మేడిన్ ఆంధ్రా కారు: సెల్టోస్ గురించి తెలుసుకోండి!, జగన్ గైర్హాజరు
అనంతపురం: ఏపీలోని అనంతపురం ప్లాంటులో గురువారం దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ కియా మోటార్స్ తన తొలి కారు సెల్టోస్ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ రావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, భారత్లోని సౌత్ కొరియా రాయబారి షిన్ బాంగ్ కిల్, కియా మోటార్స్ ఇండియా ఎండీ కూక్ హున్ షిమ్ ఈ కారును ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాల్లో టెస్టింగ్ అనంతరం సెల్టోస్ వాహనాల పూర్తిస్థాయి ఉత్పత్తిని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.
జగన్ గుడ్న్యూస్, శాలరీ రూ.3,000 నుంచి రూ.10వేలకు పెంపు
రూ.25,000 టోకెన్ అమౌంట్తో బుకింగ్
కియా సెల్టోస్ కారు బుకింగ్స్ ప్రారంభమైన మూడు వారాల్లోనే 23,000 దాటాయి. టోకెన్ అమౌంట్ రూ.25,000కు జూలై 16వ తేదీన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కియా మోటార్స్ డీలర్షిప్ రిజిస్ట్రేషన్లు అధికారికంగా తెరవడానికి ముందే జూలై ప్రారంభంలో ప్రీ-ఆర్డర్స్ను అంగీకరించాయి.
ఐదు వేరియంట్లలో..
కియా మోటార్స్ కంపెనీ SP2 కాన్సెప్ట్ బేస్డ్ కియా సెల్టోస్ ఇండియాలో ఆగస్ట్ 22వ తేదీన విడుదల చేసి, 23వ తేదీ నుంచి డెలివరీ చేయనుంది. సెల్టోస్ SUV టెక్ లైన్, జీటీ లైన్.. రెండు ట్రిమ్స్ల్లో రానుంది. ఈ రెండు కూడా ఐదు చొప్పున... E, K, K+, X and X+ వేరియంట్స్తో ఉంటాయి.
మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్తో సెల్టోస్
సెల్టోస్ కారు 1.5 లీటర్ సహజ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ లేదా 1.4 లీటర్ GDI టర్బో పెట్రోల్ ఇంజిన్లతో పని చేస్తుంది. ఈ ఇంజిన్లు BSVI కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా వస్తున్నాయి. నేచరల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (టర్బో చార్జ్డ్ పెట్రోల్ మోటార్) 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7 స్పీడ్ ట్విన్ క్లచ్ ఆటోమోటిక్ గేర్ బాక్స్ ఉంటాయి. డీజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ టార్గ్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఈ SUV మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్.. నార్మల్, ఎకో, స్పోర్ట్స్తో వస్తున్నాయి.
విదేశాలకు ఎగుమతి.. ఉద్యోగ అవకాశాలు
అనంత ప్లాంటులో తయారు చేసిన సెల్టోస్ కారును దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. భారత్లో కియా మోటార్స్ దాదాపు రెండు బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఇందులో 1.1 బిలియన్ డాలర్లు అనంతపురం ప్లాంటుపైనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. దీంతో 11,000 మందికి ఉపాధి లభిస్తుంది. పర్మినెంట్ ఉద్యోగులు 4,000, టెంపరరీ ఉద్యోగులు 7,000 మంది ఉంటారు.
అత్యాధునిక టెక్నాలజీ...
అనంతపురం జిల్లా పెనుగొండలో దాదాపు 536 ఎకరాల్లో కియా ప్లాంట్ ఉంది. ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి మూడు లక్షలు. భవిష్యత్లో ఏడు లక్షల యూనిట్లను పెంచుకోవాలని చూస్తోంది. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారుచేసేలా ఈ ప్లాంటును నిర్మించారు. ఈ ఏడాది జనవరిలో కియా మోటార్స్ ట్రయల్ ఉత్పత్తి ప్రారంభించింది. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
భారత్లో అందుబాటు ధరలో..
భారతీయులకు అందుబాటు ధరల్లో ఉన్నతశ్రేణి కార్లను తయారు చేయాలన్న లక్ష్యంతో ఇక్కడ అడుగుపెట్టామని కియా ఇండియా ఎండీ, సీఈవో కూక్ హున్ షిమ్ అన్నారు. అనంతలో ఏర్పాటు చేసిన ప్లాంట్ భారత్లోనే అత్యాధునికమైనదన్నారు. భారత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెల్టోస్ కారును రూపొందించామన్నారు.
భారత మధ్య తరగతి ప్రజలు ఇష్టపడే కారుగా...
కియా కార్ల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరించాయని సౌత్ కొరియా రాయబారి అన్నారు. కియాను చూసి కొరియా ఇన్వెస్టర్లు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కారుగా సెల్టోస్ నిలుస్తుందన్నారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమన్నారంటే..
2007లో హ్యుండాయ్ సంస్థలో ముఖ్య ఉద్యోగిగా ఉన్న ఆంగ్రూ పార్క్ను అప్పటి సీఎం వైయస్ కలిసినప్పుడు ఏపీలో కార్ల తయారీ పరిశ్రమను నెలకొల్పుతామని హామీ ఇచ్చారని, వైయస్సార్ నాటిన విత్తనమే కియా రూపంలో మహా వృక్షంగా మారిందని, పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని, పెట్టుబడులకు ఒక అథారిటీని ఏర్పాటు చేసి, దేశ విదేశాల నుంచి వచ్చేవారిని స్వాగతిస్తామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన అన్నారు. సెల్టోస్ కారు కోసం తొలి రోజే 6000 బుకింగ్స్ రావడం అభినందనీయం అన్నారు. విద్యుత్తో నడిచే ఆర్టీసీ బస్సులు ఏపీలో తయారయ్యేలా పరిశ్రమలు తీసుకు వస్తామన్నారు. జగన్ హాజరుకావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల రాలేదు. ప్రభుత్వ ప్రతినిధిగా బుగ్గనను పంపించారు.
చంద్రబాబు కృషి వల్లే.. 90% ఉద్యోగాలు..
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కృషి వల్లే కియా కార్ల పరిశ్రమ వచ్చిందని అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు బీకే పార్ధసారథి అన్నారు. ఏపీ పారిశ్రామిక రంగంలోనే కియాను చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని చెప్పారు. కియా ఏర్పాటు వెనుక చంద్రబాబు శ్రమ, దూరదృష్టి ఉందని తెలిపారు. 90 % ఉద్యోగాల్ని జిల్లా యువతకు ఇవ్వాలని తాము అప్పట్లోనే ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.