ఆర్థిక పరిస్థితిని బట్టి 'అమరావతి', రాజధాని రైతులకు మాత్రం గుడ్న్యూస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సమయం పడుతుందని ప్రభుత్వం హింట్ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతాయని తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో రాజధాని నగర నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణంపై ఇటీవల తీవ్ర గందరగోళం చెలరేగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజధాని ముంపు ప్రాంతంలో ఉందని మంత్రి బొత్స వ్యాఖ్యానించడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
జగన్ ప్రభుత్వానికి లిక్కర్ దెబ్బ, భారీగా పడిపోయిన ఆదాయం
అమరావతి నిర్మాణంపై సందేహం వద్దు.. కానీ
రాజధాని నిర్మాణంపై ఎవరికీ సందేహాలు అవసరం లేదని మంత్రి బొత్స ఈ సమావేశం అనంతరం స్పష్టం చేశారు. అమరావతి ముంపు ప్రదేశమనే అంశంపై ఈ సమావేశంలో చర్చకు రాలేదన్నారు. రాజధానిపై విరుద్ధమైన ప్రకటనల గురించి మీడియా ప్రశ్నించగా.. ఇతరులు మాట్లాడే వాటికి తాను ఎలా స్పందిస్తానని చెప్పారు. బ్యాంకులతో ఒప్పందం లేని పనులను రద్దు చేసినట్లు తెలిపారు.
వడ్డీలతో సహా రూ.70,000 కోట్లకు చేరుకుంటుంది....
అమరావతి భూములకు వ్యాల్యూ రావడానికి పదిహేను ఇరవై ఏళ్లు పడుతుందని, ఇప్పుడు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఇప్పుడు ఖర్చు చేసే రూ.35,000 కోట్ల భారం భూముల విలువ పెరిగే సమయానికి వడ్డీలతో కలిపి రూ.70,000 కోట్లకు చేరుకుంటుందన్నారు. అమరావతిలో రూ.35వేల కోట్ల పనులకు గతంలో టెండర్లు పిలిచారని, వాటిలో నిధుల సమీకరణకు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని పనులను రద్దు చేశామన్నారు.
వాటిని రద్దు చేశాం....
రాజధాని నిర్మాణం కోసం నిధుల్ని సమీకరించుకోకుండా పనులు చేస్తే బిల్లులు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే జరిగిన పనులకు గాను రూ.2,800 కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయన్నారు. టెండర్లు ఖరారు చేసి ప్రారంభించని పనులను రద్దు చేశామని, మిగతా పనులను ఎలా చేపట్టాలనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందన్నారు.
రైతులకు గుడ్ న్యూస్...కౌలు చెల్లింపు
అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన 64,000 మంది రైతులకు స్థలాలు ఇచ్చామని, ఇందులో 43,000 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందని చెప్పారు. మిగతా రిజిస్ట్రేషన్లు త్వరలో చేస్తామన్నారు. రైతులకు చెల్లించాల్సిన వార్షిక బకాయిలు శుక్రవారం నుంచి చెల్లిస్తామన్నారు. కౌలు చెల్లింపు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారన్నారు.
శ్రీభరత్ పైన....
రాజధాని ఐదు కోట్లమంది ప్రజలదని, ఏ ఒక్క కమ్యూనిటీది కాదన్నారు. రాజధాని అంశంలో వైసీపీ ఓ వర్గాన్ని టార్గెట్ చేసిందన్న టీడీపీ నేతల వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. తెలుగుదేశం పార్టీ పాలనలో నందమూరి బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ అమరావతిలో భూమిని కొనుగోలు చేశారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పారు. డాక్యుమెంట్స్ చూపించారు. 2012లో తమకు భూకేటాయింపులు జరిగాయని అతను చెబుతున్నారని, కిరణ్ హయాంలో జరిగితే 2015లో జీవో ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
జగన్తో భేటీలో ఈ అంశం రాలేదు...
కృష్ణాకు వరదలు వస్తే రాజధాని ప్రాంతం ముంపుకు గురవుతుందని, దీనిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మీరు అన్నారు కదా, దీనిపై చర్చ జరిగిందా అని మీడియా అడగ్గా... పరిశీలిస్తున్నామనే తాను చెప్పానని, ఇప్పటికీ అదే విషయం చెబుతున్నానని అన్నారు. జగన్తో సమావేశంలో ఈ అంశం చర్చకు రాలేదన్నారు.