బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాలు పోతాయా?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివిధ బ్యాంకుల విలీనం శుక్రవారం నాడు ప్రకటన చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ఈ చర్యలను చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే బ్యాంకుల విలీన ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకును విలీనం చేసి దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఏర్పడనున్నట్లు తెలిపారు.
రూ.70,000 కోట్లలో విలీనం తర్వాత ఏ బ్యాంకుకు ఎంత అంటే?
కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ను కలిపి నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకును కలిపి అయిదే అతిపెద్ద బ్యాంకుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ బ్యాంకును అలహాబాద్ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గుతుంది.
వివిధ బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళన పలువురు వ్యక్తం చేశారు. దీనిపై నిర్మలా సీతారామన్ స్పందించారు. బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగాలకు ఢోకా లేదన్నారు. ఏ బ్యాంకు ఉద్యోగి కూడా తమ ఉద్యోగం కోల్పోయే పరిస్థితులు ఉండవని స్పష్టం చేశారు.
నిర్మలా సీతారామన్ ఇంకా ఏం చెప్పారంటే.... 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. బ్యాంకింగ్ రంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నామన్నారు. గృహ, వాహనాల, తనఖా రుణాలను ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రారంభించాయని చెప్పారు. సుపరిపాలన దిశగా బ్యాంకులు తమ సేవల్లో మార్పులు చేసుకోవాలన్నారు. రుణాల నిర్వహణను బ్యాంకులు సమీక్షిస్తున్నాయని, రుణాల రికవరీలో బ్యాంకులు పురోగతి సాధించాయన్నారు. 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల బాటలో ఉన్నాయన్నారు. నీరవ్ మోదీ వంటి ఘటనలు మళ్లీ జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ. 250 కోట్ల కంటే ఎక్కువ రుణాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.