కంపెనీల్లో వాటా తగ్గించేందుకు 2ఏళ్ల గడువు? 35%కి పెరిగితే లాభాలు.. ఆందోళనలు!
న్యూఢిల్లీ: లిస్టైన కంపెనీల్లో పబ్లిక్ షేర్ హోల్డర్స్ వాటాను 35 శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా -SEBI) దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే పబ్లిక్ హోల్డర్స్ వాటాను 35 శాతానికి పెంచుకునేందుకు స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీలకు సెబి రెండు సంవత్సరాల గడువు ఇవ్వవచ్చునని తెలుస్తోంది.
మీరు లోన్ డిఫాల్టరా?: మరో కొత్త చిక్కులో పడినట్లే!
అన్ని సంస్థలకు ఒకే నియమ నిబంధనలు
ప్రభుత్వరంగ సంస్థలు సహా అన్ని కంపెనీలకు నియమ నిబంధనలు, కాల పరిమితి ఒకేలా ఉంటాయని ఓ అధికారి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఐతే దీనిపై విస్తృతస్థాయిలో చర్చించిన అనంతరమే సెబి మార్గదర్శకాలను జారీ చేయనుందని చెబుతున్నారు. 35 శాతం కేటాయిస్తే టేకోవర్ కోడ్ నిబంధనల విషయంలో తలెత్తే పరిణామాలపై సెబీ దృష్టి సారించిందని తెలుస్తోంది. ప్రమోటర్స్ షేర్ హోల్డింగ్ 75 శాతం నుంచి 65 శాతానికి తగ్గించాలని తాజా కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు.
లిస్టైన కంపెనీల్లో ప్రస్తుతం ఇలా..
ప్రస్తుత నిబంధనల మేరకు భారత్లో లిస్టైన కంపెనీల్లో కనీసం 25 శాతం వాటా పబ్లిక్ షేర్ హోల్డర్లు కలిగి ఉండాలి. ప్రమోటర్లకు 75 శాతం వరకు షేర్లు ఉండవచ్చు. ఇప్పుడు ప్రమోటర్ల వాటాను మరో పది శాతం తగ్గించి, 65 శాతానికి పరిమితం చేస్తున్నారు. ఇందుకనుగుణంగా సెబి మార్గదర్శకాలు జారీ చేయనుంది.
ప్రమోటర్ల వాటా తగ్గితే ఇబ్బందులివే
ప్రమోటర్ల వాటా తగ్గితే షేర్ల అమ్మకాలపై ఒత్తిడి పెరిగి, మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బడ్జెట్ ప్రభావంతో పాటు ఈ కారణంగా కూడా సోమవారం మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో పాటు విక్రయానికి ఉన్న ఈక్విటీ షేర్ల కొనుకోలుకు ఇన్వెస్టర్ల వద్ద అత భారీ మొత్తం ఉండే అవకాశం ఉంటుందా అనేది కూడా చర్చ కూడా సాగుతోంది. ఉదాహరణకు లాభాల్లో ఉన్న షేర్లు కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తారు. కానీ నష్టాల్లో ఉన్న లేదా లాభదాకయం కాని వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించరు. ఇవన్ని పరిశీలించి సెబీ నిర్ణయం తీసుకోనుంది.
పాజిటివ్.. నెగిటివ్
అదే సమయంలో పబ్లిక్ షేర్ హోల్డర్ల వాటా 35 శాతానికి పెరిగితే స్టాక్స్కు పాజిటివ్గా ఉంటుందని, అలాగే, ప్రపంచవ్యాప్తంగా భారత్ బలం మరింత పెరుగుతుందని, బెట్టర్ కార్పోరేట్ పాలనకు మార్గం అవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అయితే అక్వైజేషన్ ఖరీదు అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.