జగన్ పాలసీ.. కేసీఆర్కు సిరులపంట! ఏపీ ఆ ఆదాయం తెలంగాణకే!!
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొత్త లిక్కర్ పాలసీ పొరుగు తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు వరంగా మారనుందా? అంటే అవునని అంటున్నారు. తాము అధికారంలోకి వచ్చాక క్రమంగా రాష్ట్రాన్ని మద్యరహిత రాష్ట్రంగా మారుస్తామని, అంచెలంచెలుగా మద్యం దుకాణాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. జగన్ ఆ హామీ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఇప్పటికే మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి.
అనుకున్నదొక్కటి...ఏపీకి లిక్కర్ షాక్, భారీగా పడిపోయిన ఆదాయం... కారణాలెన్నో...
తగ్గిపోనున్న లిక్కర్ షాప్స్..
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలను తగ్గించడం ద్వారా లిక్కర్ సేల్స్ తగ్గించాలని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే విధానం ద్వారా మద్యం దుకాణాల సంఖ్య 4,380 నుంచి 3,500కు పడిపోనున్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న దుకాణాల్లో 20 శాతాన్ని తగ్గిస్తున్నట్లు లెక్క. మద్యం దుకాణాలను తగ్గించడంతో పాటు మరో అడుగు కూడా వేస్తోంది.
APBCL పరిధిలో ఔట్ లెట్స్...
రెండోది ఏమంటే గత సంవత్సరం వరకు రిటైల్ మద్యం ఔట్లెట్స్ను వేలం వేసినట్లుగా ఇక నుంచి వేలం వేయరు. వీటిని ఆంధ్రప్రదేశ్ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ (APBCL) తన ఉద్యోగుల ద్వారా నిర్వహిస్తుంది. ఇప్పటికే 500 దుకాణాలు ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయాయి. APBCL సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సొంత ఔట్ లెట్స్ ప్రారంభిస్తుంది. వచ్చే నెల నుంచి మిగతా ఔట్ లెట్స్ కూడా వరుసగా ప్రభుత్వం ఆదీనంలోకి రానున్నాయి.
ఔట్ సోర్సింగ్....
ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన అకౌంటెంట్స్, సేల్స్ స్టాఫ్స్ సిబ్బందిని నియమించుకోవడానికి మంగళవారం నాడు తాము నోటిఫికేషన్ జారీ చేశామని, సెప్టెంబర్ చివరి నాటికి మౌలిక సదుపాయాలు సృష్టిస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్టుమెంట్కు సంబంధించిన అధికారులు చెప్పారు.
ఈ సమయంలోనే లిక్కర్ షాప్స్...
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ రిటైల్ మద్యం దుకాణాలు కూడా పరిమిత సమయంలో నడిపించబడతాయని వెల్లడించారు. ఉదయం గం.10 నుంచి రాత్రి గం.9 వరకు రన్ చేస్తారు. ఈ షాపుల్లో గరిష్ట రిటైల్ ధర నిబంధనను కచ్చితంగా అమలు చేస్తారు. అలాగే మద్యం వినియోగం హానికరం అనే బ్యానర్ను ప్రదర్శిస్తారు.
తగ్గిన ఆదాయం..
ముఖ్యమంత్రి సూచనల మేరకు ఇప్పటికే డిపార్టుమెంట్ అధికారులు అనధికార మద్యం దుకాణాలపై కొరఢా ఝులిపించారు. దీని వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ జూలై నెలలో మద్యం అమ్మకాలు 12 లక్షల కేసులు తగ్గాయి. ఒక్కో కేసులో 750 ML కలిగిన 12 బాటిల్స్ ఉంటాయి. దీంతో రాష్ట్ర ఆదాయం కూడా పడిపోయింది.
ఆదాయానికి ఇలా గండి...
జగన్ కొత్త ఎక్సైజ్ పాలసీ అట్టర్ ప్లాప్ అవుతుందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ చెప్పారు. ప్రభుత్వం తీరు రాష్ట్ర రెవెన్యూకు గండి కొడుతుందని చెప్పారు. ప్రభుత్వం నడుపుతుండటం వల్ల లైసెన్స్ ఫీజు, వేతనాలకు తోడు మద్యం విక్రయాలు తగ్గి, రాబడి కూడా తగ్గుతుందన్నారు.
తెలంగాణలో ఔట్ లెట్స్...
మరోవైపు, జగన్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాష్ చేసుకోవాలని చూస్తోందని అంటున్నారు. తెలంగాణలో 2,216 లైసెన్స్డ్ రిటైల్ లిక్కర్ ఔట్ లెట్స్, 840 బార్లు, 27 క్లబ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో లెక్కలెనన్ని అనధికార లిక్కర్ ఔట్ లెట్స్ ఉన్నాయని చెబుతున్నారు. జిల్లాలను 31 నుంచి 33కు, మున్సిపాలిటీలను 68 నుంచి 142, మున్సిపల్ కార్పోరేషన్ 6 నుంచి 13కి పెంచుతున్న నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి మరిన్ని లిక్కర్ ఔట్ లెట్స్ పెరుగుతాయని చెబుతున్నారు.
సరిహద్దు జిల్లాల్లో డిమాండ్
మద్యం దుకాణాల సంఖ్య పెంపుదలపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కానీ మార్కెట్లో డిమాండ్ ఉందని తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ) అండ్ ఎక్సర్సైజ్ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. ఏపీలో మద్యం అంశంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల్లోని తెలంగాణ రాష్ట్ర జిల్లాల్లో మద్యం అమ్మకాలు పెరగడానికి కారణం అవుతుందని చెబుతున్నారు. మద్యం అలావాటు ఓ వ్యక్తిని దూరం కూడా రప్పిస్తుంది. కాబట్టి సరిహద్దులోని జిల్లాల్లో ఏపీ నుంచి డిమాండ్ పెరగవచ్చునని చెబుతున్నారు.
తెలంగాణకు ఇలా ఆదాయం...
రిటైల్ వాణిజ్యాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీలో తమ వ్యాపారాన్ని కోల్పోయే మద్యం డీలర్లు తెలంగాణలో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే యోచనలో ఉన్నారని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం అప్లికేషన్ ఫీజును రెట్టింపు చేసి రూ.1 లక్షగా నిర్ణయించే యోచనలో ఉంది. సరిహద్దు జిల్లాల్లో మద్యం విక్రయాలు పెరగడం, ఏపీ వారు ఇక్కడ కూడా లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటి మార్గాల ద్వారా భారీగా ఆదాయం సమకూరనుందని అంటున్నారు.