అక్వా రైతులకు జగన్ గుడ్న్యూస్, ఏడాది వరకు అమలులో..: అప్పుడేం చెప్పారు?
అమరావతి: వైసీపీ ప్రభుత్వం అక్వా రైతులకు మంగళవారం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా అక్వా రైతులకు కూడా పలు హామీలు ఇచ్చారు. ఇందులో యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తానని చెప్పారు. ఈ హామీని నిజం చేస్తూ జూలై 2వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఈ మేరకు జీవో జారీ చేశారు.
ఏపీ బడ్జెట్ అంచనా ఎంతంటే? జగన్ హామీలు తప్ప... కొత్త వాటికి నో!
ప్రభుత్వంపై రూ.720 కోట్ల భారం
అక్వా యూనిట్ రంగానికి యూనిట్ కరెంట్ ధరను రూ.1.50 పైసలకు తగ్గిస్తూ వైసీపీ గవర్నమెంట్ మంగళవారం నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వంపై రూ.720 కోట్ల భారం పడనుంది. అంతే మేర అక్వా రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇదివరకు యూనిట్ ధర రూ.3.75 పైసలుగా ఉంది. ఇప్పుడు రూ.2.25 పైసలు తగ్గించింది. కల్తీ విత్తనాలు, మందుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు విద్యుత్ రేట్లు ఎక్కువగా ఉండటంతో అక్వా రైతులు నష్టపోతున్నారు. దీంతో అక్వా రైతులకు ఊరట లభించనుంది.
సబ్సిడీ మొత్తం విద్యుత్ శాఖ ఇస్తుంది
విద్యుత్ శాఖ డిస్కంలకు సబ్సిడీ మొత్తాన్ని అందిస్తుంది. ఏపీ ట్రాన్సుకో, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీలు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ కార్యదర్శి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీఈఆర్సీ నిర్ణయించిన ధర ప్రకారం ఇది వరకు మూడు రూపాయలకు పైగా వసూలు చేశారు. గత ఏడాది కూడా అక్వా రైతుల విజ్ఞప్తి మేరకు విద్యుత్ ఛార్జీలు యూనిట్కు రూ.2 తగ్గించారు. ఇప్పుడు దీనిని రూ.1.50 పైసలకు తగ్గించారు.
ఏడాది వరకు అమలులో...
జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో పలు జిల్లాల్లో అక్వా రైతుల బాధలు తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే రూ.1.50 పైసలకే విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం కొంత టారిఫ్ తగ్గించింది. ఇప్పుడు జగన్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇది ఒక సంవత్సరం వరకు అమలులో ఉంటుంది.
అక్వా రైతులకు జగన్ ఏం హామీలు ఇచ్చారు?
జగన్ ప్రతిపక్ష నేతగా, పాదయాత్రలో అక్వా రైతులకు పలు హామీలు ఇచ్చారు. కోస్టల్ ప్రాంతంలో కోల్ట్ స్టోరేజ్ ప్లాంట్స్, అక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, రూ.5కే ఎలక్ట్రిసిటీ అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నాలుగో ఏడాదిలో అక్వా ఫుడ్ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు రూ.3.5 లక్షల ఇన్స్టాల్మెంట్తో ఇళ్లు ఇస్తున్నారని, మిగతా అమౌంట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయని, టీడీపీ ప్రభుత్వం ఏ ఇల్లు ఇచ్చిన తీసుకోవాలని, తాము అధికారంలోకి వచ్చాక రూ.3.5 లక్షల చెల్లింపును రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు జగన్ చెప్పారు.