నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ అప్పులు: 32% కంటే ఎక్కువ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) రిపోర్టును ప్రవేశపెట్టారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఏపీ అప్పుల శాతం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నిబంధనలకు మించిపోయిందని కాగ్ నివేదిక పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దాని కంటే ఎక్కువ మొత్తంలో అప్పులు చేసినట్లు తెలిపింది. పెద్ద ఎత్తున వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులతో ఓవర్ డ్రాఫ్టులకు వెళ్లినట్లు స్పష్టం చేసింది.
ఎలక్ట్రిక్ వెహికిల్స్పై జగన్ ఆసక్తి, జపాన్ కాన్సులేట్తో భేటీ
మీరిన FRMB నిబంధన
2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన FRMB చట్ట నిబంధనలను అనుసరించి 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు ఎంతనెరవేరాయో కాగ్ విశ్లేషించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 25.09 శాతానికి మించకూడదు. కానీ ప్రభుత్వం 32.30 శాతానికి పెంచినట్లుగా పేర్కొంది.
దాదాపు 5 రెట్లు పెరిగిన రెవెన్యూ లోటు
2017-18లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.8,03,873 కోట్లుగా ఉంది. అదే సమయంలో అప్పు మాత్రం రూ.2,59,670.02 కోట్లుగా ఉంది. అంటే స్థూల ఉత్పత్తిలో రుణభారం పరిమితికి మించింది. అలాగే, రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో రెవెన్యూ లోటును 3.26 శాతానికి పరిమితం చేయాల్సి ఉండగా, అది ఏకంగా 15.37 శాతానికి చేరింది. స్టేట్ రెవెన్యూ లోటు రూ.16,151.67 కోట్లుగా, TRR రూ.1,05,062.09 కోట్లుగా ఉన్నట్లు కాగ్ తెలిపింది.
ద్రవ్యలోటు 3 శాతానికి మించకూడదు
FRMB ప్రకారం రాష్ట్రం ద్రవ్యలోటు 3 శాతానికి మించకూడదు. కానీ అది 1.03 శాతం పెరిగి 4.03 శాతంగా ఉంది. జీఎస్డీపీ రూ.8,03,873 కోట్లు కాగా, ఆర్థిక లోటు రూ.32,380గా ఉంది. FRBM ప్రకారం ద్రవ్య లోటు, జీఎస్డీపీ మధ్య నిష్పత్తి 3 శాతానికి మించకూడదు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని ఈ ఆర్థిక సంవత్సరంలో 3.3 శాతానికి తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అంతకుముందు ఏడాది 3.4 శాతంగా ఉంది.
2017-18లో రెవెన్యూ లోటు
2017-18 బడ్జెట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య లోటు రూ.23,053 కోట్లు కాగా, వాస్తవ లోటు మాత్రం రూ.32,380 కోట్లుగా ఉంది. 2006-07 నుంచి రెవెన్యూ మిగులు చూపించగా, 2017-18లో మాత్రం రెవెన్యూ లోటు ఏర్పడటం గమనార్హం. ఏడాదిలోనే రూ.80వేల కోట్ల అప్పు చేశారు.
అప్పుల మేర లేని ఆస్తులు
రెవెన్యూ లోటుకు తోడు ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉందని కాగ్ తెలిపింది. ఆదాయం రూ.లక్షా 5వేల కోట్లు మాత్రమే ఉందని తేల్చింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31వ వరకు రూ.16,151 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందని పేర్కొంది. రెవెన్యూ లోటుతో పాటు అప్పులు పెరిగితే అందుకు తగ్గట్టుగా మూలధన ఆస్తులు పెరగాల్సి ఉండగా రూ.28,203 కోట్ల అప్పులు చేస్తే 16,272 కోట్ల మేర ఆస్తులు మాత్రమే పెరిగాయని తెలిపింది. నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆర్థికమంత్రి బుగ్గన ఆరోపించారు.
ఓవర్ డ్రాఫ్ట్
2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2017-18 వరకు చంద్రబాబు ప్రభుత్వం
వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్స్కు వెళ్లింది. 2015-16 ఆర్థికసంవత్సరంలో 259 రోజులు, 2016-17లో 250 రోజులు, 2017-18లో 188 రోజులు వేస్ అండ్ మీన్స్కు వెళ్లింది. 2017-18లో 43 రోజల పాటు ఓవర్ డ్రాఫ్ట్స్కు వెళ్లింది.
ద్రవ్య వినిమయ బిల్లులో పెరిగిన అంచనా
ఇదిలా ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,32,287 కోట్ల అంచనాతో ద్రవ్య వినిమయ బిల్లుల్ని రాష్ట్ర ఉభయ సభలు ఆమోదించాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ నెల 12న అసెంబ్లీలో రూ.2,27,975 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కొన్ని లెక్కల్లో మార్పులు రావడంతో ద్రవ్య వినిమయ బిల్లులో అంచనా రూ.4312 కోట్ల మేర పెరిగింది. ప్రతిసారి బడ్జెట్ అంచనాల సమయంలో ఇది సాధారణమేనని చెబుతున్నారు. గత ఆర్థిక ఏడాదిలోను రూ.1.91 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ సమర్పించినా సభల్లో ఆమోదం నాటికి అది రూ.1.94 లక్షల కోట్లకు పెరిగింది.