మోడీ ప్రభుత్వం బదలీ ఎఫెక్ట్: కీలక ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ (58) VRS (వాలంటరీ రిటైర్మెంట్ స్కీం)కు దరఖాస్తు చేసుకున్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ మంత్రిత్వ శాఖకు బదలీ చేయడంపై ఆయన మనస్థాపం చెందారు. దీంతో విధుల నుంచి స్వచ్చంధంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు.

విద్యుత్ శాఖకు గార్గ్ బదలీ
వివిధ విభాగాల్లోని సీనియర్ ఐఏఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రీషఫిల్ చేసింది. గార్గ్ను విద్యుత్ శాఖ కార్యదర్శిగా బదలీ చేసింది. ఆయన స్థానంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా అతను చక్రవర్తిని నియమించింది. 1985 బ్యాచ్ గుజరాత్ కేడర్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ గార్గ్ 2020 అక్టోబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ మనస్థాపంతో ఇప్పుడు వీర్ఎస్ తీసుకుంటున్నారు.

వీఆర్ఎస్ కోసం దరఖాస్తు
గార్గ్ బుధవారం రోజు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఈ ప్రక్రియలో మూడు నెలల పాటు నోటీసు పీరియడ్ ఉంటుందని, తక్షణమే తన వీఆర్ఎస్కు ఆమోదం తెలపాలని గార్గ్ కోరారని సంబంధిత ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖకు బదలీ అయిన గార్గ్... అక్కడ మూడు నెలలు విధులు నిర్వర్తిస్తారని తెలుస్తోంది. వీఆర్ఎస్ ఆమోదం ప్రాసెస్లో ఉన్నందున ఆయన శుక్రవారం విద్యుత్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.
గార్గ్ ట్వీట్
తనను విద్యుత్ శాఖకు బదలీ చేయడంతో పాటు తన జూనియర్లకు కీలక పదవులు కట్టబెట్టడంతో స్వచ్చంధ పదవీ విరమణ చేయాలని గార్గ్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆర్థిక శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించానని (ఇతరులకు), ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగంలో చాలా నేర్చుకున్నానని, రేపు (శుక్రవారం) విద్యుత్ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నానని, వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నానని గార్గ్ గురువారం నాడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

మార్చిలో ఆర్థిక కార్యదర్శిగా..
గార్గ్ 2017లో ఆర్థిక శాఖలోకి వచ్చారు. గార్గ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. 2014లో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వచ్చారు. ఈ ఏడాది మార్చిలో ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ఏఎన్ ఝా రిటైర్మెంట్ అనంతరం గార్గ్ ఆర్థిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను ప్రకటించిన బడ్జెట్ పార్లమెంట్లో ఆమోదం పొందిన కేవలం ఒక్కరోజుకే బదలీ కావడం గమనార్హం.

సావరిన్ బాండ్స్ ప్లాన్ను పర్యవేక్షించారు
విదేశాల్లో సావరిన్ బాండ్స్ విక్రయం ప్లాన్ను గార్గ్ పర్యవేక్షించారు. అయితే గతకొద్ది నెలలుగా దీనిపై ఆర్బీఐ మాజీ గవర్నర్లు రంగరాజన్, రఘురామ్ రాజన్, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు మండలి సభ్యుడు రతిన్ రాయ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సార్వభౌమ బాండ్స్ అమ్మకంతో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య సంబంధాలకు దెబ్బ అంటున్నారు. ప్రభుత్వానికి ఆర్బీఐ మిగులు నగదు నిల్వల బదలాయింపు అధ్యయనంలోనూ గార్గ్ సభ్యుడిగా పనిచేశారు.


Click it and Unblock the Notifications