అజీమ్ ప్రేమ్జీ వీడ్కోలు!: విప్రోకు ఆ 4 రంగాలు కీలకం, చైర్మన్గా చివరి సూచన
బెంగళూరు: విప్రో చైర్మన్గా అజీమ్ ప్రేమ్జీ మంగళవారం చివరిసారి వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) మాట్లాడారు. విప్రో భవిష్యత్తు ఉజ్వలంగా ఉండనుందని, కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కొత్త వ్యూహాలు అమలు చేయనుందన్నారు. తమ ఐటీ సంస్థ ముఖ్యంగా డిజిటల్, క్లౌడ్, ఇంజినీరింగ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ అనే నాలుగు న్యూ-ఏజ్ టెక్నాలజీలపై దృష్టి సారించిందన్నారు. ఇది సంస్థ వృద్ధికి ఎంతో తోడ్పడుతుందన్నారు.
వంటనూనె కంపెనీ నుంచి గ్లోబల్ ఐటీ దాకా.. ప్రేమ్జీ ప్రస్థానం! సేవా కార్యక్రమాల కోసం రూ.వేలకోట్లు
ఆ 4 విభాగాలపై భారీ పెట్టుబడి
అజీమ్ ప్రేమ్జీ ఐదు దశాబ్దాల తర్వాత.. ఈ నెలాఖరున కంపెనీ చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగి, తన తనయుడు రిషద్ ప్రేమ్జీకి బాధ్యతలు అప్పగిస్తున్నారు. అజీమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫౌండర్ చైర్మన్గా మాత్రమే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన 73వ AGMలో షేర్ హోల్డర్స్ను ఉద్దేశించి మాట్లాడారు. వాటాదార్లకు లేఖలు కూడా రాశారు. బోర్డు అప్రూవల్ అనంతరం పై నాలుగు రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్త టెక్నాలజీలపై దృష్టి సారిస్తూనే గత సంవత్సరం డేటా సెంటర్ బిజినెస్ను అక్వైర్ చేసుకున్న అంశాన్ని ప్రస్తావించారు.
విప్రో భవిష్యత్తు ఉజ్వలంగా..
సామర్థ్యాన్ని పెంచుకునేందుకు విప్రో భారీగా పెట్టుబడులు పెడుతుందని, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ విలువలకు కట్టుబడి కొనసాగిన ప్రస్థానం, ఇకముందు కూడా అలాగే ఉంటుందని ప్రేమ్ జీ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విప్రో భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందన్నారు. షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు, షేర్ హోల్డర్స్ ఆమోదం తెలిపారని, సెబీ అనుమతుల మేరకు ఆగస్ట్లోగా ఈ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు.
వంట నూనెల సంస్థ నుంచి...
వంట నూనెల సంస్థగా మొదలైన కంపెనీ ఇప్పుడు 8.5 బిలియన్ డాలర్ల భారీ ఐటీ దిగ్గజంగా ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నారు. తన వరకూ ఇది ఒక అసాధారణ ప్రయాణమని, నిత్యం కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ, ఈ కంపెనీ తాను మెరుగుపర్చుకొని ముందుకు సాగిందన్నారు. విలువలకు కట్టుబడి ఉండటంతో పాటు ఉద్యోగుల నిబద్ధత, శ్రమతో ఇది సాధ్యమైందన్నారు. తన తనయుడు రిషద్ విప్రోను మరింత వృద్ధిలోకి తీసుకు రావాలన్నారు. 2007 నుంచి అతను లీడర్ షిప్ టీంలో ఉన్నారని, కంపెనీ గురించి, వ్యాపార వ్యూహాల గురించి, విలువల గురించి అతనికి అవగాహన ఉందన్నారు.
దాతృత్వ కార్యక్రమాలకు భారీ మొత్తం
విప్రో చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన అనంతరం అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ దాతృత్వ కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పారు. మన సంపదకు మనం ధర్మకర్తలుగా ఉండాలని, యజమానులుగా కాదని చెప్పారు. గతంలో తాను ప్రకటించినట్లుగా నా వ్యక్తిగత ఆస్తుల మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్రేమ్ జీ దాతృత్వ సేవల కోసం డొనేట్ చేసిన మొత్తం దాదాపు 21 బిలియన్ డాలర్లు. విప్రోలో ఎకనామిక్ ఓవర్షిప్లో 67 శాతం. దాతృత్వ కార్యక్రమాల కోసం ఏ భారతీయ వ్యాపారవేత్త ఇవ్వనంత మొత్తం ఇది.
విప్రో బైబ్యాక్
గత అయిదేళ్లలో మార్చి 31, 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి విప్రో షేర్ ఆర్జన (EPS) 18.6% పెరిగిందని అజీమ్ ప్రేమ్ జీ చెప్పారు.
షేర్ హోల్డర్లకు దీర్ఘకాలంలో మంచి వ్యాల్యూ అందించడంతో పాటు, భవిష్యత్ వృద్ధికి అవసరమయ్యే పెట్టుబడుల్ని సమీకరించేందుకు మూలధన కేటాయింపు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే బోనస్, డివిడెండ్ షేర్స్ ఇస్తున్నామని, ఇప్పటికే రూ.10,500 కోట్ల బైబ్యాక్ను ప్రకటించామని, దీనిని ఆగస్టులోగా పూర్తి చేస్తామన్నారు. 1,70,000కు పైగా ఉద్యోగులున్న విప్రో వృద్ధి బాటలో నడపడం తమ బాధ్యత అన్నారు. డిజిటల్, AIవంటి సాంకేతికతల్ని అందిపుచ్చుకోవడం ఉద్యోగులకు కీలకమన్నారు. నైపుణ్యం పెంచేందుకు పెట్టుబడులు పెట్టామని చెప్పారు. గత కొన్నేళ్లుగా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యాలలో విజయవంతంగా స్థానికులకు పెద్దపీట వేశామన్నారు. వాతావరణ మార్పులపై తమకు అవగాహన ఉందని, అందుకే పునరుత్పాదక ఇంధన ఉపయోగం పెంచామని, దీని వాటా 40 శాతానికి చేరిందన్నారు. అలాగే రీసైకిల్డ్ నీటి వినియోగం 42 శాతం పెరిగిందని చెప్పారు. విద్యకు తాము తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పాఠశాల విద్య కోసం 166 సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, నీటి, జీవ వైవిధ్యంపై దృష్టి సారించే ఉద్దేశ్యంలో భాగంగా ఏర్పాటు చేసిన విప్రో ఎర్తియన్ ద్వారా 9 ఏళ్లలో 8,600 స్కూళ్లకు సేవలు అందించామన్నారు.