ఆందోళనకరం, మాంద్యం తప్పదు!: మోడీ ప్రభుత్వానికి రఘురాం రాజన్ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థ మందగమనం చాలా ఆందోళన కలిగించేదిగా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కొత్త సంస్కరణలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యుత్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ (NBFCs) రంగాల్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారత్ అన్నింటా ముందుండాలని, అందుకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాలన్నారు. ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
జగన్ దెబ్బ: నెలలో 25% మార్కెట్ వ్యాల్యూ కోల్పోయిన కంపెనీ!!
ఆరు నెలల్లో కీలక నిర్ణయాలు
అన్ని సెక్టార్ల పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, ఉద్దీపన చర్యలు అవసరమని రఘురాం రాజన్ చెప్పారు. ఇందుకే కొత్త సంస్కరణలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమైన సమస్యలు గుర్తించి, వాటికి ఆరు నెలల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెట్టేలా చర్యలు ఉండాలన్నారు. 2018-19లో ఆర్థిక వృద్ధి 6.8 శాతానికి తగ్గిందని, 2014-15 నుంచి లెక్కిస్తే ఇది కనిష్టం అన్నారు.
గాడిలో పెట్టాలి..
ఆటోమొబైల్ రంగం ఇరవై ఏళ్ల తర్వాత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని రఘురాం రాజన్ అన్నారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు వచ్చాయన్నారు. స్థిరాస్థి రంగం బలహీనంగా మారిందని, ఎఫ్ఎంసీజీ కంపెనీలు వ్యాల్యూ ఆధారిత వృద్ధిని కోల్పోయాయని చెప్పారు. వీటిని గాడిలో పెట్టాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో బేరసారాలు సంస్కరణల కిందకు రాదన్నారు. అది ఒక చర్య మాత్రమే అన్నారు.
ఆరు నెలలు కాదు.. వెంటనే
వినియోగ డిమాండ్ తగ్గడంతో పాటు పెట్టుబడులు కోల్పోతుండటం వల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధిని కోల్పోతోందని రఘురాం రాజన్ అన్నారు. ఐఎల్&ఎఫ్ఎస్ సంక్షోభం నేపథ్యంలో NBFCs లిక్విడిటీ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయన్నారు. పవర్ సెక్టార్, ఎన్బీఎఫ్సీ అంశంపై దృష్టి సారించాలన్నారు. వీటిని రాబోయే ఆరు నెలల్లో కాదని, వెంటనే పరిష్కరించే మార్గంపై దృష్టి సారించాలన్నారు. కనీసం 2 లేదా 3 పర్సెంటేజీ పాయింట్ల వృద్ధి రేటును అదనంగా సాధించాలంటే ఎన్బీఎఫ్సీ, పవర్ సెక్టార్లను వెంటనే చక్కదిద్దాలన్నారు.
సంస్కరణలు ఇలా అవసరం..
మందగమనంలో కొనసాగుతున్న ప్రయివేటు సెక్టార్లలో పెట్టుబడులు పెంచేందుకు ప్రోత్సాహకాలు మాత్రమే సరిపోవని, సంస్కరణలు అవసరమని రాజన్ అన్నారు. సరికొత్త సంస్కరణల ద్వారా ప్రయివేటు రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలన్నారు. ప్రోత్సాహకాలు తాత్కాలికంగా ఊరటను ఇస్తాయని, కానీ దీర్ఘకాలికంగా ఉపయోగపడవని చెప్పారు. ధైర్యమైన సంస్కరణలతో పాటు ప్రజలను చైతన్యపరిచే, భారత మార్కెట్లకు శక్తినిచ్చే, భారతీయ వ్యాపారానికి శక్తినిచ్చే సంస్కరణలపై దృష్టి సారించాలన్నారు.
జీడీపీ పెంపుపై..
2011-12, 2016-17లలో జీడీపీ వృద్ధి రేటును పెంచి చూపించారనే అంశంపై కూడా రఘురాం రాజన్ స్పందించారు. జీడీపీని 2.5 శాతం పెంచి చూపించారని ప్రభుత్వ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ అరవింద్ సుబ్రహ్మణియం అన్నారు. దీనిపై రాజన్ మాట్లాడారు.
జీడీపీ డేటాతో ఎక్కువ వృద్ధి అంచనా
అరవింద్ సుబ్రహ్మణియం చేసిన వ్యాఖ్యలపై మనం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రఘురాం రాజన్ అన్నారు. కొత్త జీడీపీ డేటాతో వృద్ధిని ఎక్కువగా అంచనా వేస్తున్నామని భావిస్తున్నానని చెప్పారు. ఇదే విషయాన్ని తాను గత కొంతకాలంగా చెబుతున్నానని తెలిపారు.
జీడీపీ లెక్కించేందుకు..
వృద్ధి రేటుపై ప్రైవేటు సెక్టార్ విశ్లేషకులు భిన్న రకాల అంచనాలు వేస్తున్నారన్నారు. ఇవన్నీ ప్రభుత్వం వేసిన అంచనాల కంటే తక్కువగా ఉన్నాయని చెప్పారు. జీడీపీని లెక్కించే విధానం కోసం ఓ స్వతంత్ర నిపుణుల గ్రూప్ను ఏర్పాటు చేయాలని, దాని సూచనలతో జీడీపీని లెక్కించే కొత్త రూపం ఉండాలన్నారు. జీడీపీ లెక్కలు సరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. తప్పుడు గణాంకాలు తప్పుడు విధాన రూపకల్పనలకు కారణం అవుతాయని హెచ్చరించారు. 2008లో వచ్చిన ప్రపంచ సంక్షోభం తిరిగి అదే ప్రాంతాల్లో రావాలనే నిబంధన లేదని, మరోసారి వచ్చే సంక్షోభం కొత్త వాటి నుంచి ఉత్పన్నం కావొచ్చునని చెప్పారు. జీడీపీ సరిగా లేకుంటే మాంద్యం తలెత్తే ప్రమాదం ఉంటుందన్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఆటో సెక్టార్ భారీగా పడిపోయింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరోవైపు FMCG వృద్ధి మందగించింది.