బిర్లా గ్రూప్ సంస్థల అధినేత బీకే బిర్లా ఇకలేరు
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త బీకే బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మెన్ బసంత్ కుమార్ బిర్లా బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 98 ఏళ్లు. బీకే బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు ఛైర్మెన్గా వ్యవహరించడంతో పాటు కృష్ణార్పణ్ చారిటీ ట్రస్టు, పలు విద్యాసంస్థలకు కూడా అధినేతగా వ్యవహిరించారు. దేశంలో పేరుగాంచిన బీకే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ బసంత్ కుమార్ బిర్లా నేతృత్వంలోనే నడిచింది. 1921 జనవరి 12న బీకే బిర్లా జన్మించారు.
ఒక్క భారత్లోనే కాకుండా విదేశాల్లో కూడా బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన సంస్థలున్నాయి. ఖతార్లో బిర్లా పబ్లిక్ స్కూలును బీకే బిర్లా ఏర్పాటు చేశారు. కళ్యాణ్లో బీకే బిర్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్యనందించి మంచి విద్యావేత్తగా పేరుగాంచారు బీకే బిర్లా. ప్రముఖ సామాజికవేత్త జీడీ బిర్లాకు చివరి సంతానం బీకే బిర్లా. చిన్నతనం నుంచే తమకున్న వ్యాపారాలు సంస్థల్లో చాలా చురుకైన పాత్ర పోషించేవారు బీకే బిర్లా.ఆ తర్వాత చిన్నగా ఎదిగి కేశోరాం ఇండస్ట్రీస్కు ఛైర్మెన్ అయ్యారు.
ఇండో - ఇథియోపియన్ టెక్స్టైల్స్ షేర్ కంపెనీని స్థాపించిన తొలి భారతీయ పారిశ్రామికవేత్తగా బీకే బిర్లా గుర్తింపుపొందారు. ఇది భారత్ ఇథియోపియాల సంయుక్త ప్రాజెక్టు. ఈ కంపెనీ ఏర్పాటు తర్వాత ఇథియోపియా చక్రవర్తి ఒకటవ హేల్ సెలస్సీ ఆదేశ అత్యేన్నత అవార్డు ది మెడల్ ఆఫ్ ది మెనెలిక్-IIతో గౌరవించారు. ఇదిలా ఉంటే బీకే బిర్లాకు జయశ్రీ మెహతా, మంజుశ్రీ ఖైతాన్ అనే ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఆదిత్య విక్రం బిర్లా ఉన్నారు. ఆదిత్య విక్రం బిర్లా కుమారుడే కుమార మంగళం బిర్లా. ఆదిత్య విక్రం బిర్లా 1995 అక్టోబర్లో మృతి చెందారు.