కొత్త జరిమానాలు షాకిస్తున్నాయి.. ఈ డ్రైవర్కు రూ.86,500 జరిమానా
భువనేశ్వర్: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మోటార్ వాహన చట్టం అమలులోకి వచ్చిన తర్వాత చాలామంది అత్యధిక జరిమానాలు ఎదుర్కొంటున్నారు. రూ.23 వేలు, రూ.43వేల జరిమానాలు చూశాం. తాజాగా ఒడిశాలోని ఓ ట్రక్కు డ్రైవర్కు ఏకంగా రూ.86,500 జరిమానా విధించారు. కొత్త మోటార్ చట్టానికి సంబంధించిన జరిమానాలు చర్చనీయంశంగా మారుతున్నాయి. అయితే ఇష్టారీతిన వెళ్తున్న డ్రైవింగ్కు అరికట్టి ప్రమాదాలు తగ్గించాలంటే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడమే మంచిదని చాలామంది భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే విదేశాల్లో ఇంతకంటే రెండింతలు, మూడింతల జరిమానాలు ఉన్నాయి.
ట్రక్కు డ్రైవర్కు రూ.86,500 జరిమానా
ప్రస్తుతం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కొత్త మోటార్ వాహన చట్టాన్ని అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ప్రజల్లో అవగాహన తెచ్చిన తర్వాత ప్రవేశపెడతామని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా ఒడిశాలోని సంభాల్పూర్లో ఓ ట్రక్కు డ్రైవర్కు రూ.86,500 జరిమానా విధించారు. కొత్త మోటార్ చట్టం అమల్లోకి వచ్చాక ఇంత పెద్ద మొత్తం జరిమానా విధించడం ప్రథమం. సెప్టెంబర్ మూడో తేదీన ఈ జరిమానా విధించగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
జేసీబీని తరలిస్తుండగా
నాగాలాండుకు చెందిన బీఎల్ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన జేసీబీని ఛత్తీస్గఢ్ తరలిస్తుండగా సంభాల్పూర్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ట్రక్కు పట్టుబడింది. దీంతో అధికారులు సదరు డ్రైవర్కు భారీ జరిమానా విధించారు.
రూ.86,500 జరిమానా ఎలాగంటే..
అనధికారిక వ్యక్తిని డ్రైవింగ్కు అనుమతించినందుకు రూ.5,000, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు రూ.5,000, అదనంగా 18 టన్నుల బరువును తీసుకువెళ్తున్నందుకు ఏకంగా రూ.56,000, పరిమితికి మించిన లోడుతో వెళ్తున్నందుకు రూ.20,000, ఇతర సాధారణ తప్పిదాలకు రూ.500 జరిమానా విధించారు. మొత్తం రూ.86,500 జరిమానా విధించారు. డ్రైవర్ అంతకట్టలేనని చెప్పారు. దీంతో సుదీర్ఘ చర్చల అనంతరం రూ.70వేలు జరిమానా చెల్లించాక వదిలేశారు. కాగా కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చాక మొదటి నాలుగు రోజుల్లో ఒడిశా ప్రభుత్వం రూ.88 లక్షల జరిమానా వసూలు చేసింది. దేశంలోనే అత్యధిక మొత్తం జరిమానా విధించిన రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.