ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా?: దరఖాస్తు లేకుండానే పాన్కార్డ్!
న్యూఢిల్లీ: పాన్ కార్డు లేకపోయినప్పటికీ ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇటీవల పాన్ కార్డు లేనివారు కూడా తమ ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారు ఉన్నారు. పాన్ లేకుండా ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినవారికి ఐటీ డిపార్టుమెంట్ ఆటోమేటిక్గా పాన్ కార్డును జారీ చేస్తోంది.
నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లాక్-అన్లాక్ ఎలాగో తెలుసుకోండి?
ఆటోమేటిక్గా పాన్ కార్డు జారీ
ఈ మేరకు సోమవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండివిడ్యువల్స్ ఎవరైనా ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే వారికి ఆటోమేటిక్గా పాన్ కార్డును ఇస్తామని తెలిపింది. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ప్రకటన చేశారు. ఆదాయపన్ను చట్టం ప్రకారం పాన్కు ఆధార్ ప్రత్యామ్నాయంగా పేర్కొంది.
సెప్టెంబర్ 1 నుంచి అమలు
ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు ఆధార్ కార్డును ఉపయోగించడం అంటే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లుగా పరిగణించవలసి ఉంటుందని CBDT తెలిపింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. వారికి ఈ తేదీ నుంచి పాన్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు.
ఆధార్-పాన్
ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, జండర్, ఫోటో, అడ్రస్, ఇండివిడ్యువల్స్ బయోమెట్రిక్ వంటి వివరాలు కలిగి ఉంటుంది. 10 డిజిట్ నెంబర్ కలిగిన పాన్ కార్డును ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంట్ జారీ చేస్తుంది. కంపెనీలకు, వ్యక్తులకు వీటిని జారీ చేస్తుంది.
వీటికి పాన్ కార్డు అవసరం..
దేశంలో 120 కోట్ల మందికి ఆధార్ కార్డుఉంది. 41 కోట్ల మందికి పైగా పాన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 22 కోట్ల ఆధార్ కార్డులు పాన్ కార్డుతో లింక్ చేశారు. హోటల్ లేదా ఫారన్ ట్రావెల్ బిల్స్ రూ.50,000 మించిన ట్రాన్సాక్షన్స్కు పాన్ తప్పనిసరి. అలాగే రూ.10 లక్షలకు పైన స్థిరాస్థి కొనుగోలుకు కూడా పాన్ తప్పనిసరి.