ఛారిటీ పేరుతో ఛీట్ చేస్తే తాటతీసే మోడీ మార్క్ కొత్త చట్టం !
ఛారిటబుల్ ట్రస్ట్, ఎడ్యుక్యేషనల్ ఇన్స్టిట్యూషన్, ఛారిటీ హాస్పిటల్ పేర్లతో ఎన్నో సంస్థలు సందు సందుల్లో వెలిశాయి. అవి ఎంత సేవ చేస్తున్నాయో తెలియదు కానీ.. అధిక శాతం వాటిని ట్యాక్స్ సేవింగ్ కోసం పెద్ద కంపెనీలు, బడా వ్యక్తులు వాడుతూ ఉంటారు. ఆదాయపు పన్ను శాఖ అనుమతి పొందిన ఇలాంటి సంస్థలపై పెద్దగా దృష్టి ఉండకపోవడం, వీటిల్లోని ఆర్థిక లావాదేవీలపై పన్నులు లేకపోవడం వంటివి ప్లస్ పాయింట్. అయితే తాజాగా వచ్చిన కొత్త చట్టాల నేపధ్యంలో ఇలాంటి వాటిల్లో ఏ చిన్న లొసుగు గమనించినా ఐటీ కమిషనర్ వాటిని రద్దు చేసే సర్వాధికారాలను కేంద్రం కట్టబెట్టింది. దీంతో వీటిని అడ్డుపెట్టుకుని లోలోపల ఇతర కార్యకలాపాలకు తెరదీసే అనేక సంస్థలకు మోడీ సర్కార్ ఊహించని షాక్ ఇవ్వబోతోంది.
ఇండిగో కన్నా పాన్షాప్ యాపారం మేలు
కమిషనర్కు సర్వాధికారాలు
ఐటి యాక్ట్ సెక్షన్ 12ఎఎ నిబంధనల ప్రకారం ఏదైనా స్వచ్ఛంద సంస్థకు రిజిస్ట్రేషన్ వస్తే వాటిని ట్రస్ట్ కింద పరిగణిస్తారు. అందుకోసం కఠిన నిబంధనలు ఉంటాయి. చట్టాలకు అనుగుణంగా అనేక లక్ష్యాలను సదరు సంస్థ అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఏ ఇతర చట్టాన్ని వీళ్లు అతిక్రమించినా సదరు ఐటీ కమిషనర్ మొత్తం రిజిస్ట్రేషన్ను రద్దు చేసే అపరిమిత అధికారాన్ని కల్పించారు. వాళ్ల వాదన వినిపించే అవకాశం ఉన్నా.. అది తర్వాతి దశ మాత్రమే.
క్యాన్సిల్ చేస్తే..
స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే అతి భారీ మూల్యాన్నే వాళ్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది. మొదటగా వాళ్ల సంపాదన, ఆదాయం, లాభమేదీ ట్యాక్స్ ఫ్రీ కాదు. ప్రతీ దానిపైనా వాళ్లు పన్ను కట్టాలి. అదే సమయంలో సంస్థ ఎగ్జిట్ ట్యాక్స్ కట్టాలి. అది కూడా అప్పటి వరకూ ఉన్న ఆస్తుల మార్కెట్ వేల్యూపై గరిష్టంగా 42.74 శాతం పన్నును చెల్లించి మరీ వెళ్లాలి. ఇదే వాళ్లకు ఊహించని అతిపెద్ద గట్టి దెబ్బ. ప్రధానంగా ఇది విద్యాసంస్థలకు, ఆసుపత్రులపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ప్రధాన నగరాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలు ఏవైనా అవకతవకలతో ఐటీ అధికారులకు చిక్కితే వాటి పనైపోయినట్టే లెక్క.
అన్ని అధికారాలా ?
స్వచ్ఛంద సంస్థల ముసుగుతో కొన్ని కంపెనీలు అక్రమాలకు పాల్పడ్తుంటాయి. పెద్ద పెద్ద విద్యాసంస్థలు కూడా ఛారిటబుల్ ట్రస్ట్ పేరు కింద వ్యాపారాన్ని నిర్వహిస్తుంటాయి. ఇక హాస్పిటళ్ల సంగతి కూడా అంతే. భారీ స్థాయిలో ఆదాయం, లాభం వస్తున్నావాటిపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండకపోవడం ఇవి బ్లాక్ మనీ కేంద్రాలుగా మారిపోయాయి. బడా కార్పొరేట్ సంస్థలు ప్రత్యేకించి కొన్నిసందర్భాల్లో ఛారిటీల కింద పెట్టి అక్రమాలకు పాల్పడడాన్ని కేంద్రం గుర్తించింది. అందుకే ఇలాంటివాటిపై ఇక అధిక దృష్టి పెట్టి, ఏ చిన్న అవకాశం దొరికినా రిజిస్ట్రేషన్ రద్దు చేయించాలని చూస్తున్నారు. అయితే ఐటీ కమిషనర్కు సర్వాధికారాలు ఇవ్వడం వల్ల అక్రమాలు జరగకుండా చూసుకోవాలని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.