BSNL ఆదాయం రూ.19308 కోట్లు, నష్టం రూ.14000 కోట్లు
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. విపరీతమైన పోటీని తట్టుకోలేక దాదాపుగా చేతులెత్తేసిన సంస్థ అప్పుల ఊబిలోకి కూరకుపోతోంది. ఉద్యోగుల జీతాలకు కూడా డబ్బులు చెల్లించలేని స్థితికి దిగజారిపోతోంది. అటు వైపు కేంద్రం కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేకపోతోంది. దీంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ సంస్థ ఏకంగా రూ.14000 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
అంత నష్టం ఎక్కడిది
కేంద్రం పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో ఈ నిజం బయటపడింది. దీని ప్రకారం ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బిఎస్ఎన్ఎల్ రూ.19308 కోట్ల ఆదాయాన్ని, దానిపై రూ.14 వేల కోట్ల నష్టాన్ని ఆర్జించింది. వాస్తవానికి ఇదేదో ఇప్పటికిప్పుడు వచ్చిన లాస్ కాదు. గత మూడు నాలుగేళ్ల నుంచి ఇదే స్థితిని ఎదుర్కొంటోంది భారత్ సంచార్ నిగం. 2015-16లో రూ.4793 కోట్లు, 2016-17లో రూ.7993 కోట్లు, 2017-18లో రూ.14202 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.
ఇదే సమయంలో సంస్థ ఆదాయం కూడా పడిపోతూ వస్తోంది. 2016-17లో రూ.31533 కోట్లు, 2017-18లో రూ.25071 కోట్లుగా ఉంది. ఇక గతేడాది ఇది ఏకంగా రూ.19308 కోట్లకు దిగొచ్చింది.

ఎందుకీభారం
టెలికాం రంగంలో విపరీతమైన పోటీ ఎదురైంది. జియో దెబ్బతో వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ సంస్థలతో పాటు బిఎస్ఎన్ఎల్ కూడా విలవిలలాడిపోయింది. పెద్ద ఎత్తున కస్టమర్లను తగ్గిపోవడం, ఉన్నవాళ్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు, ఉద్యోగాలకు భారీ జీతాలు వంటివన్నీ సంస్థను ముంచేస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి పెద్దగా మార్గాలను కూడా ఈ సంస్థ వెతకడంలో విఫలమైంది. పటిష్టమైన నెట్వర్క్ ఉన్నా దాన్ని వినియోగించుకోవడంలో వీళ్లది అట్టర్ ఫ్లాప్ షో. వీటితో పాటు ఇప్పుడంతా డేటా కోసం చూస్తున్న తరుణంలో వీళ్లింకా వాయిస్ కాల్స్ వైపే ఉండడం కూడా కొంప ముంచింది. కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్టు బిఎస్ఎన్ఎల్ పుట్టిమునిగేందుకు కూడా అన్ని కారణాలున్నాయి. ఇంకో ప్రధాన కారణం సంస్థ జీతాలు. వచ్చిన రూ.14వేల కోట్ల నష్టంతో 75 శాతం జీతాలే ఉన్నాయి. ఇక ఈ సమయంలో బిఎస్ఎన్ఎల్ గట్టెక్కేందుకు ఏవైనా మార్గాలున్నాయా ? ఎలాంటి పరిష్కారాలు సూచిస్తే బిఎస్ఎన్ఎల్ నిలబడ్తుంది ? మీ సలహా ఏంటి .. కామెంట్ చేయండి


Click it and Unblock the Notifications