6.8 శాతం పెరిగిన రిలయన్స్ లాభం, షేర్ ఆదాయం రూ.17.1
ముంబై: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అంచనాలు మించింది. క్వార్టర్ 1 త్రైమాసికానికి గాను లాభం రూ.10,104 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.17.10 కోట్లు. రిలయన్స్కు జియో, రిటైల్ వ్యాపారాలు దన్నుగా నిలిచాయి. అయితే పెట్రో కెమికల్స్ మార్జిన్ తగ్గింది. అంతకుముందు మార్చి 31వ తేదీతో (10,362 కోట్లు) ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కాస్త తగ్గింది. ఏకీకృత నికర లాభంలో 2.4 శాతం అధికమై రూ.9.036 కోట్లుగా నమోదయింది. రిటైల్ అమ్మకాల కారణంగా సంస్థ ఆదాయం 1,72,956 కోట్లకు చేరుకుంది. మొత్తంగా క్వార్టర్ 1లో అంతకుముందు క్వార్టర్తో పోలిస్తే రిలయన్స్ లాభం 6.8 శాతంగా నమోదయింది.
లోన్స్ చాలా ఈజీ... ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలెన్నో
దూసుకెళ్లిన జియో, రిటైల్ విభాగాలు
అంతక్రితం క్వార్టర్తో వృద్ధి 2.5 శాతం తక్కువ అయినప్పటికీ విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువగా నమోదు చేసింది. మొత్తం లాభంలో 32% వరకు రిటైల్, జియో వాటా కావడం గమనార్హం. జియో నికర లాభం 45.60 శాతం వృద్ధి చెంది రూ.891 కోట్లకు చేరింది. రిటైల్ విభాగ లాభం 47.5% పెరిగి రూ.38,196 కోట్లుగా నమోదయింది. ఏకీకృత నెట్ ప్రాఫిట్లో జనవరి-మార్చిలో నమోదైన రూ.10,362 కోట్లు ఇప్పటి వరకు అధికం. స్టాండలోన్ లాభం 2.4 శాతం వృద్ధితో 9,036 కోట్లు నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ కాలానికి కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,72,956 కోట్లు.
ఒత్తిడిలో ఉన్న పెట్రో కెమికల్స్ మార్జిన్ తక్కువ
కొత్తగా మరిన్ని రిటైల్ అవుట్ లెట్స్ ప్రారంభించడం, జియోకు 2.46 కోట్ల మంది జతకావడం వల్ల లాభాల్లో వృద్ధిని నమోదుకు దోహదం చేసింది. గత మూడు నెలల్లో దేశవ్యాప్తంగా 229 నూతన స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 10,644కి చేరుకున్నాయి. రిటైల్ బిజినెస్ నికర లాభం 70 శాతం పెరిగి రూ.2,049 కోట్లకు చేరుకుంది. ఆదాయంలో 47.5 శాతం అధికమై రూ.38,196 కోట్లకు చేరుకుంది. చమురు రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపార మార్జిన్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ లాభాల్లో వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఇందులో స్థూల రిఫైనింగ్ మార్జిన్(GRM) బ్యారెల్ 8.1 డాలర్లుగా ఉంది. సింగపూర్ కాంప్లెక్స్ మార్జిన్(4.6 డాలర్లు)తో పోలిస్తే ఇది ఎక్కువ. అయితే విశ్లేషకులు 8 అంచనా వేయగా, 8.1 డాలర్లు నమోదు కావడం గమనార్హం.
పోటీ కంపెనీల కంటే దూసుకెళ్తున్న రిలయన్స్
పోటీ కంపెనీల కంటే రిలయన్స్ రిటైల్ దూసుకుపోతోంది. 6,700 నగరాల్లో 2.30 కోట్ల చ.అ.విస్తీర్ణంలో రిటైల్ రంగాన్ని విస్తరించింది. 10 కోట్ల మంది వినియోగదారులను ఆకట్టుకుంది. జియో నిర్వహణ ఆదాయం 44 శాతం పెరిగి రూ.11,679 కోట్లకు చేరుకుంది. ఆదాయాలు 54.5 శాతం పెరిగి రూ.14,910 కోట్లకు చేరుకుంది. మొత్తం కస్టమర్లు 33.13 కోట్లకు పెరిగారు. ARPU గత క్వార్టర్ 4తో పోలిస్తే రూ.126.2 నుంచి రూ.122 కు తగ్గింది. ఇక, రిటైల్ విభాగం రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. విక్రయాలు 47.5 శాతం వృద్ధితో రూ.25,890 కోట్ల నుంచి రూ.38,196 కోట్లకు పెరిగింది. ఎబిటా 69.9 శాతం పెరిగి రూ.1,206 కోట్ల నుంచి రూ.2,049 కోట్లకు చేరుకుంది.
గ్రూప్ షేర్ వారీ ఆర్జన రూ.17.1
రిలయన్స్ గ్రూప్ షేర్ వారీ ఆర్జన (EPS) రూ.17.1కి చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.16. అప్పులు స్వల్పంగా పెరిగాయి. మార్చి 31, 2019 చివరి నాటికి రూ.2,87,505 కోట్ల అప్పులు ఉండగా, ఇప్పుడు రూ.2,88,243 కోట్లకు చేరుకున్నాయి. కంపెనీ చేతిలో నగదు నిల్వలు రూ.1,33,027 కోట్ల నుంచి రూ. 1,31,710 కోట్లకు తగ్గాయి.
టవర్ల నిర్మాణంలో బ్రూక్ ఫీల్డ్ పెట్టుబడి
మొబైల్ టవర్ల నిర్వహణ వ్యాపార విభాగంలో అంతర్జాతీయ సంస్థ బ్రూక్ ఫీల్డ్ రూ.25,215 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఇందుకు సంబంధించి అనుబంధ విభాగం రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్.. బ్రూక్ఫీల్డ్ అసెట్స్ మేనేజ్మెంట్ ఇంక్ అనుబంధ సంస్థ బీఐఎఫ్ ఐవీ జర్విస్ ఇండియాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ నిధుల్ని జియో రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది.