కార్ల సేల్స్పై యువతని తప్పుబట్టారా? ఆటో పరిశ్రమకు నిర్మల గుడ్న్యూస్!
చెన్నై: గత కొన్నాళ్లుగా ఆటో సేల్స్ తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహన సంస్థలకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించనుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆటో సేల్స్ భారీగా పడిపోయిన నేపత్యంలో జీఎస్టీ రేటును తగ్గించాలని ఇండస్ట్రీ కోరుతోంది. దీనిపై మంగళవారం ఆర్థికమంత్రిని మీడియా ప్రశ్నించగా.. దీనిపై తాను ఒక్క దానిని నిర్ణయం తీసుకోలేనని, పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు తొలగించేందుకు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నామని, జీఎస్టీ కౌన్సెల్ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
సాక్ష్యాలుంటేనే రండి: ఆ అంశంపై జగన్కు సర్దిచెప్పిన కేంద్రం!
జీఎస్టీ తగ్గించే ఛాన్స్
ఆటో ఇండస్ట్రీ డిమాండ్స్ కేంద్రం పరిశీలనలో ఉందని, ఇందులో భాగంగా జీఎస్టీ కౌన్సిల్ కూడా తనవంతుగా రేటును తగ్గిస్తాదని భావిస్తున్నట్లు నిర్మల చెప్పారు. ప్రస్తుతం విధిస్తున్న 28% జీఎస్టీ రేటును 18% తగ్గించాలని ఆటో ఇండస్ట్రీ కోరుతోంది. ఈ నెల 20న గోవాలో జరుగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వాహన రంగానికి శుభవార్త ఉండవచ్చునని అంటున్నారు. ఆటో మొబైల్ ఇండస్ట్రీ డిమాండుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని నిర్మల హింట్ ఇచ్చారు.
యువత కారు కొనడం లేదు
ఆటో మొబైల్ సేల్స్ పడిపోవడంపై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో మిలీనియల్స్ ఆలోచనలు, అభిరుచులు మారిపోయాయని ఆమె వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పారు. యువతలో చాలామంది ఇప్పుడు ఈఎంఐల భయంతో కార్లు కొనడం మానివేసి, ఓలా, ఉబెర్, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు.
తక్కువ ఖర్చుతో క్యాబ్స్...
కొత్త కారు కొంటే నెలనెలా వేల రూపాయలు ఈఎంఐల రూపంలో చెల్లించే బదులు తక్కువ ఖర్చుతో క్యాబ్ వంటి సేవలను వినియోగించుకోవచ్చునని ఆలోచిస్తున్నారని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆటోమొబైల్ రంగంలో రెండంకెల క్షీణతకు ఈ మార్పు కూడా ఓ కారణమని అభిప్రాయపడ్డారు.
ఆటోమొబైల్ రంగం వివిధ అంశాల వల్ల ప్రభావితమైందని నిర్మల చెప్పారు. బీఎస్ 6 శ్రేణి వాహనాల కోసం ప్రయత్నాలు, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు వంటి అంశాలు కూడా కారణమని చెప్పారు. అదే సమయంలో ట్రక్కుల విషయంలో 70 శాతం అమ్మకాలు నమోదవుతున్నాయని తెలిపారు. వీటి ప్రభావం వల్ల లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు.
5 ట్రిలియన్ డాలర్లకు చర్యలు
దేశంలో మౌలిక వసతుల్ని మెరుగుపరిచే దిశగా పెట్టుబడుల్ని పెంచే ప్రాజెక్టులను గుర్తించేందుకు కేంద్రం ఒక ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ను నియమించిందని చెప్పారు. వినిమయానికి ఊతమిచ్చేందుకు కేంద్రం అనేక రూపాల్లో భారీగా ఖర్చు చేస్తోందని, ఇందులోభాగంగా రూ.100 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మిలీనియల్స్ పైన ఎందుకు?
కాగా, మిలీనియల్స్ పైన నిర్మల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బస్సులు, ట్రక్కుల అమ్మకాల్లో కూడా భారీ క్షీణత యువత కొనకపోవడం వల్లే వచ్చిందా అని కాంగ్రెస్ నిలదీసింది. అయితే కార్లు, బైక్స్ అమ్మకాలు తగ్గడానికి మిలీనియల్స్ కొనకపోవడం కూడా ఓ కారణమని మాత్రమే ఆమె చెప్పారు. అదే సమయంలో ట్రక్కుల విషయంలో 70 శాతం అమ్మకాలు నమోదవుతున్నట్లు రికార్డులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో కార్ల అమ్మకాల విషయంలో యువత ఉబెర్, ఓలా వంటి వాటి వైపు చూస్తున్నారన్న వ్యాఖ్యల్లో కొంత వాస్తవం ఉందని అంటున్నారు.