జాగ్రత్తపడండి!: సెప్టెంబర్ 1 నుంచి 20 కోట్ల ఆ పాన్కార్డ్లు చెల్లవు
న్యూఢిల్లీ: వచ్చే నెల (ఆగస్ట్) 31వ తేదీలోపు మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోకపోతే.. మీ పాన్ కార్డు రద్దు కానుంది. పాన్ - ఆధార్ లింకింగ్కు మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ లోపు లింక్ చేయకుంటే దేశంలోని దాదాపు 20 కోట్లకు పైగా పాన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆప్ డైరెక్ట్ ట్యాక్స్ (CBDT) అధికారి ఒకరు వెల్లడించారు.
బంగారం ధరలు ఎందుకు పెరిగాయో తెలుసా?
పాన్ కార్డు ఓసారి రద్దు చేస్తే....
దేశంలో మొత్తం 43 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయని సదరు అధికారి వెల్లడించారు. 120 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉందని చెప్పారు. ఇప్పటి వరకు ఆధార్ -పాన్ లింక్ చేసుకున్న వారు 50 శాతమేనని చెప్పారు. 43 కోట్ల మందిలో 22 కోట్ల మందికి పైగా మాత్రమే లింక్ చేసుకున్నారని చెప్పారు. అనుసంధానం చేసుకోని వారి పాన్ కార్డులు రద్దు చేయనున్నారు. ఓసారి ఆదాయపన్ను శాఖ మీ పాన్ను రద్దు చేస్తే దానిని ఉపయోగించలేరు.
చట్టవిరుద్ధంగా పాన్ కార్డుల ఉపయోగం
రుణాలు, క్రెడిట్ కార్డులు పొందేందుకు చట్టవిరుద్ధంగా పాన్ కార్డులు వినియోగించినట్లు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆధార్ కార్డుతో లింక్ చేయని పాన్ కార్డులను రద్దు చేయాలని ఇన్కం ట్యాక్స్ డిపార్టుమెంట్ నిర్ణయించింది. నేపాల్, భూటాన్లలో కూడా భారత్ పాన్కార్డులను గుర్తింపు
కార్డులుగా కొంతమంది వినియోగిస్తున్నారు.
సెప్టెంబర్ 1 నుంచి చెల్లుబాటు కావు
ఈ నేపథ్యంలో ఆ 20 కోట్ల పాన్కార్డుల్లో ఒకరికి ఒకటి కంటే ఎక్కువగా ఉండటం లేదా ఆధార్ లేకుండా అంతకుముందు పాన్ కార్డు తీసుకున్నవి అయి ఉండవచ్చు. పాన్ కార్డు కలిగి ఉండి, ఆధార్ కార్డు లేనివారికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉందని చెబుతున్నారు. ఆగస్ట్ 31వ తేదీలోగా ఆధార్ - పాన్ లింక్ చేయకుంటే, అలాంటి పాన్ కార్డులు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి చెల్లుబాటు కావు.