దిగిరానున్న ఆపిల్ ధరలు.. ముంబైలో రిటైల్ స్టోర్ కూడా ..
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించడంతో అమెరికా, చైనా కంపెనీలకు రిలీఫ్ కలిగింది. దీంతో ఆయా కంపెనీలు తమ సొంత స్టోర్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కలిగింది. ముఖ్యంగా ఆపిల్ కంపెనీ స్టోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీంతో ఆ కంపెనీ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు ఆపిల్ ఫోన్లు చౌకగా లభించే అవకాశాలు ఉన్నాయి.
ఎఫ్డీఐ నిబంధనల సవరనతో ఆపిల్ కంపెనీకి చెందిన ఫోన్లు, వాచ్, మాక్ బుక్స్ .. ఇతర ఉత్పత్తుల ధర తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆపిల్ కంపెనీ థర్డ్ పార్టీ ద్వారా తమ సంస్థకు చెందిన వస్తువులను విక్రయించింది. ఇక సొంతంగా స్టోర్ ఏర్పాటు చేసుకుంటే ధరలో తేడా భారీగానే ఉండనుంది. ఇదీ వినియోగదారులకు లభిస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. తక్కువ ధరకే బ్రాండెడ్ వస్తువులు లభించనుండటం వినియోగదారులకు పండుగే మరి.
ఇదివరకు విదేశీ కంపెనీలు 30 శాతం వస్తువులను దేశంలో తయారు చేయాలనే నిబంధన ఉండేది. కానీ దానికి మోడీ సర్కార్ సడలింపు ఇచ్చింది. ఏడాదికి 30 శాతం అనే నిబంధనను సవరించి ..ఐదేళ్లకు సగటున 30 శాతం ఉత్పత్తి చేసినా సరిపోతుందని వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు ఆన్లైన్ విక్రయాలకు కూడా అనుమతిచ్చింది. ఐదేళ్ల ఎగుమతులను పరిగణలోకి తీసుకొని ప్రస్తుత పరిమితిని తొలగించాలని ప్రతిపాదించారు. సింగిల్ బ్రాండ్ రిటైల్లో ఎఫ్డీఐ కోసం దరఖాస్తు చేసిన బ్రాండ్లు ఆన్ లైన్ రిటైల్ సేల్స్ను కూడా ప్రారంభించవచ్చు. అయితే రెండేళ్లలో ఫిజికల్ స్టోర్ను మాత్రం తెరవాల్సి ఉంటుంది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆపిల్ లాంంటి దిగ్గజ కంపెనీలకు మార్కెట్ పెంచుకునే అవకాశం లభించింది. దీంతో త్వరలో దేశంలో ఆపిల్ తన తొలి ఆన్లైన్ స్టోర్ కూడా ప్రారంభించబోతుందని తెలిసింది. వచ్చే ఏడాది ముంబైలో రిటైల్ స్టోర్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికే 140 రిటైల్ షాపుల్లో తన ఫోన్లను ఆపిల్ విక్రయిస్తోంది. దీని వాటా 1.2 శాతం అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.