'ప్రపంచ సాఫ్టువేర్ కేంద్రంగా భారత్, ఇన్వెస్టర్లలో ఎన్నడూలేని విశ్వాసం'
గోరక్పూర్: ఫారన్ ఇన్వెస్టర్లతో సహా అందరి పెట్టుబడిదారుల్లోను గతంలో లేని విశ్వాసం కనిపిస్తోందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకలు నారాయణమూర్తి గురువారం అన్నారు. ఉద్యోగాల సృష్టికి ఎంటర్ప్రెన్యూవర్స్కు ప్రభుత్వం అడ్డంకులను తొలగించాలని సూచించారు. మన ఆర్థిక వ్యవస్థపై ఆశాభావంగా ఉన్నారు. గోరక్పూర్ (యూపీ)లోని మదన్ మోహన్ మాలవియా యూనివర్సిటీ ఆప్ టెక్నాలజీ (MMMUT)లో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
పెట్టుబడిదారుల్లో ఎన్నడూ లేని విశ్వాసం...
నారాయణమూర్తి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు. ఈ సంవత్సరం మన ఆర్థిక వ్యవస్థ 6 శాతం నుంచి ఏడు శాతానికి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం సాఫ్టువేర్ రంగానికి కేంద్రంగా మారిందన్నారు. మన ఫారన్ ఎక్స్చేంజ్ నిల్వలు 400 బిలియన్ డాలర్లు దాటాయని తెలిపారు. అలాగే, పెట్టుబడుదారుల్లో గతంలో ఎన్నడూ లేని కొత్త విశ్వాసం కనిపిస్తోందన్నారు.
భారత్లో గతంలో లేని విధంగా.. అద్భుతం
ఫారన్ పోర్ట్పోలియో ఇన్వెస్ట్మెంట్స్ (FPI)లు గతంలో ఎన్నడూ లేనంతగా వేగంగా పెరుగుతున్నాయని నారాయణమూర్తి అన్నారు. వెంచర్ కాపిటలిస్టుల నుంచి మన ఎంటర్ప్రెన్యూవర్స్ భారీగా ఫండ్స్ పొందగలుగుతున్నారని చెప్పారు. మన స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా బాగా ఉన్నాయని ప్రశంసించారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకారం మన దేశంలో బిలియనీర్ల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు.
సమాంతర భారతం...
సమాంతర భారతదేశం గురించి కూడా నారాయణమూర్తి మాట్లాడారు. పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత లేకుండా చేయడం, ఆరోగ్యం, పోషకహారం లోపం లేకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత అన్నారు. ప్రెండ్లీ బిజినెస్ వాతావరణం సృష్టించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది నిరక్షరాస్యులు మన దేశంలో ఉన్నారన్నారు. 350 మిలియన్ల మంది చదవలేరు, రాయలేరని, 200 మిలియన్ల మందికి స్వచ్ఛమైన తాగునీరు చేరడం లేదని, 750 మిలియన్ల మందికి శానిటేషన్ సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ (HDI)లో అత్యల్ప ర్యాంకుతో ఉంటున్నామన్నారు.
ప్రభుత్వాలు మరింత సిటిజన్ ఫ్రెండ్లీగా మారాలి
మన ప్రభుత్వాలు మరింత సిటిజన్ ఫ్రెండ్లీగా మారాలని నారాయణ మూర్తి అన్నారు. ఎంటర్ప్రెన్యూయర్స్ పెద్ద సంఖ్యలో ఉద్యోగాల సృష్టించేందుకు ప్రభుత్వాలు అడ్డంకులు తొలగించాలన్నారు. మన ఆర్థిక విధానాలు నైపుణ్యం ఆధారంగా ఉండాలన్నారు. జింగోయిజానికి దూరంగా ఉండాలన్నారు.