ఖరీదు కానున్న టూరిజం: విమాన టిక్కెట్లు 5%, హోటల్ రెంట్ 7%
అంతర్జాతీయంగా 2019లో పర్యాటక ఖర్చుల పెరుగుదల ఎక్కువగా ఉండగా, 2020లో నెమ్మదించవచ్చునని సీడబ్ల్యుసి-గ్లోబల్ బిజినెస్ ట్రావెల్ అసోసియేషన్ (GBTA) సర్వే వెల్లడించింది. విమాన ఛార్జీల ధరలు 1.2 శాతం, హోటల్ ఛార్జీలు 1.3 శాతం, కార్లు అద్దె ఛార్జ్ 1 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. ట్రేడ్ వార్, బ్రెగ్జిట్ ప్రభావం, ఇంధన సరఫరాలో తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో పెరుగుదల శాతం నెమ్మదించవచ్చునని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని, 3.6% వృద్ధితో సాగవచ్చునని తెలిపింది.
పెట్రోల్ బంకులో మీరు ఈ సేవలు ఉచితంగా పొందవచ్చు
ఈ సర్వే ఓ రోడ్డు మ్యాప్
సీడబ్ల్యూటీ సొల్యూషన్స్ గ్రూప్ రూపొందించిన జాబితా ఆధారంగా.. 2020 గ్లోబల్ ట్రావెల్ ఫోర్కాస్ట్ తెలుస్తుంది. రాబోయే ఏడాదిలో వ్యాపార ప్రయాణ పరిశ్రమ ఎలా ఉంటుంది, దాని అభివృద్ధి ఏ మేరకు ఉంటుందని తెలుస్తుంది. టెక్నాలజీ పురోగతి, ఆర్థిక అస్థిరత్వం, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు కారణంగా ట్రావెల్ బిజినెస్ ఆలోచనాధోరణి కూడా మారుతోందని GBTA COO, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్కాట్ సోలోంబ్రినో అన్నారు. ఈ సర్వే అందరికీ ఓ రోడ్ మ్యాప్ అని తెలిపారు.
ఇండియాలో పెరగనున్న ట్రావెల్ ఛార్జీలు
భారతదేశం విషయానికి వస్తే, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జెట్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను తాత్కాలికంగా క్లోజ్ చేయడం వల్ల మార్కెట్లో గ్యాప్ ఏర్పడిందని, అలాగే ఎయిర్ లైన్స్ మార్కెట్లో పోటీ తగ్గిందని ఈ సర్వే వెల్లడించింది. దీంతో ఇప్పటికే ధరలు పెరిగాయని, అయితే, ఇప్పుడున్న విమానయాన సంస్థలు తమ విమానాల సంఖ్యను పెంచుకుంటూ, గ్యాప్ను పూడ్చుతున్నాయని పేర్కొంది. దీంతో ధరల్లో పెరుగుదల సాధారణంగానే ఉండే అవకాశముందని తెలిపింది. భారత ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉందని, వ్యాపార పర్యటనలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఈ కారణాల వల్ల విమాన, హోటల్, ట్యాక్సీ ఛార్జీలు పెరుగుతాయన్నారు.
ఓయో వంటి సంస్థల వల్లా...
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తే మళ్లీ విమాన టికెట్లు పెరగక తప్పదని సీడబ్ల్యుటీ ఇండియా సీఈవో విశాల్ సిన్హా అన్నారు. అప్పుడు ఇంధన ఖర్చులు పెరుగుతాయన్నారు. చండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్ వంటి సెకండరీ సిటీల్లో డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని, ఫలితంగా అద్దెలు పెరుగుతాయన్నారు. ఓయో వంటి సంస్థలు కూడా ఇందుకు దోహద పడతాయన్నారు.
భారత్లో విమాన, హోటల్, ట్రాన్సుపోర్ట్ ఛార్జీల పెరుగుదల శాతం...
భారత్ వంటి ఆసియా పసిఫిక్ దేశాల్లో హోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ 15 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. 2020లో జరగనున్న ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్తో జపాన్లో హోటల్ బిజినెస్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. 2020లో విమానయాన ఛార్జీలు 5 శాతం, డాలర్ల పరంగా హోటల్ అద్దె 6.8 శాతం, ట్రాన్సుపోర్ట్ ఛార్జీలు 4.5 శాతం పెరుగుతాయని అంచనా వేసింది.