రెస్టారెంట్ ఓనర్ల దెబ్బకు దిగొచ్చిన జొమాటో సీఈవో!
న్యూఢిల్లీ: ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI)కు మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం జొమాటో ఫౌండర్ అండ్ సీఈవో దీపీందర్ గోయల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ వేదికగా రెస్టారెంట్ ఓనర్లకు ఓ విజ్ఞప్తి చేశాడు. జొమాటో నుంచి లాగౌట్ కంపెయిన్ను నిలిపివేయాలని కోరారు. చర్చలకు ముందుకు రావాలని రెస్టారెంట్ ఓనర్లను కోరారు.
ఫుడ్ డెలివరీ యాప్ లకు దెబ్బ : 1200 రెస్టారెంట్లు లాగౌట్
|
లాగౌట్ కంపెయిన్ వద్దు...
వినియోగదారుల ప్రయోజనాల కోసం రెస్టారెంట్ ఓనర్లు లాగౌట్ కంపెయిన్ను నిలుపుదల చేయాలని దీపిందర్ గోయల్ ట్వీట్ చేశాడు. పరిష్కార మార్గం కోసం చర్చలకు ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా రెస్టారెంట్లు జొమాటో నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో దీపిందర్ స్పందించాడు.
అందుకే రెస్టారెంట్లు నో...
జొమాటో వంటి వాటితో తమ ఒప్పందాలు వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయని, డిస్కౌంటింగ్ మోడల్స్ కూడా ఇబ్బందికరంగా మారాయని చెబుతూ రెస్టారెంట్ ఓనర్లు జొమాటో నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జొమాటో గోల్డ్, మేజిక్ పిన్, ఈజీ డినర్, నియర్ బై, డైనౌట్ వంటి వాటి నుంచి తప్పుకోవాలని NRAI నిర్ణయించింది.
|
గోల్డ్ మెంబర్షిప్లో మార్పులు చేస్తాం
రెస్టారెంట్లకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఇతర ఫుడ్ అగ్రిగేటర్లు హామీ ఇచ్చారు. జొమాటో మాత్రం శుక్రవారం సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. NRAI లేవనెత్తిన ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని శనివారం దీపిందర్ ట్వీట్ ద్వారా తెలిపారు. కంపెనీ తప్పు చేసిందని అంగీకరించాడు. రెస్టారెంట్ యజమానులకు తాము ఇంతకుముందు చేసినదాని కంటే 100 రెట్లు చేయాలన్నాడు. ఇండస్ట్రీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని, గోల్డ్ మెంబర్షిప్ ప్లాట్ ఫాంలో మార్పులు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పాడు.
ఆహార ధరలు తగ్గించండి...
జొమాటో గోల్డ్ ప్రోగ్రాం విజయం సాధించిందని, కానీ రెస్టారెంట్ పరిశ్రమలోని కొన్ని విభాగాలను దెబ్బతీసిందని గోయల్ చెప్పాడు. అదే సమయంలో రెస్టారెంట్ ఓనర్లకు ఆసక్తికర సూచన చేశాడు. ఆహార సేవల వ్యాపారం యొక్క ధరలు తగ్గించాలని రెస్టారెంట్ యజమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈ సందర్భంగా చైనాను ఉదహరించాడు. భారత్లో సగటు ఆర్డర్ ధర చైనాతో సమానంగా ఉందని, కానీ చైనా తలసరి ఆదాయం భారత్ కంటే 4.5 రెట్లు ఎక్కువ అని తెలిపాడు. మనదేశంలో ఆహార రంగంలో స్థిరమైన వృద్ధి కోసం ధరలు తగ్గించడం ముఖ్యమని చెప్పాడు.