అమ్మయ్య! పెట్రోల్-డీజిల్ వాహనాలపై గడ్కరీ శుభవార్త చెప్పారు..
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది కాలంగా ఆటోమొబైల్ రంగంలో సేల్స్ పడిపోయాయి. దానికి తోడు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV)ను ప్రోత్సహిస్తూ, రానున్న పదేళ్లలో వీటిని ఉపయోగాన్ని పెంచే విధంగా ప్లాన్ చేస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి రద్దు తేదీలను నిర్ణయించలేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం స్పష్టం చేశారు. ఇది ఆటో సెక్టార్కు కొత్త ఉత్సాహం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం EVలను ప్రోత్సహిస్తుండటంతో కార్లు, బైక్స్ సేల్స్ మరింతగా పడిపోయాయి. దీంతో ఆటో సెక్టార్లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే, డీలర్స్ తమ దుకాణాలు మూసువేసుకునే పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గడ్కరీ ప్రకటన ఊరటనిచ్చేదే.
ఒకప్పుడు ప్రపంచంలో టాప్ సేల్స్, ఇప్పుడు 10,000 ఉద్యోగాలు కట్
పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్కు గడువు లేదు
'వాహన తయారీదారులు పెట్రోల్, డీజిల్ వాహనాల ఉత్పత్తి నుంచి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి మారడానికి ప్రభుత్వ నిర్దిష్ట డెడ్ లైన్ విధించలేదు. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాయి. ఇది మీరు చూస్తూనే ఉన్నారు. ఈ షిఫ్టింగ్ సహజప్రక్రియలో భాగంగా సాగుతుంది' అని గడ్కరీ చెప్పారు.
వారిని సంప్రదించాకే...
సంప్రదాయ 150 సీసీ లోపు టూ వీలర్స్కు 2025 నాటికి, త్రీ వీలర్స్కు 2023 నాటికి చెల్లుచీటి పాడాలని నీతి అయోగ్ చేసిన ప్రపోజల్ పైన ప్రశ్నించగా గడ్కరీ పైవిధంగా స్పందించారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను ఈ గడువులోగా నిషేధించాలనే గడువు లేదని, కానీ క్లీనర్ ఫ్యూయల్స్ను ప్రోత్సహిస్తామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు గడువును నిర్ణయించే ముందు స్టేక్ హోల్డర్స్ను సంప్రదిస్తామన్నారు.
ఆటో రంగానికి ఉత్సాహం
ఆటో మేకర్స్తో పాటు ఈ సెక్టార్ మొత్తానికి గడ్కరీ వ్యాఖ్యలు పునరుత్తేజాన్ని కల్పిస్తాయి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా పలు కారణాల వల్ల పాసింజర్ వెహికిల్స్ సేల్స్ భారీగా పడిపోయాయి. రెండు దశాబ్దాల గరిష్టానికి పడిపోయాయి. అయితే పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్కు గడువు లేకపోయినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి మాత్రం ప్రభుత్వం నడుంకట్టింది.