బడ్జెట్లో ఏపీ-తెలంగాణకు మొండిచేయి చూపించారా?
అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు... ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు బడ్జెట్లో కేటాయింపులపై ఇరు రాష్ట్రాల విపక్ష నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ నేతలు బడ్జెట్పై సంతృప్తిగా లేరు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సెంట్రల్ వర్సిటీకి రూ.13కోట్లు, ఏపీ ట్రైబల్ వర్సిటీకి రూ.8 కోట్లు, హైదరాబాద్ ఐఐటీకి రూ.80 కోట్లు.. ఇలా కేటాయింపులు చేశారు. ఏపీ ఐఐటీ, ఐఐఎం, నిట్, ఐఐఎసీఈఆర్ , ట్రిపుల్ ఐటీలకు కేటాయింపులు లేవు.
రేవంత్ రెడ్డి ఆగ్రహం
కేంద్ర బడ్జెట్ పైన తెలంగాణ కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. విద్య, ఉద్యోగాల కోసం ఎలాంటి ప్రోత్సాహకాలు లేవన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి రూపాయి కేంద్రానికి వెళ్తే 65 పైసలు మాత్రమే ఇక్కడకు వస్తోందన్నారు. తెలంగాణకు బడ్జెట్లో తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీలు బడ్జెట్ పైన నోరు మెదపడం లేదని ఆరోపించారు. నిర్మలా సీతారామన్ దక్షిణాది నేత అయినా ప్రధాని చేతిలో కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు.
విజయసాయి రెడ్డి అసంతృప్తి
బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అన్నారు. బడ్జెట్ నిరాశపరిచిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావన ఏదని ప్రశ్నించారు. విశాఖపట్నం, బెజవాడ మెట్రో రైలుకు నిధుల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి నిధుల కేటాయింపుపై స్పష్టత లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తమకు ముఖ్యమన్నారు.
నిధులు
బ్యాక్ వర్డ్ రీజీయన్ ప్రాంతాల సహాయం కింద ఏపీ, తెలంగాణ, బీహార్, పశ్చిమ బెంగాల్లకు ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్, రెవెన్యూ లోటు నిధులు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. కాగా, నిధుల కేటాయింపు ఎలా ఉందనేది పూర్తిగా తెలియడానికి బడ్జెట్ పత్రాలను పూర్తిగా పరిశీలించవలసి ఉంటుంది.