పేమెంట్ కంపెనీలు విలవిల : ఆర్థిక మంత్రి నిర్ణయంపై ఆశలు
భారత్ లోని డిజిటల్ పేమెంట్ కంపెనీలు, వాలెట్ సంస్థలు ఇటీవలి బడ్జెట్ ప్రతిపాదనతో విలవిలలాడుతున్నాయి. అసలే అధిక నిర్వహణ వ్యయాలతో సతమతమవుతున్న తమపై ఇది పిడుగుపాటు చర్యేనని వాపోతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెనక్కు తీసుకోవాలని ప్రాధేయపడుతున్నాయి. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాయి. బడ్జెట్ లో ఆర్థిక మంత్రి .... రూ 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు ఎండీఆర్ వసూలు చేయరాదని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తో మొబైల్ వాలెట్ కంపెనీలకు కొత్త తలనొప్పి మొదలైంది.
జియో బంపరాఫర్: థియేటర్లో సినిమా విడుదలైన రోజే ఇంట్లో చూడొచ్చ
మా ఆదాయం తగ్గి పోతుంది...
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వలే డిజిటల్ పేమెంట్ కంపెనీలకు ఫీల్డ్ ఆఫీస్ నెట్వర్క్ ఉండదు. అంతా ఆన్లైన్ పధ్ధతి లో కార్యకలాపాలు సాగుతాయి. వీటికి డిజిటల్ చెల్లింపులు తప్ప మరో మార్గంలో ఆదాయం సమకూరదు. కానీ బ్యాంకులు సహా ఆర్థిక సంస్థలన్నిటికీ అనేక రకాల ఆదయ మార్గాలు ఉంటాయి. అవి కావాలంటే వినియోగదారులపై ఇతరత్రా సర్వీస్ చార్జీల రూపంలో నిధులను రాబట్టుకొంటాయి. కానీ డిజిటల్ పేమెంట్ కంపెనీలు మాత్రం ఇలా చేయలేవు. వినియోగదారు తమ క్రెడిట్, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేసినపుడు, మర్చంట్ నుంచి డిజిటల్ పేమెంట్ కంపెనీలు, వాలెట్స్ కొంత మొత్తం కమిషన్ రూపం లో తీసుకొంటాయి. దీనినే ఎండీఆర్ ఛార్జ్ అంటారు. సాధారణంగా ఇది 1% నుంచి 3% వరకు ఉంటుంది. లావాదేవీ మొత్తం విలువలో ఈ కమిషన్ వసూలు చేసి, మిగిలిన మొత్తాన్ని మర్చంట్ కు ఈ కంపెనీలు చెల్లించుతాయి. యూపీఐ పధ్ధతి లో జరిగే లావాదేలపై ఇవి సంబంధిత శాఖకు నిర్వహణ చార్జీలను చెల్లిస్తాయి. కానీ ప్రభుత్వ నిర్ణయం తో ఇది సాధ్యం కాదు. మా ఆదాయం పూర్తిగా ఎండీఆర్ పైనే ఆధారపడి ఉంటుంది అని ఫోన్ పే బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ హెడ్ హేమంత్ గలా తెలిపారు. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. ఎండీఆర్ లేదంటే తమ ఆదాయాలు తగ్గిపోతాయని ఈ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మొబైల్ వాలెట్స్ లో తగ్గిన లావాదేవీలు...
దేశంలో మొబైల్ వాలెట్స్ లో జరిగిన లావాదేవీలపై దీని ప్రభావం పడినట్లుంది. ఈ ఏడాది తోలి ఆరు నెలల కాలంలో (జూన్ లో) మొబైల్ వాలెట్స్ లో జరిగిన లావాదేవీల సంఖ్య 33.4 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ లావాదేవీలు గతేడాది డిసెంబర్ లో 39.3 కోట్లు కావడం గమనార్హం. మొబైల్ వాలెట్ పేమెంట్స్ అమల్లోకి వచ్చిన తర్వాత లావాదేవీల సంఖ్య తగ్గడం ఇదే తొలిసారని ది ఎకనామిక్ టైమ్స్ వ్యాఖ్యానించింది.
వాటిపైనే అధిక భారం...
ఒకవైపు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని ప్రభుత్వం చెబుతూనే... మరో వైపు ఈ రంగంలోని కంపెనీలకు ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక మంత్రి నిర్ణయంతో క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవాలకు పెద్దగా ఇబ్బంది లేదు కానీ... పి 2 పి లెండింగ్ కంపెనీలు, మొబైల్ వాల్లెట్లు , పేమెంట్ గేట్వే కంపెనీలు అధిక ప్రభావానికి లోనవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కంపెనీలు మూడు రకాల ఫీజులు చెల్లిస్తామని, అందులో ఎండీఆర్ ఒకటే వీటికి ఆదయ వనరు అని అనలిస్టులు వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఎండీఆర్ చార్జీలను రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తన మిగులు నిధుల నుంచి భరిస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కానీ అది ఆచరణలో జరిగే పనేనా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా మంచి చేయబోతే మరేదో ఎదురైనట్లు, పేమెంట్ కంపనీలకు ఇలాంటి కష్టం వచ్చి పడింది.