అందరికీ ఉచిత వైద్యం! తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. త్వరలో అందరికీ ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ప్రజలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, మొత్తం ప్రభుత్వం భరిస్తుందట. వంద శాతం ఫ్రీ మెడికల్ సేవలు అందించేందుకు యూనివర్సల్ హెల్త్ ప్రొటక్షన్ స్కీం అమల్లోకి తీసుకు వచ్చే యోచన చేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే వివిధ హెల్త్ స్కీమ్లు ఉన్నాయి.
జూలై1 నుంచే మార్పు.. రైల్వే టైంటేబుల్, RTGS-NEFT ఛార్జీలు
ఒకే గొడుకు కిందకు హెల్త్ స్కీంలు అన్నీ
ఇప్పటికే ఉన్న హెల్త్ స్కీంలన్నింటిని ఒకే గొడుగు కిందకు తెచ్చి సింగిల్ విండో విధానంలో అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరోగ్యశ్రీ, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఆరోగ్య భద్రత, ఆర్టీసీ, సింగరేణి, ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం ఖర్చు చేస్తున్నారు. వీటికి ఏడాదికి రూ.2వేల కోట్లకు పైగా ఖర్చవుతున్నాయని అంచనా. అయితే ఈ కొత్త స్కీం ద్వారా ఫండ్స్ సద్వినియోగం కావడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
కొత్త ప్రతిపాదనలు
వివిధ ఆరోగ్య పథకాల కింద దాదాపు కోటి కుటుంబాలకు వైద్య సేవలు అందుతున్నాయి. అన్నింటిని యూనివర్సల్ హెల్త్ ప్రొటక్షన్ స్కీం (సార్వజనీన ఆరోగ్య పథకం) గొడుకు కిందకు తీసుకువస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యశ్రీ మినహా మిగిలిన ఏ పథకం అమల్లోను ఆన్లైన్ సమాచారం పొందుపర్చడం లేదు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి, వారికి అందుతున్న వైద్యసేవలు.. వంటి వివరాలు లేవు. అన్నింటిని పరిగణలోకి తీసుకొని వైద్య ఆరోగ్య శాఖ కొత్త ప్రతిపాదన సిద్ధం చేసిందట.
ఆయుష్మాన్ భారత్లో చేరి.. ఉచిత వైద్య సేవలు
ఈ అంశంపై వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజేందర్ ఇటీవల అధికారులతో చర్చించారు. అన్ని పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించవచ్చునని అభిప్రాయపడ్డారు. అలాగే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్లో చేరే అంశంపై కూడా చర్చించారు. ఆయుష్మాన భారత్ వల్ల 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో అందులో చేరితే ఆ మేరకు నిధులు వచ్చే అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో సుమారు కోటి కుటుంబాలు ఉండగా, హెల్త్ స్కీంల పరిధిలో రాకుండా స్వచ్చంధంగా బీమా సంస్థల ద్వారా లేదా సొంతగా వైద్య సేవల కోసం ఖర్చు పెడుతున్న కుటుంబాలు లక్ష కుటుంబాల వరకు ఉంటుందని అంచనా వేశారు. అందరికీ కలిపి యూనివర్సల్ హెల్త్ ప్రొటక్షన్ స్కీం తీసుకు వస్తే.. ఆయుష్మాన్ భారత్ సహకారంతో తెలంగాణలోని వారందరికీ ఉచిత వైద్య సేవలు అందించినట్లవుతుందనే అంశంపై చర్చించారు.