వీజీ సిద్ధార్థ ఆత్మహత్య: కాఫీ డే రుణాలపై షేర్ హోల్డర్ల డౌట్స్, మైండ్ ట్రీతో సేఫ్ అనుకుంటే...
బెంగళూరు: వీజీ సిద్ధార్థ అదృశ్యం, ఆ తర్వాత ఆయన మృతి చెందాడని తెలియడంతో కేఫ్ కాఫీ డే షేర్లు రెండు రోజులుగా భారీగా నష్టపోతున్నాయి. మంగళవారం 20 శాతం నష్టపోయిన షేర్లు, బుధవారం కూడా అంతేస్థాయిలో దిగజారి రూ.122.75కు చేరాయి. మార్చి నెలలో మైండ్ ట్రీ షేర్లు విక్రయించినప్పటి నుంచి షేర్ల ఊగిసలాట ప్రారంభమైంది. మైండ్ ట్రీ డీల్ ప్రకటన అనంతరం ఇంతలా పడిపోవడం మాత్రం ఇప్పుడే.
పోరాడలేను: బిజినెస్ ఫెయిల్యూర్ అంటూ ఉద్యోగులకు కాఫీ డే ఓనర్ సిద్ధార్థ లేఖ,
మైండ్ ట్రీ లైఫ్ సేవర్గా ఉండాలి..
మైండ్ ట్రీ ఒప్పందం కేఫ్ కాఫీ డేకు లైఫ్ సేవర్గా ఉండాలి. ఎందుకంటే ట్యాక్స్, ఖర్చుల అనంతరం ఈ కంపెనీకి రూ.2,100 నికర నగదు సమకూరింది. డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి కాఫీ డే ఏకీకృత నికర రుణాలు రూ.3,750 కోట్లు. మైండ్ ట్రీ ఒప్పందం ద్వారా వచ్చిన మొత్తంతో కంపెనీకి చెందిన సగానికి పైగా రుణాలు తగ్గుతాయి. మైండ్ ట్రీ డీల్ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లలో అనుమానాలు తలెత్తాయి. దీంతో స్టాక్స్ అప్పటి నుంచి ఊగిసలాడుతున్నాయి.
రుణాల తగ్గుదల
మైండ్ ట్రీ డీల్ అనంతరం కంపెనీ రుణాలు రూ.2,400 కోట్లకు తగ్గినట్లుగా కేఫ్ కాఫీ డే వెల్లడించింది. అయితే అప్పటికే కంపెనీకి ఉన్న రూ.3,750 కోట్ల రుణాలకు, మైండ్ ట్రీ డీల్ ద్వారా వచ్చిన రూ.2,100 రుణాలకు భిన్నంగా ఇది ఉంది. మార్చి నెలాఖరులో మైండ్ ట్రీ డీల్కు సంబంధించి రూ.600 కోట్లు కంపెనీకి ట్రాన్సుఫర్ అయినట్లు చెప్పింది. ఇది మే నెలలో సెటిల్ అయింది. షేర్ హోల్డర్ల అనుమానాలకు ఎన్నో కారణాలు అని చెబుతున్నారు. అయితే కాఫీడే వివరణ నమ్మశక్యంగా లేదని, అందుకే తాము తమ హోల్డింగ్స్ విక్రయించామని ఓ ప్రయివేటు ఇన్వెస్టర్ వెల్లడించారు. మార్చి క్వార్టర్ ఫలితాల్లో అనుమానాలు ఉన్నాయని సదరు ఇన్వెస్టర్ వెల్లడించారు.
పడిపోతున్న షేర్లు...
రుణాలపై ప్రశ్నలు ఓ వైపు ఉదయిస్తుంటే, వారి సమాధానాలు నమ్మశక్యంగా లేవని, మేలో కాఫీ డే కాన్ఫరెన్స్ భేటీ జరిగినప్పటి నుంచి మంగళవారం వరకు ఈ కంపెనీ షేర్లు 24 శాతం నష్టపోయాయి. బుధవారం మరో 20 శాతం తగ్గాయి. మార్చి త్రైమాసికం ముగిసేనాటికి కాఫీ డే గ్రాస్ డెబ్ రూ.6,500 కోట్లు. అంతకు, ఆరు నెలలకు ముందు ఇది రూ.4,400 కోట్లుగా ఉంది.
ఆదాయ పన్ను శాఖ వివరణ
మరోవైపు, వీజీ సిద్ధార్థ లేఖ కలకలం రేపుతోంది. ఆదాయ పన్ను శాఖ ఇబ్బంది పెట్టినట్లుగా ఆయన పేర్కొన్నారు. దీనిపై ఐటీ శాఖ స్పందించింది. తాము అతనిని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని, సిద్ధార్థ విషయంలో చట్టప్రకారమే వ్యవహరించామని, మైండ్ ట్రీలో వాటాల విక్రయం ద్వారా సిద్ధార్థ రూ.3,200 కోట్లు ఆర్జించారని ఐటీ అధికారులు తెలిపారు. రూ.300 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉండగా, రూ.46 కోట్లు మాత్రమే పే చేశారన్నారు. సిద్ధార్థ పేరుతో విడుదలైన లేఖలో ఆయన సంతకం, తమ రికార్డుల్లోని సంతకంతో సరిపోలడం లేదన్నారు.
కాఫీ డే వ్యాపార సామ్రాజ్యం
కేఫ్ కాఫీ డే పేరుతో వ్యాపార రంగంలో సంచలనం సృష్టించిన వీజీ సిద్ధార్థ వ్యాపార సామ్రాజ్యం పెద్దదే. విదేశాల్లోను కాఫీ డే సెంటర్స్ ఉన్నాయి. మొత్తం 1722 కాఫీ డే కేఫ్స్ ఉన్నాయి. 47,747 కాఫీ విక్రయ యంత్రాలు ఉండగా, 403 కాఫీ డే దుకాణాలు ఉన్నాయి. 30,000కు పైగా సిబ్బంది, 3వేల కోట్ల టర్నోవర్కు విస్తరించింది. మైండ్ ట్రీలో పెట్టుబడులు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అయితే కొన్నేళ్లుగా ఆయనకు వ్యక్తిగత అప్పులు కూడా పెరిగాయి. అలాగే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ రుణాలు పెరుగుతూ వచ్చాయి. మైండ్ ట్రీ విక్రయం ఒత్తిడిని తగ్గిస్తుందని భావించారు. తన రియల్ ఎస్టేట్ కంపెనీ టాంగ్లిన్తో పాటు కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.