గుజరాత్ గిఫ్ట్ సిటీకి బడ్జెట్లో భారీ గిఫ్టులు ! ఏపీ, తెలంగాణ పట్టవా ?
గుజరాత్లో అత్యంత ప్రతిష్టాక్మంగా నిర్మిస్తున్న గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్)కు కేంద్రం ఈ బడ్జెట్లో భారీ రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రత్యేక ప్యాకేజీలు, ప్రత్యేకహోదాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలను గిఫ్టులతో ముంచెత్తబోతున్నారు. పదేళ్ల పాటు ఎలాంటి లాభంపై ఎలాంటి పన్నూ కట్టాల్సిన అవసరం లేకపోవడం ప్రముఖమైన అంశం.
మొబైల్ పోయిందా? ఇకపై ఏ సిమ్ వేసినా ఫోన్ పనిచేయదు!
గిఫ్ట్ సిటీ
గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ను నిర్మిస్తున్నారు. ఇందులో ఏర్పాటు చేసే సంస్థలకు పదేళ్ల పాటు వాళ్ల లాభంపై ఎలాంటి పన్నూ లేకుండా మొత్తాన్ని మినహాయించబోతున్నారు. ఇంతకముందు ఐదేళ్ల పాటు 100 శాతం మినహాయింపు, మరో ఐదేళ్ల పాటు 50 శాతం మాత్రమే మినహాయింపు ఉండేది. అయితే ఇప్పుడు పదేళ్ల పాటు మొత్తం 100 శాతాన్ని కంపెనీలు ఎగ్జంప్షన్ కింద పొందొచ్చు.
వీటికి తోడు సదరు సంస్థలు ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్ పై వచ్చే డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ను కూడా మినహాయించబోతున్నారు. అంతే కాకుండా క్యాపిటల్ గెయిన్స్ పై పన్నుకు ఎగ్జంప్షన్ లభించబోతోంది. గిఫ్ట్ సిటీలో విదేశీ సంస్థలను ప్రోత్సహించడానికే ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు కేంద్రం చెబ్తోంది.
కేంద్రం ఇస్తున్న మరో బెనిఫిట్ ఏంటంటే.. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)లపై క్యాపిటల్ గెయిన్స్ను కూడా ఎగ్జంప్ట్ చేయబోతున్నారు. ఇది ఎక్కువగా విదేశీ పెట్టుబడిదార్లను మనవైపునకు లాగుతుందని కేంద్రం గట్టిగా నమ్ముతోంది.
గిఫ్ట్ కెపాసిటీ రూ.70 లక్షల కోట్లు
కేంద్రం సహా ఎనలిస్టులు చెబ్తున్న లెక్కల ప్రకారం గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ ద్వారా భారత దేశ ఆర్థికవ్యవస్థకు రూ.70 లక్షల కోట్ల వరకూ బిజినెస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. బిజినెస్ మొదలుపెట్టిన పదిహేనేళ్లలో ఎప్పుడైనా పది సంవత్సరాల పాటు తమ లాభాలపై వాళ్లు మినహాయింపును పొందొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఏంటీ గిఫ్ట్ సిటీ
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఐఎల్ఎఫ్ఎస్ సంస్థతో కలిసి గుజరాత్ ప్రభుత్వం ఈ గిఫ్ట్ సిటీని నిర్మిస్తోంది. షాంఘై నగరంలా దీన్ని ఓ స్మార్ట్ సిటీలా నిర్మించి వ్యాపార కార్యకాలాపాలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 886 ఎకరాల మాస్టర్ ప్లాన్లో 67 శాతం కమర్షియల్ అవసరాలకు దీన్ని వినియోగించబోతున్నారు. ఇప్పటికే సుమారు రూ.10500 కోట్ల విలువైన పెట్టుబడులు ఈ ప్రాంతానికి వచ్చాయి. సుమారు 200 కంపెనీలు తమ సేవలను కొనసాగిస్తున్నాయి. దీని ద్వారా 7500 మంది ప్రస్తుతానికి ఉద్యోగాలు పొందుతున్నారు. దశలవారీగా దీన్ని పూర్తిస్థాయిలో నిర్మించేందుకు గుజరాత్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. మొత్తం ఐదు దశల్లో ఈ గిఫ్ట్ సిటీని నిర్మించే క్రమంలో ఇప్పుడు మొదటి దశ మాత్రమే పూర్తైంది.