ఏపీ సచివాలయ ఉద్యోగాలు: వీరు అప్లై చేసినా అనర్హులు, తెలంగాణలో చదివినా...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దాదాపు 22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. విజయనగరం జిల్లా నుంచి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. వీరికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహిస్తారు. 2, 5వ తేదీలు మినహా 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయి. ఈ దరఖాస్తులకు తొలుత శనివారం రాత్రి వరకు గడువు ఉండగా, ఆదివారం రాత్రి వరకు పొడిగించారు. దీంతో మరో అరవై వేల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి.
ఏపీ నిరుద్యోగులకు గుడ్న్యూస్: సచివాలయ పోస్ట్లకు దరఖాస్తు గడువు పొడిగింపు
రాత పరీక్ష చిక్కు... పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత
దరఖాస్తు పీజు చెల్లించిన వారు మాత్రమే పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత ఉంటుంది. 22.69 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా 21.69 లక్షల మంది మాత్రమే ఫీజులు చెల్లించారు. అలాగే, 13 జిల్లాల్లో ఎక్కడా స్థానికతకు అర్హత లేని వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా రాత పరీక్షకు అనర్హులు. వారికి హాల్ టిక్కెట్లు కూడా జారీ చేసే అవకాశం లేదు. ఈ ఉద్యోగాలకు ఆరువేల మందికి పైగా రాష్ట్రేతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణలో చదివినప్పటికీ.. వీరికి ఓకే
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలో చదివి, విభజన తర్వాత నిబంధనల మేరకు ఏపీ స్థానికతను అధికారికంగా పొందిన వారికి మాత్రం రాత పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. మిగతా వారికి ఆ అవకాశం ఉండదు. రాత పరీక్ష కోసం 8వేలకు పైగా పరీక్షా కేంద్రాలను, 50 వేలకు పైగా గదులను సిద్ధం చేస్తున్నారు. 16 మంది, 24 మంది, 48 మంది అభ్యర్థులకు ఓ గది చొప్పున పరీక్షా కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు.
పరీక్ష తేదీలు...
సెప్టెంబర్ 1వ తేదీన కేటగిరి 1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారికి పరీక్ష నిర్వహిస్తారు. 13 జిల్లాల్లోని తాలుకా, మండల కేంద్రాల్లో కలిపి ఉదయం కొందరికి, మధ్యాహ్నం కొంతమందికి రాత పరీక్ష నిర్వహిస్తారు. గ్రామ ఇంజినీరింగ్ కార్యదర్శి, వార్డు సౌకర్యాల కార్యదర్శి, వీఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసినవారికి 3, 4 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా కేటగిరీల్లోని ఉద్యోగులకు రోజుకు లక్షమంది చొప్పున 6, 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
కేటగిరీ 1 ఉద్యోగాలకు అత్యధిక దరఖాస్తులు
కేటగిరీ 1లో పేర్కొన్న నాలుగు రకాల ఉద్యోగాలకు కలిపి నిర్వహించే ఒకే రకమైన రాతపరీక్షకు అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. కేటగిరీలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, గ్రామ, వార్డు మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఉద్యోగాలు ఉన్నాయి.
ఇతర కేటగిరీలకు...
కేటగిరీ 2(ఏ)లో ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ ఉద్యోగాలకు దాదాపు లక్షన్నర మంది, కేటగిరీ 2(బీ)లో వీఆర్వో, సర్వే అసిస్టెంట్ ఉద్యోగాల కోసం లక్షా డెబ్బై వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరీ 3లో మిగిలిన 11 రకాల ఉద్యోగాలు ఉండగా, ఇందుకోసం ఆరున్నర లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు.