రైతులకు కేంద్రం శుభవార్త, మద్దతు ధరల పెంపు: అదానీకి 3 విమానాశ్రయాలు
న్యూఢిల్లీ: రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2019-20 సంవత్సరానికి గాను ఖరీఫ్ సీజన్కు కనీస మద్దతు ధరను (MSP)ని పెంచింది. వరి ధరను క్వింటాల్కు 3.7 శాతం వరకు అంటే, రూ.65 పెంచింది. మొత్తంగా పంటలపై 1 శాతం నుంచి 9 శాతం పెంచింది. ఈ పెంపుతో వరి ధర క్వింటాల్కు రూ.65 పెరిగి రూ.1,815కు చేరుకుంది. సోయాబీన్ గత ఏడాది రూ.3,399గా ఉండగా, ఇప్పుడు రూ.3,710కి అయింది. నూనె గింజలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలకు మద్దతు ధర పెరిగింది. కేంద్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రైల్వే టిక్కెట్ దాదాపు ఉచితం!!: SBI కార్డుతో ఇలా చేయండి...
|
ఇచ్చిన హామీ మేరకు ధరల పెంపు
రైతుకు సాగు ఖర్చుపై 50 శాతం అదనపు ధర కల్పిస్తామని హామీఇచ్చామని, ఈ మేరకు తాజాగా కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ బుధవారం తెలిపారు. వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన మాటకు కట్టుబడి అందుకు అనువైన చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 14 పంటల కనీస మద్దతు ధరను ఖరారు చేశారు. తాజా MSP ఖరారు వల్ల తాము పెట్టిన ఖర్చులపై సజ్జలు 85%, మినుములు 64%, కందులపై 60% అదనపు ఆదాయం రానుంది. వరికి రూ.65, జొన్నలకు రూ.120, రాగులకు రూ.253 పెంచారు. కందిపప్పుకు రూ. 215, పెసరపప్పుకు రూ.75, మినప్పప్పుకు రూ.100 పెంచారు. FCIతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు రైతులకు మద్దతు ధర అందించడంలో తోడ్పడుతాయి. నాఫెడ్, ఎస్ఎఫ్ఏసీ, ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు పప్పు దినుసులు, నూనె గింజల సేకరణను కొనసాగిస్తాయన్నారు. పత్తికి మద్దతు ధర అందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ నిర్ణయిస్తుందన్నారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐకి నాఫెడ్ సహకరిస్తుందన్నారు. కనీస మద్దతు ధరకు సరకు కొనుగోలు చేసే క్రమంలో నోడల్ ఏజెన్సీలకు ఏదైనా నష్టం వాటిల్లితే కేంద్రం ఆ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తుందన్నారు.
అదానీ గ్రూప్కు విమానాశ్రయాలు
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (AAI) చెందిన అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయ కార్యకలాపాలను అదానీ గ్రూప్ నిర్వహించనుంది. ఈ మేరకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గత ఫిబ్రవరిలో మూడు విమానాశ్రయాలను 50 ఏళ్ల పాటు నిర్వహించేందుకు బిడ్ సమర్పించిన అదానీ గ్రూప్ దానిని దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ విమానాశ్రయాలు AAI ఆధ్వర్యంలో ఉన్నాయి. విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి బాధ్యతను పీపీపీ కింద అత్యధిక మొత్తానికి బిడ్డింగ్ చేసిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మూడు విమానాశ్రయాలను 50 ఏళ్ల కాలానికి ఆ సంస్థకు లీజుకిస్తారు.
కార్మికుల వేతనాలపై...
మరోవైపు, కార్మికుల వేతనాలకు సంబంధించి ఇప్పుడున్న చట్టాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, దేశవ్యాప్తంగా కార్మికుల కనీస వేతనాలను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించేందుకు వీలు కల్పించే వేజెస్ కోడ్ బిల్లును ఆమోదించింది. ఈ సమావేశాల్లో బిల్లును పెడతారు. వేజెస్ కోడ్ బిల్లును 2017 ఆగస్ట్ 10న లోకసభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీనిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించారు. 2018 డిసెంబర 18న కమిటీ తన నివేదిక ఇచ్చింది. అయితే మే నెలలో 16వ లోకసభ రద్దు కావడంతో బిల్లు మూలనపడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వేతన చెల్లింపుల చట్టం-1936, కనీస వేతన చట్టం-1948, బోనస్ చెల్లింపుల చట్టం-1965, సమాన పారితోషిక చట్టం-1976 స్థానంలో ఈ బిల్లును తీసుకు వస్తున్నారు.
సరోగసి విధానం
సరోగసీ విధానాన్ని వ్యాపారం చేయకుండా నిరోధించే సరోససీ (రెగ్యూలేషన్) బిల్లు 2019ను కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం పిల్లలులేని దంపతుల దగ్గరి చుట్టాలను మాత్రమే సరోగసీ విధా నానికి అనుమతిస్తారు. ఇందుకు తగినట్లుగా నిబంధనలు ఉన్నాయి. కేంద్రంస్థాయిలో జాతీయ సరోగసీ బోర్డు, రాష్ట్రాల స్థాయిలో రాష్ట్ర సరోగసీ బోర్డులతోపాటు తగిన ప్రాధికార సంస్థల ద్వారా దేశంలో అద్దెగర్భం వ్యవహారాలను నియంత్రించే లక్ష్యంతో ఈ బిల్లును తెస్తున్నారు.