రూ.100 డిపాజిట్కు రూ.50 ఛార్జ్!! అక్టోబర్ 1 నుంచి SBI కొత్త రూల్స్, గుడ్న్యూస్ కూడా..
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమరా? అయితే బ్యాంకు అక్టోబర్ 1వ తేదీ నుంచి మీకు షాక్ ఇవ్వనుంది. వచ్చే నెల నుంచి నిబంధనల్లో మార్పులు తీసుకు వస్తోంది. ఈ మేరకు శనివారం నాడు ప్రకటన చేసింది. బ్యాంకు ఛార్జీలు, ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. డబ్బులు విత్ డ్రా, చెక్బుక్ వినియోగం, మనీ డిపాజిట్, సర్వీస్ ఛార్జీలు, ఏటీఎం ట్రాన్సాక్షన్స్.. వంటి సేవల్లో మార్పులు చేసినట్లు ఎస్బీఐ తెలిపింది.
బ్యాంకుల్లో మూడుసార్లే జమ చేయాలి, ఆ తర్వాత చార్జీ
కొత్త రూల్ ప్రకారం బ్యాంకుల్లో నేరుగా మనీ డిపాజిట్ కేవలం మూడుసార్లు మాత్రమే చేయాలి. ఈ మూడుసార్లు ఉచితం. కానీ ఆ తర్వాత చేసిన ప్రతి దఫాకు ఛార్జీలు వసూలు చేస్తారు. మూడుకు మించిన తర్వాత కనీస మొత్తం రూ.100 మనీ డిపాజిట్ రూ.50 ఛార్జ్ అవుతుంది. మరో షాకింగ్ ఏమంటే దీనికి జీఎస్టీ అదనం. నెల వ్యవధిలోనే నగదు జమ ఐదోసారి కూడా దాటితే అప్పుడు రూ.56 ఛార్జ్ అవుతుంది.
ఏటీఎం ట్రాన్సాక్షన్స్ సంఖ్య పెంపు
నగరాల్లో ఏటీఎం ట్రాన్సాక్షన్స్ సంఖ్య పెరగనుంది. మెట్రో నగరాల్లో ఈ ట్రాన్సాక్షన్ల సంఖ్య నెలకు 10కి పెరగనున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతావాసులకు ఇది ఊరట కలిగించే విషయమే.
నాన్ మెట్రో నగరాల్లో 12 వరకు
నాన్ మెట్రో ప్రాంతాల్లో ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎస్బీఐ ఏటీఎంలలో 12 లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎం కార్డులకు 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఉచితం. ఇక, ఏదైనా కారణాలతో చెక్బుక్ బౌన్స్ అయితే జీఎస్టీతో కలుపుకొని రూ.168 చెల్లించాలి.
రూ.25,000 వేలకు పైగా అమౌంట్ ఉంటే... ఏటీఎం ఉచితం...
ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో రూ.25వేలు అంతకంటే ఎక్కువ నగదు ఉంటే అలాంటి వారికి అపరిమిత ఏటీఎం సేవలు అందనున్నాయి. అలాగే వేతనాలు పొందే ఖాదాదారులకు కూడా అన్లిమిటెడ్ ఉచిత ఏటీఎం సేవల వెసులుబాటు కల్పిస్తున్నారు.
బ్యాంకుకు వెళ్తే అదనపు వసూళ్లు!
అక్టోబర్ 1వ తేదీ నుంచి బ్యాంకుకు వెళ్లి RTGS లేదా NEFT ద్వారా నగదు ట్రాన్సుఫర్ చేయాలనుకుంటే ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది. అయితే నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేస్తే మాత్రం ఎలాంటి ఛార్జీ ఉండదు. ఆర్టీజీఎస్లో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ జరిపితే రూ.20 (జీఎస్టీ అదనం) వసూలు చేస్తారు. రూ.5 లక్షలకు పైన మొత్తంపై రూ.40 (జీఎస్టీ అదనం) వసూలు చేస్తారు. రూ.10వేల లోపు నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్కు రూ.2 వసూలు చేస్తారు. రూ.1 లక్ష లోపు రూ.4, రూ.రెండు లక్షల్లోపు రూ.12 వసూలు చేస్తారు.
రెపో రేటు లింక్డ్ రుణాలు
ఆటో, హోమ్ లోన్స్ సహా రిటైల్ లోన్స్ అన్నీ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్లతో అనుసంధానం కానున్నాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు ఈ పని చేస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్ కూడా అమల్లోకి వస్తుంది. అక్టోబరులో ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్ష నిర్వహిస్తే ఆ తర్వాత నవంబర్ నెల నుంచి ఎస్బీఐ రెపో రేటు లింక్డ్ రుణాలను అందిస్తుంది.