ఇక, అపోలో హాస్పిటల్స్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు!
ఢిల్లీ: ప్రభుత్వరంగ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) అపోలో హాస్పిటల్స్తో విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించి పదేళ్ల ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. దేశంలోని అన్ని అపోలో హాస్పిటల్స్ల్లో ప్రజా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఈ MoU కుదిరింది. దేశంలోని ప్రజా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఓ ప్రైవేటు భాగస్వామితో ఎంవోయు కుదుర్చుకోవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని EESL ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ-స్కూటర్ కొంటే అందరికీ డిస్కౌంట్, ఒక్కరికి బంపరాఫర్
పెట్టుబడి, మానవవనరులు...
అపోలో హాస్పిటల్స్తో పదేళ్ల కోసం ఎంవోయు కుదుర్చుకున్నట్లు ఆదివారం రోజున EESL తెలిపింది. ఈ MoU ప్రకారం విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరుల్ని, పెట్టుబడిని EESL ముందే సమకూర్చుతుంది. ఛార్జింగ్ స్టేషన్లకు అవసరమైన స్థలం ఇవ్వడంతో పాటు విద్యుత్తు కనెక్షన్లను అపోలో హాస్పిటల్స్ సమకూర్చవలసి ఉంటుంది.
ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన, విశ్వాసం పెంచేందుకు...
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రజలకు మరింత అవగాహన, విశ్వాసం కలిగించేందుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని EESL తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ విషయంలో ప్రైవేటు రంగం పాత్రను ప్రోత్సహించాలనే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రోగ్రాం లక్ష్యాల్ని అపోలో హాస్పిటల్స్తో తమ ఎంవోయూ బలోపేతం చేస్తుందని తెలిపింది.
అందుకే అపోలోతో ఒప్పందం
విద్యుత్ వాహనాలపై వినియోగదారుల్లో విశ్వాసం పెంపొందించేందుకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా అపోలో హాస్పిటల్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. వాయు ఉద్గారాలను తగ్గించేందుకు, గాలి నాణ్యతను పెంచేందుకు విద్యుత్ మొబిలిటి అవశ్యమని EESL డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వెంకటేష్ ద్వివేది అన్నారు. అపోలో హాస్పిటల్స్ విద్యుత్, స్థలం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.