ఉద్యోగానికి ఢోకా లేదు, మన్మోహన్కు ఇదే నా జవాబు: సీతారామన్
ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. తాజా నిర్ణయంతో 2017 వరకు 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా ఇప్పుడు 12కు తగ్గాయి. బ్యాంకులు తగ్గడంతో ఉన్న ఉద్యోగాలు పోతాయోమేననే ఆందోళన చాలామందిలో ఉంది. దీనిపై అప్పుడే నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా, ఆదివారం (సెప్టెంబర్ 1) కూడా మరోసారి భయం లేదని భరోసా ఇచ్చారు.
ఈ రాజకీయం పక్కనపెట్టు, మీ వల్లే ఈ దుస్థితి: మోడీపై మన్మోహన్
ఉద్యోగం ఆందోళన వద్దు...
వివిధ బ్యాంకులను విలీనం చేయడంతో చాలామంది ఉద్యోగాలపై అభద్రతా భావంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై నిర్మల స్పందిస్తూ... ఏ బ్యాంకులు కూడా తమ ఉద్యోగులను తప్పుకోవాలని అడగలేదని, ఏ బ్యాంకును మూసివేయబోమని, ఉద్యోగుల తొలగింపు ఉండదని స్పష్టం చేశారు.
ఏ బ్యాంకును మూసివేయడం లేదు..
'ఏ బ్యాంకును మూసివేయడం లేదు. ప్రస్తుతం చేస్తున్న కార్యకలాపాలు మినహా అందుకు భిన్నంగా చేయాలని ఏ బ్యాంకూ ఉద్యోగులను అడగడం లేదు. వాస్తవానికి ప్రభుత్వం వారికి ఎక్కువ మూలధనం ఇస్తోంది.' అని నిర్మల చెప్పారు.
ఉద్యోగుల నిరసన...
పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు సంస్థలుగా విలీనం చేయడాన్ని నిరసిస్తూ చెన్నైలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ శనివారం నిరసన తెలిపింది. భోపాల్, కోల్కత్తా పోటు ఇతర ప్రాంతాల్లోను నిరసనలు చోటు చేసుకున్నాయి. బ్యాంకుల్లోకి పెద్ద ఎత్తున మూలధనం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన అనంతరం బ్యాంకుల విలీనం జరిగింది. ఉద్యోగుల నిరసనపై ఆమె స్పందించారు.
అందరి అభిప్రాయం తీసుకుంటున్నాం..
నిర్మలా సీతారామన్ను ఆర్థిక మందగమనంపై కూడా ఆమెకు ప్రశ్న ఎదురైంది. జూన్ క్వార్టర్లో కేవలం 5 శాతం మాత్రమే ఉండటంపై ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలో తెలుసుకునేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సమావేశమవుతున్నట్లు ఆమె చెప్పారు.
'ప్రభుత్వం వివిధ రంగాల వారితో సంప్రదింపులు జరిపింది. కొన్ని రంగాల నుంచి వారు ఏం ఆశిస్తున్నారో వివరాలు వస్తున్నాయి. నేను ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తున్నాను. ఇన్పుట్స్ తీసుకుంటున్నాను. వారు ఏం కోరుకుంటున్నారు... ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో తీసుకుంటున్నాను. ఇప్పటికే రెండుసార్లు కలిశాను. మళ్లీ కలుస్తాను' అని చెప్పారు.
ఇదే నా సమాధానం..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మందగమనంపై చేసిన విమర్శలపై ప్రశ్నించగా... సమాధానం చెప్పేందుకు నిర్మలా సీతారామన్ విముఖత వ్యక్తం చేశారు. రాజకీయం చేసే బదులు నిపుణుల సలహాలు తీసుకోమని ఆయన చెప్పారని, ఆయన చెప్పింది ఇదేనని, సరే.. థ్యాంక్యూ.. నేను అతని స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకుంటున్నానని, ఇదే తన జవాబు అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే నిర్మలా సీతారామన్ మందగమనంపై పలు రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. మన్మోహన్ కూడా అదే విషయం చెప్పడంతో ఆమె అలా సమాధానం చెప్పారు.