తొలుత తమ వాహనాల విక్రయం కోసం తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసుకున్నాయి. దాదాపు ప్రతి కంపెనీ రాజధాని ప్రాంతంలో వారానికి ఓసారి తాత్కాలిక టెంట్ ఏర్పాటు చేసి సేల్స్ కూడా నిర్వహించాయి.
ఆటో రంగానికి అమరావతి దెబ్బ
అయితే ఇప్పుడు రాజధానిపై జగన్ ప్రభుత్వంలోని మంత్రులు, వైసీపీ నేతల వ్యాఖ్యలతో ఆటో సేల్స్ పైన నీలినీడలు కమ్ముకున్నాయి. కేవలం ఆటో సెక్టార్నే కాదు ఈ ప్రభావం రాజధాని ప్రాంతంలోని అన్ని వ్యాపారాలపై పడిందని చెబుతున్నారు. ఇప్పటికే తిరోగమనంలో ఉన్న ఆటో రంగాన్ని 'అమరావతి' మరింత దెబ్బతీసిందని చెబుతున్నారు.
భారీగా తగ్గిన JLR సేల్స్
జాగ్వార్ లాండ్ రోవర్ (JLR) మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో ఎక్స్క్లూజివ్ షోరూంను ఏర్పాటు చేసింది. ఇది ప్రతి నెల 6 నుంచి 10 కార్లు విక్రయించింది. విజయవాడ టైర్ 2 సిటీ అని, ఇలాంటి నగరంలోను ఈ కారు సేల్స్ ఇలా ఉండటం స్వాగతించదగ్గ పరిణామమని JLR సేల్స్ హెడ్ రామస్వామి అన్నారు. కానీ గత నాలుగు నెలలుగా ఈ కారు సేల్స్ 2 నుంచి 3కు పడిపోయాయని చెప్పారు. మే 2019 తర్వాత పలు బుకింగ్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయన్నారు. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధానిపై అనుమానాలు నెలకొనడంతో క్యాన్సిల్ అయి ఉంటాయని భావిస్తున్నారు.
రాయలసీమ నుంచి పెరిగిన డిమాండ్
అమరావతి ప్రాంతంలో నివసించే వారి నుంచి కాకుండా, ఇక్కడ బిజినెస్ చేసేవారి నుంచి తమకు ఎక్కువగా ఆర్డర్స్ వచ్చాయని రామస్వామి తెలిపారు. గత నాలుగేళ్లుగా ఇక్కడ కారు సేల్స్ పెరుగుతూ వచ్చాయన్నారు. స్థానికులు ఎక్కువగా ఎకానమీ క్లాస్ వెహికిల్స్ను ఇష్టపడుతున్నారన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి సేల్స్ తగ్గాయని, అదే సమయంలో రాయలసీమ ప్రాంతం నుంచి పెరిగాయన్నారు. రూ.1 కోటికి పైన విలువ కలిగిన కార్లను ఏడింటిని ఆగస్టు నెలలో రాయలసీమ ప్రాంతానికి డెలివరీ చేశామని, ఇందులో మూడు కార్లు అనంతపురం జిల్లా వారికి డెలివరీ చేశామని తెలిపారు.
ట్రయంప్ బైక్స్ కూడా తగ్గాయి..
లగ్జరీ బైక్ మేకర్ ట్రయంప్ 2016 సెప్టెంబర్లో విజయవాడలో స్టోర్ను ఏర్పాటు చేసింది. ఇదివరకు పెద్ద మొత్తంలో బైక్స్ విక్రయించినట్లు ఈ కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్ జయంత్ వెల్లడించారు. అయితే గత కొన్ని నెలలుగా విక్రయాలు తగ్గాయని, దీనికి పలు కారణాలు ఉన్నాయని, ఇందులో అమరావతిపై అనిశ్చితి కూడా ఓ కారణమని చెబుతున్నారు.
తగ్గిన కార్లు, బైక్ సేల్స్
రాజధాని ప్రాంతంలో హైక్లాస్ వాహనాలతో పాటు ఎకానమీ క్లాస్ వాహనాల సేల్స్ కూడా తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో తొలి షోరూం ఏర్పాటు చేసిన మారుతీ సేల్స్ కూడా ఇక్కడ తగ్గాయి. అంతకుముందు తాము నెలకు 25 కార్ల వరకు విక్రయించామని, ఇప్పుడు కనీసం 7 కూడా అమ్ముడు పోవడం లేదని సేల్స్ హెడ్ జే రమేష్ చెప్పారు.
అనుకున్నదొక్కటి.. రివర్స్ అయింది
ఇతర ఆటో డీలర్స్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కార్లతో పాటు బైక్స్ సేల్స్ కూడా భారీగా తగ్గాయి. దీనికి ప్రపంచం, దేశవ్యాప్తంగా ఉన్న మాంద్యం ఓ కారణమైతే అమరావతి అనిశ్చితి అంతకంటే దెబ్బతీసిందని చెబుతున్నారు. ఇటీవల తుళ్లూరు ప్రాంతంలో హోండా షోరూంను తెరిచింది. సేల్స్ లేక ఆందోళన చెందుతోంది. తాము అంతకుముందు డిమాండ్ను అనుసరించి షోరూం తెరిచామని, కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిందని, దీంతో అమ్మకాలు లేకుండా పోయాయని సేల్స్ ఇంచార్జ్ విజయ్ కుమార్ చెప్పారు.
రాజధానికి నిధుల్లేవు
అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. రాజధాని మారుస్తారేమోననే ఆందోళనలు వెల్లువెత్తాయి. కానీ రాజధాని ఉంటున్నప్పటికీ అమరావతికి ప్రాధాన్యత ఇవ్వరని ప్రభుత్వం మాటల్లో వెల్లడైందని చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల చెప్పారు. అభివృద్ధిని ఒక నగరానికి పరిమితం చేయడం కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం, అన్నిచోట్ల ఉత్పాదకరంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. భారత్ - సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు హాజరైన బుగ్గన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
అమరావతిని విస్మరించలేదు కానీ...
అమరావతిలో ఆర్థిక నగరం అభివృద్ధికే సింగపూర్ సంస్థలు పరిమితమని బుగ్గన తెలిపారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించామన్నారు. అమరావతిని తాము విస్మరించలేదని, దీనిపై నిర్ణయానికి కొద్ది నెలలు సమయం పడుతుందని, అభివృద్ధిని ఒకే ప్రాంతానికి మాత్రం పరిమితం చేయమని, వికేంద్రీకరిస్తామని అధికారులు కూడా వాణిజ్య సదస్సులో చెప్పారు.
ఉండాలా వద్దా అనేది కాంట్రాక్టర్లు నిర్ణయించుకుంటారు..
అమరావతిపై జగన్ ప్రభుత్వం తీరుపై సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ మాట్లాడుతూ.. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులే పూర్తయిందని, అమరావతి నిర్మాణంపై పెట్టుబడిదారులకు పంపుతున్న సంకేతాలను అది నిర్దారించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర సర్కార్ నిర్ణయమే ప్రాజెక్టు భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రభుత్వం తన ప్రాధాన్యతలను మార్చుకుంటున్నప్పుడు అందుకు అనుగుణంగా కాంట్రాక్టర్లు ఆయా ప్రాజెక్టుల్లో కొనసాగాలో వద్దో నిర్ణయించుకుంటారని చెప్పారు. రాజధానిపై ఏ నిర్ణయం తీసుకునే అధికారమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు.