ఇండియాకు కోటీశ్వరుల గుడ్బై!: సూపర్ రిచ్ కంటే ఎన్నారైలకే బెట్టర్!!
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇండియన్ సూపర్ రిచ్ కంటే ఎన్నారైలకు ఎక్కువ వెసులుబాట్లు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019-20 బడ్జెట్లో ఎన్నారైలకు ఎన్నో అనుకూల నిర్ణయాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అదే సూపర్ రిచ్పై వడ్డీ భారం పెరుగుతోందని చెబుతున్నారు.
రూ.1 కోటి సంపాదిస్తున్న వారి సంఖ్య 81,344
ఇండియాలోని సూపర్ రిచ్లకు ఈసారి బడ్జెట్ ఒకింత చేదు కలుగజేసింది. రూ.2 కోట్లు అంతకుమించి సంపాదించే వారికి పన్ను శాతం పెంచింది. రూ.2-5 కోట్ల వరకు సంపాదించే వారి పన్నును 15 శాతం నుంచి 25 శాతానికి పెంచింది. మొత్తంగా ట్యాక్స్ 39 శాతం అవుతుంది. రూ.5 కోట్లు అంతకుమించి సంపాదించే వారిపై 15 శాతం నుంచి 37 శాతానికి పెంచింది. ఇది 42.7 శాతం వరకు కానుంది. దేశంలో రూ.1 కోటికి మించి ఆదాయం పొందుతున్న వారు 2017-18 ఆర్థిక సంవత్సరం ప్రకారం 81,344 మంది ఉన్నారు. ఇందులో 6,361 మంది రూ.5 కోట్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు.
ఇండియా వదిలి వెళ్తున్న సూపర్ రిచ్
గత కొన్నేళ్లుగా సూపర్ రిచ్ వ్యక్తులు ఇండియా నుంచి తరలి వెళ్తున్నారు. ట్యాక్స్ రేటు తక్కువగా ఉన్న దేశాలకు వెళ్ళి సెటిల్ అవుతున్నారట. 2014-2017 మధ్య 23,000 మంది డాలర్ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారని అంచనా. వీరి ఆస్తుల విలువ రూ.7 కోట్లకు పైగా ఉంటుంది. వీరు తమ స్థిర నివాసాన్ని మార్చుకున్నారు. గత ఏడాది 5,000 మంది సూపర్ రిచ్ ఇండియన్స్ శాశ్వతంగా ఇండియా వదిలి వెళ్లారు. 2014లో 6,000, 2015లో 4,000, 2016లో 6,000, 2017లో 7,000, 2018లో 5,000 మంది వెళ్లిపోయారు. ఫ్రాన్స్ (1.3 శాతం), చైనా (1.1 శాతం)తో పోలిస్తే భారత్ (2.1 శాతం) నుంచి వెళ్లిన మిలియనీర్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఎన్నారైలకు బడ్జెట్ ప్రయోజనాలు
కేంద్ర బడ్జెట్లో ఎన్నారైలకు వరాలు కురిపించారు. భారత్ పాస్పోర్టు ఉన్న ఎన్నారైలు స్వదేశానికి తిరిగి రాగానే వారికి ఆధార్ కార్డు కావాలంటే ఇదివరకు కనీసం 180 రోజులు భారత్లో నివసించాలి. కానీ ఇప్పుడు మార్పులు తెచ్చింది. కొత్త రూల్ ప్రకారం విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆధార్ కార్డు తీసుకోవచ్చు. అంటే ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదు. ఎన్నారై పోర్ట్పోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీంను ఫారెన్ పోర్ట్పోలియో ఇన్వెస్ట్మెంట్తో మెర్జ్ చేయడం ద్వారా ఎన్నారైలు ఇండియన్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని సరళతరం చేస్తున్నారు. వారి పెట్టుబడులు కూడా పెంచుతున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక గుర్తింపు బ్యాంకుల ద్వారానే ఎన్నారైలు షేర్స్ కొనుగోలు చేయవచ్చు. అలాగే, కంపెనీలో ఎన్నారైల వాటా 24 శాతంగా ఉండాలి. ఎఫ్పీఐ మార్గంలో 100 శాతం పెంచుకోవచ్చు. అది కూడా ఫారన్ బ్యాంకుల ద్వారా. తాజా బడ్జెట్ ఎన్నారైలకు ఆనందాన్ని ఇచ్చేది.