ప్రైవేటు చేతుల్లోకి రైలు: తొలి PPP ట్రైన్ ఢిల్లీ-లక్నో తేజాస్ ఎక్స్ప్రెస్
న్యూఢిల్లీ: పబ్లిక్-ప్రయివేటు భాగస్వామ్యం (PPP)ద్వారా రైల్వేల అభివృద్ధి, కనెక్టివిటీని పెంచడం ద్వారా ప్రయాణీకులకు మెరుగైన సేవలు, వేగవంతమైన రవాణా వంటి ప్రాజెక్టులు చేపడతామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్లో స్పష్టం చేశారు. రైల్వేల అభివృద్ధికి రానున్న దశాబ్ద కాలంలో 50 లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని, అది ప్రభుత్వంతో సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయపడ్డారు. ఇందులోభాగంగా రైల్వేల విస్తరణ, అభివృద్ధికి PPP భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు. ఈ నేపథ్యంలో రైల్వే సర్వీసుల నిర్వహణలో తొలిసారి ప్రయివేటు రంగం కాలుమోపుతోంది. టెండర్ ప్రక్రియతో దీనిని అప్పగిస్తారు.
మెల్లిగా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి రైల్వే ! ఇదిగో సాక్ష్యం
తేజాస్ ఎక్స్ప్రెస్ రైలు
ఢిల్లీ-లక్నో మార్గం ఇందుకు ప్రయోగాత్మక వేదిక కానుంది. తేజాస్ ఎక్స్ప్రెస్ రైలును ప్రయివేటు ఆపరేటర్లకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. 2016లో ఢిల్లీ-లక్నో మార్గంలో తేజాస్ ఎక్స్ప్రెస్ను ప్రకటించారు. కానీ రైల్వే టైమ్ టేబుల్లో మాత్రం దీనికి ఇటీవలే చోటు దక్కింది. ఈ రైలును యూపీలోని ఆనంద్ నగర్ రైల్వే స్టేషన్లో పార్క్ చేశారు. చాలా కాలంగా వెయిటింగ్ లిస్టులో ఉంది. రానున్న 100 రోజుల్లో 2 రైళ్లను ప్రయివేటుకు అప్పగించనున్నారు. అందులో తేజాస్ మొదటిది.
త్వరలో రెండో రైలు తేల్చనున్నారు
టెండర్ ప్రక్రియ అనంతరం తేజాస్ ప్రయివేటు ఆపరేటర్ చేతుల్లోకి వెళ్తుంది. రెండో రైలును త్వరలో తేల్చనున్నారు. ఇది 500 కిలో మీటర్ల డిస్టెన్స్ రేంజ్లో ఉండనుందని దీనిపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రైళ్ల నిర్వహణను ప్రయివేటు ఆపరేటర్లకు అప్పగించాలన్న నిర్ణయాన్ని రైల్వే కార్మిక, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి.
పర్యాటక ప్రదేశాల అనుసంధానం
ఈ రెండు రైళ్ళు ప్రయోగాత్మకంగా నడుపుతామని, రానున్న 100 రోజుల్లో వీటిలో ఒకదానిని అయినా రన్ చేస్తామని భావిస్తున్నామని, తక్కువ రద్దీ రూట్లను గుర్తించడం, ముఖ్య పర్యాటక ప్రదేశాలను అనుసంధానం చేయడం వంటి ఆలోచనలతో ముందుకు సాగుతున్నామని, రెండో రైలును కూడా త్వరలో గుర్తిస్తామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
ఢిల్లీ - లక్నో మధ్య 53 రైళ్లు
ఢిల్లీ - లక్నోల మధ్య ప్రస్తుతం 53 రైళ్లు ఉన్నాయి. కానీ రాజధాని మాత్రం లేదు. ఈ రూట్లో బాగా డిమాండ్ ఉన్న రైలు స్వర్ణ శతాబ్ధి. ఇది ఆరున్నర గంటల సమయం తీసుకుంటుంది. ప్రయివేటు ఆపరేటర్ల చేతుల్లోకి వెళ్లే రైళ్ల అంశంపై జూలై 10వ తేదీ లోపు ప్రతిపాదనలు ఫైనలైజ్ చేస్తారు. 100 రోజుల ప్రణాళికలో 2 రైళ్లను ప్రయివేటు ఆపరేటర్లకు అప్పగించడం, ముఖ్య నగరాలను అనుసంధానించి, రోజంతా రైళ్లు నడపడం వంటి అంశాలతో బిడ్డింగ్కు సిద్ధంగా ఉన్నారు. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్, రిక్వెస్ట్ ఫర్ కోట్ మార్గాల్లో అప్పగించనున్నారు.