'ఆంధ్రా బ్యాంకు'పై జగన్ కీలక నిర్ణయం, డ్రైవర్లకు గుడ్న్యూస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాల తొలగింపుపై స్పష్టత ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఒకే చెప్పింది. ఇసుకను రూ.375కే ఇస్తామని చెప్పడంతో పాటు ఆశా వర్కర్ల వేతనం పెంపుకు ఆమోద ముద్ర వేసింది. శ్రీరామ నవమి నుంచి వైయస్సార్ కానుక ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఇటీవల బ్యాంకుల విలీనంపై కూడా కేబినెట్ ఓ తీర్మానం చేసింది.
ఆరేళ్ళ గరిష్టానికి సమీపంలో... అందుకే బంగారానికి భారీ డిమాండ్
ఆంధ్రాబ్యాంకు పేరు యథాతథం
ఇటీవల వివిధ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఆంధ్రా బ్యాంకు పేరును తొలగించవద్దని, యథాతథంగా ఉంచాలని కేబినెట్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని మంత్రివర్గం కోరింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకులను ఒక్కటి చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా బ్యాంకు పేరును మార్చవద్దని కోరింది. ఈ బ్యాంకు పేరును మార్చవద్దని తాము తీర్మానం చేశామని, ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీకి లేఖ రాస్తారని మంత్రి పేర్ని నాని చెప్పారు.
ఉద్యోగాల తొలగింపు లేదు
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పని చేస్తోన్న క్షేత్రస్థాయి ఉద్యోగులు కొనసాగుతారని, ఎవరినీ తొలగించేది లేదని జగన్ స్పష్టం చేశారు. కొత్తగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులను నియమిస్తున్నందున తమ ఉద్యోగాలు పోతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వివరణ ఇచ్చారు. ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, గోపాలమిత్రలు, విద్యుత్ సబ్ స్టేషన్లలో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించమని చెప్పారు.
కీలక నిర్ణయాలు...
కొత్త ఇసుక విధానం, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, వైయస్సార్ పెళ్లి కానుక, ప్రత్యేక హోదా కేసుల ఎత్తివేత, పోలవరం విద్యుత్ ప్రాజెక్టుపై రివర్స్ టెండర్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించే ఉద్దేశ్యం లేనప్పుడు వారి గడువును నెల రోజులు మాత్రమే ఎందుకు పొడిగించారనే దానికి సమాధానం చెప్పారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా తమకు కావాల్సిన వారికి, చుట్టాలకు కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఇచ్చిందని, ఆయా ఏజెన్సీల సామర్థ్యం, పనితీరును వడపోస్తున్నామని చెప్పారు. దొడ్డిదారిన, అవినీతితో పోస్టులు అమ్ముకోవడానికి వచ్చిన వారిని తొలగిస్తామన్నారు.
ఆర్టీసీ విలీనం
ప్రభుత్వంలో సుమారు 52వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయనున్నారు. ఆంజనేయ రెడ్డి కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచేందుకు ఓకే. ప్రభుత్వ ఉద్యోగులుగా అన్ని సౌకర్యాలు, నియమ నిబంధనలు వర్తిస్తాయి. మూడు నెలల్లో సర్కారులోకి ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపు.
ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు
సొంతగా ప్యాసింజర్ ఆటో లేదా ట్యాక్సీ కలిగి ఉన్న యజమాని, దాని పైనే ఆధారపడి జీవిస్తుంటే ఏడాదికి రూ.10వేల ఆర్థిక సాయం. ఇందులో భార్యాభర్తలను ఒక యూనిట్గా పరిగణిస్తారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడుతుంది. ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2019 మార్చి నాటికి ఏపీలో ఆరు లక్షలకు పైగా ఆటోలు, ట్యాక్సీలు ఉన్నాయి. సొంత యజమానులు మాత్రం దాదాపు 4 లక్షలు.
పెళ్లి కానుక
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వధువులకు, దివ్యాంగులకు, భవన నిర్మాణ కార్మికుల కుమార్తెలకు శ్రీరామ నవమి నుంచి వైయస్సార్ పెళ్లి కానుక అందిస్తారు. దీనిని పెళ్లి రోజే ఇస్తారు.
పెళ్లి కానుక ఎవరికి ఎంత అంటే?
పెళ్లి కానుకగా ఎస్సీలకు రూ.40వేల నుంచి రూ.1 లక్ష, ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ.1లక్ష, బీసీలకు రూ.35 వేల నుంచి రూ.50 వేలు, మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే అదనంగా రూ.20వేలు ఇస్తారు. భవన నిర్మాణ కార్మికుల కుమార్తెలను పెళ్లి చేసుకుంటే రూ.1 లక్ష పెళ్లి కానుకగా ఇస్తారు. వధూవరుల్లో దివ్యాంగులు ఉంటే రూ.1.5 లక్షలు.
ఇసుక ధర...
కొత్త ఇసుక విధానానికి కూడా ఆమోద ముద్ర వేసింది కేబినెట్. రీచ్లు ఉన్న జిల్లాల్లో స్టాక్ యార్డుల వద్ద టన్ను రూ.375, రవాణా ఖర్చు టన్నుకు కిలో మీటరుకు రూ.4.90. 10 కిలో మీటర్ల లోపు ట్రాక్టర్ ద్వారా సరఫరా చేయడం. రవాణా ఖర్చు రూ.500. ప్రస్తుతం స్టాక్ పాయింట్లు అన్ని జిల్లాల్లో కలిపి 41 ఉండగా 80 వరకు పెంచనున్నారు.
ఆశా వర్కర్ల వేతనాలు
ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీల్లో ఆశా వర్కర్ల వేతన పెంపు కూడా ఒకటి. దీనిని రూ.3వేల నుంచి రూ.10,000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై కేసుల ఎత్తివేత. నవయుగ సంస్థకు పోలవరం జల విద్యుత్, ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.