అందనంత ఎత్తులో.. పేమెంట్ యాప్లో చైనాతో భారత్ పోటీ!
భారత ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తోంది. క్యాష్లెస్ చెల్లింపుల విషయంలో భారత్... చైనాతో పోటీ పడుతోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం భారత్లో చాలా పుట్టుకు వస్తున్నాయని దక్షిణాసియా పేమెంట్స్ నెట్ వర్క్ అభిప్రాయపడింది. చైనాలో కేవలం ఆ దేశానికి చెందిన రెండు యాప్స్ మాత్రమే మార్కెట్లో కీలకంగా ఉండగా, భారత్లో ఎన్నో యాప్స్ పుట్టుకు వస్తున్నాయని తెలిపింది. భవిష్యత్తులో ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ నుంచి మరిన్ని యాప్స్ రావొచ్చునని పేర్కొంది.
చైనా టార్గెట్
క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంశంలో చైనా లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ క్రమంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని రకాల యాప్స్కి అవకాశం కల్పిస్తున్నామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దిలీప్ తెలిపారు. చైనా వలె కాకుండా తాము అందరికీ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్స్ను అందరికీ అందుబాటులోకి తేవడానికి యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఐదు రెట్లు పెరిగన డిజిటల్ ట్రాన్సాక్షన్
ప్రస్తుతం గూగుల్, పేటీఎంలతో పాటు ఫోన్పే వంటి 87యాప్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ 72 శాతం మంది నగదుతో కూడిన ట్రాన్సాక్షన్స్ వైపు మొగ్గు చూపుతున్నారని ఓ నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల్ని అనుమతించడం లేదని అందులో పేర్కొన్నారు. 2015 తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఐదు రెట్లు పెరిగాయని ఆర్బీఐ ఇటీవల తెలిపింది.
నోట్ల రద్దు తర్వాత నగదు చలామణి తగ్గినా..
గత ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి సగటున ఒకరు 22.4 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించినట్లు తెలిపింది. చైనాలో ఇది 2017లో 99.7గా ఉంది. నోట్ల రద్దు తర్వాత నగదు చెలామణి కాస్త తగ్గినా గత రెండు సంవత్సరాలుగా మళ్లీ పెరుగుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. తొలుత డిజిటల్ పేమెంట్స్ ఉపయోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి వీటిపై అవగాహన పెంచాలని చెబుతున్నారు.
యాప్స్ అవసరం
పేమెంట్ యాప్స్ కూడా ట్రాన్సాక్షన్ వ్యాల్యూ పైన కాకుండా వారికి ఉన్న కస్టమర్ల సంఖ్యపై దృష్టి సారించాలని దిలీప్ చెబుతున్నారు. వచ్చే అయిదేళ్లలో డిజిటల్ పేమెంట్స్ వినియోగదారుల సంఖ్యను అయిదంతలు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రస్తుతం UPIలో 10 కోట్ల మంది యూజర్లు ఉన్నారని, దానిని యాభై కోట్లకు చేర్చే విధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. చైనా విషయానికి వస్తే కేవలం వీ చాట్ పే యాప్లో 80 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని, డ్రాగన్ దేశంతో పోటీ పడాలంటే యాప్స్ అవసరమని చెబుతున్నారు.