కేఫ్ కాఫీ డే ఓనర్ వీజీ సిద్ధార్థది ఆత్మహత్యే, మృతదేహం లభ్యం
బెంగళూరు: నేత్రావతి నది బ్రిడ్జి నుండి అదృశ్యమైన కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ మృతదేహం నదిలో లభ్యమైంది. ఆయన ఆత్యహత్య చేసుకున్నారు. సోమవారం అదృశ్యమైన ఆయన నేత్రావతి నదిలో దూకినట్లుగా ఓ జారి వెల్లడించారు. సిద్ధార్థ కోసం జాలర్లు, గజఈతగాళ్లు, అధికారులు తీవ్రంగా గాలించారు. చివరకు విగతజీవిగా కనిపించారు.
నేత్రావతి నది ఒడ్డున ఆయన బాడీ లభ్యమైంది. సోమవారం బెంగళూరు నగర శివార్లలోని తొక్కుట్టు ప్రాంతంలో నేత్రావతి నది వంతెన వద్ద ఆయన అదృశ్యమయ్యారు. తాను వ్యాపార లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయానని కంపెనీ ఉద్యోగులకు, బోర్డు మెంబర్లకు లేఖ రాసిన విషయం తెలిసిందే.
వీజీ సిద్ధార్థ ఇన్నోవా కారులో సోమవారం డ్రైవర్తో కలిసి ప్రయాణించారు. నేత్రావతి పైన ఉన్న ఉల్లాల్ బ్రిడ్జి దాటే సమయంలో.. కారును ఆపమని తన డ్రైవర్కు చెప్పాడు. డ్రైవర్ ఆపిన వెంటనే కారు దిగి, ఫోన్ మాట్లాడుతూ కనిపించారు. కారును అలాగే వెళ్లనీయమని డ్రైవర్కు సూచించాడు. డ్రైవర్ కారును నెమ్మదిగా ముందుకు పోనిచ్చాడు. అదే సమయంలో వీజీ సిద్ధార్థ కారు వెనుక కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చారు. కాసేపటి తర్వాత కనిపించలేదు. దీంతో డ్రైవర్ వీజీ సిద్ధార్థకు ఫోన్ చేశారు. అది స్విచ్చాఫ్ చేసి ఉంది.
బిజినెస్ ఫెయిల్యూర్ అంటూ ఉద్యోగులకు కాఫీడే ఓనర్ లేఖ
దీంతో వీజీ సిద్ధార్థ నదిలో దూకి ఉంటారని భావించారు. అదే సమయంలో ఆయన ఉద్యోగులకు, బోర్డు మెంబర్స్కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. దీంతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారని భావించారు. విషయం తెలియగానే పోలీస్, రెవెన్యూ అధికారులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి, నేత్రావతి నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులు డాగ్ స్క్వాడ్ను తీసుకు వస్తే బ్రిడ్జి మధ్యలోకి వెళ్లి ఆగిపోయింది. ఆయన కోసం గాలించడంతో డెడ్ బాడీ ఒక రోజు తర్వాత లభ్యమైంది.
కాగా, వీజీ సిద్ధార్థతో చివరిసారి ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారనే అంశాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ. ఎస్ఎం కృష్ణ కుమార్తె మాళవికను సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. దేశంలో అతిపెద్ద కేఫ్ డే సంస్థతో పాటు హోటల్ బిజినెస్ ఉంది. 1996లో తొలిసారి బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్డులో కాఫీ డేను ఏర్పాటు చేశారు.
మంగళూరు యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్నారు. స్టాక్ మార్కెట్ వ్యాపారం నిర్వహించారు. ఆ తర్వాత కాఫీ వ్యాపారంలోకి ప్రవేశించి, 1993లో పూర్తిస్థాయి బిజినెస్ చేశారు. తక్కువ కాలంలో మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. 1996లో కేఫ్ కాఫీ డేను ప్రారంభించారు. 1760కు పైగా బ్రాంచీలు ఉన్నాయి. 60,000 వెండింగ్ మిషన్లు ఉన్నాయి.
వియన్నా, జెస్ రిపబ్లిక్, మలేషియా, నేపాల్, ఈజిప్ట్లలోను స్టోర్స్ ఉన్నాయి. 15,000 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ ఎస్టేట్ ఉంది. కాఫీ రిటైల్ వ్యాపారంలో కోకాకోలా వంటి మల్టీ నేషనల్ కంపెనీకి వాటా ఇచ్చే అంశంపై వీజీ సిద్ధార్థ ఇటీవలే ఆ కంపెనీతో చర్చలు జరిపారు. 2020 మార్చి ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి కాఫీ రిటైల్ వ్యాపారం సుమారు రూ.2,250 కోట్లుగా ఉంటుందని అంచనా. బెంగళూరుకు చెందిన ఐటీ సర్వీసెస్ కంపెనీ మైండ్ ట్రీలోని తన 20.4 శాతం వాటాను వీజీ సిద్ధార్థ ఇటీవల ఎల్ అండ్ టీకి విక్రయించారు.